త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రైతులు ఎదురు చూస్తున్న‌రు.. రిజర్వాయర్లకు 30 టీఎంసీల నీటిని వెంట‌నే ఎత్తిపోయండి

Harish Rao | సాగు నీటి కోసం రైతులు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నార‌ని.. సిద్దిపేట జిల్లాలోని రిజ‌ర్వాయ‌ర్ల‌కు 30 టీఎంసీల నీటిని వెంట‌నే ఎత్తిపోయాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ల దుస్థితి చూస్తే దుఃఖం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

S

Telangana | Published On Aug 11, 2026, 1.49 pm IST

Harish Rao | రైతులు ఎదురు చూస్తున్న‌రు.. రిజర్వాయర్లకు 30 టీఎంసీల నీటిని వెంట‌నే ఎత్తిపోయండి
Advertisement
  • రిజ‌ర్వాయ‌ర్ల దుస్థితి చూస్తే దుఃఖ‌మొస్తోంది
  • నీళ్లు లేవ‌ని మంచి భూముల‌ను బీడుగా ఉంచారు
  • వ‌చ్చే ఏడాది జూలై నాటికి సాగు, తాగు నీరుకు ఇబ్బంది లేకుండా చూడండి
  • సిద్దిపేట క‌లెక్ట‌ర్‌, ఇరిగేష‌న్ అడ్వైజరి కమిటీకి లేఖ రాసిన హ‌రీశ్‌రావు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్: సాగు నీటి కోసం రైతులు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నార‌ని.. సిద్దిపేట జిల్లాలోని రిజ‌ర్వాయ‌ర్ల‌కు 30 టీఎంసీల నీటిని వెంట‌నే ఎత్తిపోయాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ల దుస్థితి చూస్తే దుఃఖం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయ‌న సిద్దిపేట క‌లెక్ట‌ర్‌, ఇరిగేష‌న్ అడ్వైజరి కమిటీకి లేఖ రాశారు. జిల్లాలో వచ్చే ఏడాది జూలై నాటికి సాగు, తాగు నీటి కొరత లేకుండా చూడాలని కోరారు. రైతులు ఇబ్బందులు ప‌డ‌కుండా ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పని చేయాల‌న్నారు.

సిద్దిపేట జిల్లాలో వచ్చే వానాకాలం వరకు జిల్లా రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మళ్లీ వేసవిలో నీటిని ఎత్తిపోయడానికి మిడ్ మానేరులో సరిపడా నీళ్లను నిల్వ చేసేలా చర్యలు చేపట్టాలి. మంగ‌ళ‌వారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జ‌రిగే సమావేశం సందర్బంగా పలు అంశాల‌ను కమిటీ దృష్టికి తీసుకెళ్లిందుకు లేఖ రాశాను. ఎల్‌నినో ప్రభావంతో జిల్లా స్థాయిలో ఇరిగేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో కొన్ని అంశాలు ప్ర‌స్తావిస్తున్నాను. ఈ అంశాలపై తక్షణమే చర్యలు చేపడితే వచ్చే వానాకాలం వరకు ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించొచ్చు అని ఆ లేఖలో తెలిపారు.

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను నిర్మించుకున్నాం. ఏటా ఈ సమయం వరకే రిజర్వాయర్లలోకి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి నీటిని ఎత్తిపోయడం జరిగేది. కానీ ఈసారి ఇంకా ఎత్తిపోతలు ప్రారంభించలేదు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లు ప్రస్తుతం డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. వీటిని వెంటనే నింపాల్సి ఉంది. అదే విధంగా కొమురవెళ్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు అడుగంటే పరిస్థితిలో ఉన్నాయి అని మాజీ మంత్రి ఆవేద‌న చెందారు.

65 శాతం మంది రైతులే..

ఈ రిజర్వాయర్లలోకి తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు నింపాలి. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి ఈ వానాకాలం పంటల సీజన్లో జిల్లాలోని రైతులకు ప్రయోజనంగా ఉంటుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం 65 శాతం మంది రైతులే వానాకాలం పంటలు సాగు చేశారు. మిగతా వారు సాగునీళ్లు లేవనే ఉద్దేశంతో మంచి భూములను బీడుగా ఉంచారు. ప్రస్తుతం సాగవుతున్న పంటలు గట్టెక్కాలన్నా ఈ రిజర్వాయర్లను నింపడమే శరణ్యం అని లేఖ ద్వారా విజ్ఞప్తి చేసారు.

2027, జూలై నెల వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నది. అప్పటివరకు సాగునీరు, తాగునీటికి కొరత రాకుండా ఉండాలంటే ఇప్పటికిప్పుడు రిజర్వాయర్లలోకి ఎత్తిపోతలు ప్రారంభించాలి. ఈ నీళ్ల వినియోగం పూర్తయితే మళ్లీ ఎత్తి పోయడానికి మిడ్ మానేరు రిజర్వాయర్‌లో జిల్లాకు సరిపడా నీటిని స్టోరేజీ చేసి ఉంచాలి. యాసంగి పంట కాలం సమయంలో అవసరానికి లిఫ్ట్ చేసుకొనే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఆయ‌న అన్నారు.

సుమారు 6 నుండి 7 టీఎంసీల నీళ్లు తాగునీటి అవసరాలకే వినియోగించాల్సి ఉంటుంది. వరి, పామాయిల్, ఇతర పంటలు సాగుచేసిన రైతులు నీటి ఎత్తిపోతల కోసమే ఎదురుచూస్తున్నారు. రిజర్వాయర్ల దుస్థితి చూస్తే మాత్రం దుఃఖం వస్తోంది. గోదావరిలో ప్రవాహం ఉన్నప్పుడే వడివడిగా నీటిని ఎత్తిపోస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. జిల్లాలోని రైతులకు ఏ కష్టం రాకుండా వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి అని హ‌రీశ్‌రావు సూచించారు.

Advertisement
Advertisement