త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajanna Temple | శ‌ర‌వేగంగా రాజ‌న్న ఆల‌య అభివృద్ధి

Rajanna Temple | వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా డే అండ్‌ నైట్‌ కొనసాగించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

P

Telangana | Published On Sep 2, 2026, 7.21 pm IST

Rajanna Temple | శ‌ర‌వేగంగా రాజ‌న్న ఆల‌య అభివృద్ధి
Advertisement
  • రూ..99.40 కోట్ల పనుల టెండర్లు త్వరితగతిన పూర్తి చేయాలి
  • ప‌క్షం రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్‌..
  • నెలకోసారి క్షేత్రస్థాయి సమీక్ష
  • ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్‌

Rajanna Temple | వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసి భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా డే అండ్‌ నైట్‌ కొనసాగించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. రాజన్న ఆలయ విస్తరణ పనులను బుధవారం దేవాదాయ శాఖ ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌ హనుమంతరావు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, వీటీడీఏ అధికారులు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆది శ్రీనివాస్‌ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని తెలుసుకున్నారు. 80 అడుగుల రోడ్డు విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ తదితర పనులపై ఆరా తీశారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రణాళికలను పరిశీలించారు.

స‌ల‌హాలు సూచ‌న‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి..

ఆగమ శాస్త్రానికి అనుగుణంగానే ఆలయ అభివృద్ధి చేపట్టాలని ఆది శ్రీనివాస్‌ సూచించారు. ఇటీవల శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు విధూశేఖర భారతి స్వామి చేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అదనపు వసతులు, ఇతర అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. ఇప్పటికే మంజూరై టెండర్లు పూర్తయిన పనులతోపాటు తాజాగా మంజూరైన రూ.99.40 కోట్ల పనులపై సమీక్షించినట్లు చెప్పారు. వీటి టెండర్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పనుల పురోగతిని ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తామని, నెలకోసారి క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలిస్తామని తెలిపారు.

రూ.76 కోట్ల పనులు..

రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని దేవాదాయ శాఖ ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌ హనుమంతరావు తెలిపారు. సుమారు 3 నుంచి 4 గంటలపాటు ఆలయ విస్తరణ పనులను పరిశీలించి పురోగతి, నాణ్యత, భవిష్యత్‌ అవసరాలపై చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుతం రూ.76 కోట్లతో చేపడుతున్న పనులు వేగంగా సాగుతున్నాయని, రూ.35 కోట్లతో అన్నదాన సత్రం పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. మరో రూ.99.40 కోట్ల పనులు టెండర్‌ దశలో ఉన్నాయని, వాటికి గడువులు విధించి త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మౌలిక వసతులు, కళాకృతులు, నిర్మాణాలతోపాటు బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధిపైనా చర్చించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధిపై హైదరాబాద్‌లో మరోసారి అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు హనుమంతరావు వెల్లడించారు. ఆది శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సమక్షంలో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. వీటీడీఏ వైస్‌చైర్మన్‌ హోదాలో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ప్రతి శుక్రవారం కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పారు.

అద్భుత దివ్యక్షేత్రంగా..

ఆలయ అభివృద్ధి పనులను ఆది శ్రీనివాస్‌ స్వయంగా పర్యవేక్షిస్తూ అవసరమైన జీవోలు, ఉత్తర్వుల కోసం చొరవ చూపుతున్నారని హనుమంతరావు అన్నారు. భవిష్యత్‌లో వేములవాడ రాజన్న ఆలయం అద్భుత కళాఖండంగా, దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. ఆలయ పరిసరాల్లో విశాలమైన ప్రదేశాలు, ఓపెన్‌ యాంఫిథియేటర్లు, పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు అనువైన వసతులు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గుడి చెరువు బండ్‌ పార్కులో సుమారు రూ.12 కోట్లతో ఆదిశివుడి ప్రతిమ వద్ద అభివృద్ధి చేసిన ప్రాంతానికి ఇప్పటికే రోజుకు సుమారు 2,000 మంది పర్యాటకులు వస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు తరతరాలు గుర్తుంచుకునేలా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పారు.

చిత్తశుద్ధితో పనిచేయాలి

రాజన్న ఆలయ విస్తరణ పనులను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సూచించారు. ప్రతి పనిని శ్రద్ధగా చేపట్టి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయ వైభవం మరింత చాటేలా ఆలయాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. త్వరలో మరోసారి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆలయ విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని వీటీడీఏ వైస్‌చైర్మన్‌, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. ప్రతి వారం పనులపై సమీక్ష నిర్వహిస్తున్నామని, ప్రతి పనికి గడువు విధించి పూర్తి చేయిస్తున్నామని చెప్పారు. సమీక్షలో వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ భీమ్లానాయక్‌, ఆలయ ఈఈ రాజేశ్‌, తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌, విద్యుత్‌ శాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement