త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

G Chinna Reddy | గాంధీని మ‌రోసారి మోదీ ప్ర‌భుత్వం హ‌త్య చేసింది : జీ చిన్నారెడ్డి

P

Telangana | Published On Feb 2, 2026, 8.20 pm IST

G Chinna Reddy | గాంధీని మ‌రోసారి మోదీ ప్ర‌భుత్వం హ‌త్య చేసింది : జీ చిన్నారెడ్డి
Advertisement

G Chinna Reddy | మ‌హాత్మా గాంధీని 1948లో నాథురామ్ గాడ్సే భౌతికంగా హ‌త్య చేశార‌ని.. ప్ర‌స్తుతం పేరు జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి తొల‌గించిన కేంద్రంలోని మోదీ స‌ర్కారు మ‌రోసారి ఆయ‌న‌ను హ‌త్య చేసింద‌ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి విమ‌ర్శించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని అంబేద్క‌ర్ ఆడిటోరియంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర ప్రొఫెషనల్ కాంగ్రెస్ సంయుక్తంగా వీబీ జీ- రాం జీ అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాద‌న్నారు.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి పొందుతున్నారని, కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గాంధీ పేరును తొలగించడంతోపాటు ఈ పథకం రూపురేఖలను కూడా మార్చివేసి రాష్ట్రాలపై భారం మోపిందని, ఇది దేశ ప్రయోజనాలను దెబ్బ తీసేదిగా ఉందని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ గ్రామాన విజయవంతంగా అమలు కావడంతో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని భావించి పేద‌ల కడుపు కొట్టేందుకు మోదీ స‌ర్కారు ఈ పథకం నుంచి గాంధీ పేరును తొలగించిందని విమ‌ర్శించారు. ఉపాధి హామీ ప‌థ‌కానికి మ‌ళ్లీ గాంధీ పేరు పెట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ జాతీయ సెమినార్‌లో అమెరికా బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యామిని అయ్యర్, తమిళనాడు రాష్ట్ర మాజీ ఐఏఎస్ కన్నన్ గోపీనాథన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు నవిక హర్ష, విజయ్, ప్రొఫెషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జీ ఆదిత్య రెడ్డి, నిర్వాహకులు రచనా రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement