త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | వేరే రాజ‌కీయ పార్టీ పెర్ఫార్మెన్స్ గురించి నీకెందుకు..? సీఎం రేవంత్‌పై నిరంజ‌న్ రెడ్డి ఫైర్

Niranjan Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం మీద, వయసు మీద అవహేళన చేసి మాట్లాడుతున్నావు కదా.. మరి అంత ఆరోగ్యంగా ఉన్న రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పర్యటన చేస్తే బీహార్లో ఎందుకు 6 సీట్లే వచ్చాయి రేవంత్ రెడ్డి..? అని మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి నిల‌దీశారు.

S

Telangana | Published On Dec 19, 2025, 2.57 pm IST

Niranjan Reddy | వేరే రాజ‌కీయ పార్టీ పెర్ఫార్మెన్స్ గురించి నీకెందుకు..? సీఎం రేవంత్‌పై నిరంజ‌న్ రెడ్డి ఫైర్
Advertisement

Niranjan Reddy | హైద‌రాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం మీద, వయసు మీద అవహేళన చేసి మాట్లాడుతున్నావు కదా.. మరి అంత ఆరోగ్యంగా ఉన్న రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పర్యటన చేస్తే బీహార్లో ఎందుకు 6 సీట్లే వచ్చాయి రేవంత్ రెడ్డి..? అని మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి నిల‌దీశారు. సోనియా గాంధీ అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి వారు ప్రజా క్షేత్రంలో తిరగడం లేదని మేము ఎప్పుడైనా అన్నామా? వేరే రాజకీయ పార్టీ పెర్ఫార్మెన్స్ గురించి నీకు ఎందుకు అని మాజీ మంత్రి ప్ర‌శ్నించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిరంజ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలకు 5 నుంచి 10 శాతం మాత్రమే ఫ‌లితాలు వచ్చేవి. మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా జిల్లాలో బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ మద్దతు దారులు గెలిచారు. కొన్ని జిల్లాలో 50 శాతం అధికారపార్టీ, 50 శాతం బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన చోట్ల బీఆర్ఎస్ మద్దతుతో కొందరు గెలిచారు. ఈ ఫ‌లితాలు చూస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది అని నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

పాలన గొప్పగా లేనందునే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఓడిపోయింది..

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఏ పార్టీ ముఖ్యమంత్రి ప‌ని చేయ‌లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్వయంగా హెలికాప్టర్ వేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయిన సరే ప్రజలు బీఆర్ఎస్ పార్టీనీ గెలిపించారు. పాలన గొప్పగా లేనందునే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఓడిపోయింది. మా హయంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం చేయ‌లేదు, మాకొచ్చిన సీట్ల గురించి గొప్పగా చెప్పుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఇన్ని స్థానాలు గెలిచాము అని మీడియా సమావేశం పెట్టుకొని చెప్తున్నాడు. దీనికి తోడు మా పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. కేసీఆర్‌పైన, కేటీఆర్‌పైన హరీష్ రావుపైన ఏది పడితే అది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అని నిరంజ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు.

సుడి బాగుండి మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి గెలిచాడు..

కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేశాడు. సుడి బాగుండి మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి గెలిచాడు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సక్సస్ అయ్యాడు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక స్థానాల్లో మున్సిపాలిటీలు గెలిచాము. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు చెరిపేసే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుంది. ఉపాధి హామీ పథకంలో స్టేట్ కాంట్రిబ్యూషన్‌ను 40 శాతం పెంచే ప్రయత్నం చేస్తుంది. దీని పైన కాంగ్రెస్ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది అని నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

త్వరలోనే కేసీఆర్ సమాధానం చెప్తారు..

పాలమూరు రంగారెడ్డిపై ఇంతవరకు సమీక్ష చేయ‌లేదు. దీని పైన త్వరలోనే కేసీఆర్ సమాధానం చెప్తారు. చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజక్ట్‌పై సమీక్ష లేదు. ఈ ఎత్తిపోత‌ల విష‌యంలో ఎవ‌రు ఏమీ చేశారో ప్ర‌జ‌ల‌కు వివ‌రించండి. అంతేకానీ అరుపులు, కేకలు, నిందలు వేయడం మానుకోవాలి. యాసంగి రైతు బోనస్ ఎప్పటి లోపు ఇస్తారో సమాధానం చెప్పాలి. ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. దీని పైన నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి. తెలంగాణ జలవనరులపై జరుగుతున్న కుట్రలపై ఈనెల 21వ తేదీన కేసీఆర్ వివరిస్తారని మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement