త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Green India Challenge | అంత‌ర్జాతీయ స్థాయిలో గ్రీన్ ఇండియా చాలెంజ్ మోడ‌ల్

Green India Challenge | కామన్వెల్త్ సెక్రటేరియట్‌తో గ్రీన్ ఇండియా చాలెంజ్ సమావేశం - ద‌క్షిణాది దేశాలకు పర్యావరణ పరిష్కారాల విస్తరణపై లండన్‌లోని మార్ల్‌బరో హౌస్‌లో చ‌ర్చ జ‌రిగింది.

S

Telangana | Published On Apr 17, 2026, 8.02 pm IST

Green India Challenge | అంత‌ర్జాతీయ స్థాయిలో గ్రీన్ ఇండియా చాలెంజ్ మోడ‌ల్
Advertisement

కామ‌న్వెల్త్ సెక్ర‌టేరియ‌ట్‌తో గ్రీన్ ఇండియా చాలెంజ్ స‌మావేశం
ద‌క్షిణాది దేశాల‌కు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిష్కారాల విస్త‌ర‌ణ‌పై చ‌ర్చ‌
హాజ‌రైన మాజీ ఎంపీ సంతోష్ కుమార్

Green India Challenge | త్రినేత్ర‌.న్యూస్ : కామన్వెల్త్ సెక్రటేరియట్‌తో గ్రీన్ ఇండియా చాలెంజ్ సమావేశం - ద‌క్షిణాది దేశాలకు పర్యావరణ పరిష్కారాల విస్తరణపై లండన్‌లోని మార్ల్‌బరో హౌస్‌లో చ‌ర్చ జ‌రిగింది. ఈ స‌మావేశం కామన్‌వెల్త్ సెక్రటేరియట్‌లో భారత ప్రతినిధి బృందం.. సీనియ‌ర్ డైరెక్ట‌ర్, క్లైమెట్ ఛేంజ్ అండ్ ఓష‌న్స్ డైరెక్ట‌రేట్‌ డా. సురేష్ యాదవ్‌ను శుక్ర‌వారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో కొనసాగుతున్న ప్రజల ఆధ్వర్యంలోని పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాన్ని కామన్వెల్త్ దేశాలకు విస్తరించే అవకాశాలపై చర్చించారు.

ఈ ప్రతినిధి బృందానికి రాజ్యసభ మాజీ సభ్యుడు, ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ నేతృత్వం వహించగా, సంస్థ వ్యవస్థాపకుడు ఎం కరుణాకర్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు సంజీవల్ల రాఘవేందర్ పాల్గొన్నారు. అలాగే యూకే టీమ్ సభ్యులు గణేష్ కుప్పల, రవి పులుసు, అనిల్ కుర్మాచలం, నవీన్ రెడ్డి హాజరయ్యారు.

2011లో మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం ఆలోచనలతో ప్రారంభమైన ఈ ఉద్యమం గత 15 ఏళ్ల‌ల్లో విశేష ఫలితాలను సాధించింది. దేశవ్యాప్తంగా సుమారు 196 మిలియన్ చెట్లు నాటడం, 22,000 వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, వేలాది నీటి వనరులను పునరుద్ధరించడం ద్వారా గ్రామీణ జీవన విధానంలో గణనీయ మార్పులు తీసుకొచ్చింది.

ఈ సమావేశంలో పారిస్ ఒప్పందం ఆర్టిక‌ల్ 6.4 ప్రకారం కార్బన్ క్రెడిట్ వ్యవస్థలో భాగస్వామ్యం, అలాగే బ్లాక్‌చైన్ ఆధారిత "భారత్ రీజెనరేషన్ ఇండెక్స్" ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్టుల ధృవీకరణ అవకాశాలపై చర్చించారు. సుందర్బన్స్ వంటి ప్రాంతాల్లో చేపడుతున్న మాంగ్రోవ్ అటవీ పెంపకం, నీటి వనరుల పునరుద్ధరణ కార్యక్రమాలను "బ్లూ కార్బన్" ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసే అంశంపైనా దృష్టి సారించారు.

ఈ సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌కులు, రాజ్య‌స‌భ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. వసుధైవ కుటుంబకం భావనతో భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తుందని, గ్రీన్ ఇండియా చాలెంజ్ మోడల్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తామన్నారు. కామ‌న్వెల్త్ దేశాలతో కలిసి సౌత్-సౌత్ జ్ఞాన మార్పిడి, పర్యావరణ ఆర్థిక వనరుల సమీకరణ, ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాలను విస్తరించేందుకు త‌మ బృందం కట్టుబడి ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్లోబల్ సౌత్ దేశాలు వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రకృతితో సహజీవనం చేసే సంప్రదాయ జ్ఞానం వాటికి ఉందన్నారు. భారతదేశంలో అమలు చేస్తున్న ఈ ప్రజాధారిత నమూనాను ఇతర దేశాలకు విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Advertisement
Advertisement