త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్ ఓ బిల్డ‌ప్ బాబాయ్.. రెండేండ్ల ప్ర‌జా పాల‌న‌పై హ‌రీశ్‌రావు ఘాటు వ్యాఖ్య‌లు

Harish Rao | రేవంత్ రెడ్డి రెండేండ్ల పాల‌న‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఇది ప్ర‌జా పాల‌న కాదు.. ప్ర‌జా కంఠ‌క పాల‌న అని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు హ‌రీశ్‌రావు. ఈ రెండేండ్ల‌లో ప్ర‌జ‌ల‌కు వేద‌న‌, రోద‌నే మిగిలింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రేవంత్ రెడ్డి జ‌రుపుకోవాల్సింది విజ‌యోత్స‌వాలు కాదు.. అపజ‌యోత్స‌వాలు. రేవంత్ రెడ్డి ఓ బిల్డ‌ప్ బాబాయ్ మాదిరి త‌యార‌య్యార‌ని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

S

Telangana | Published On Dec 8, 2025, 2.51 pm IST

Harish Rao | రేవంత్ ఓ బిల్డ‌ప్ బాబాయ్.. రెండేండ్ల ప్ర‌జా పాల‌న‌పై హ‌రీశ్‌రావు ఘాటు వ్యాఖ్య‌లు
Advertisement

అభయహస్తం కాదు.. భస్మాసుర హస్తం..
ఈ రెండేండ్ల‌లో ప్ర‌జ‌ల‌కు వేద‌న‌, రోద‌నే మిగిలింది..
విందులు, వినోదాలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా ప్ర‌జా భ‌వ‌న్‌
క‌రప్ష‌న్‌కు రేవంత్ పాల‌న ఓ సిల‌బ‌స్
విజ‌యోత్స‌వాలు కాదు అప‌జ‌యోత్స‌వాలు జ‌ర‌పుకోవాలి..
ఏ టూ జ‌డ్ అన్ని కుంభ‌కోణాలే..
అన్నింటికీ ఆర్ఆర్ఆర్ ట్యాక్స్‌లే..
కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కోసం తాప‌త్ర‌యం..
రేవంతేమో తాగుబోతుల తెలంగాణ కోసం ఆరాటం..
దేవుళ్ల‌ను కూడా మోసం చేసిన ఘ‌నుడు రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి పాల‌న‌లో కాదేది స్కాంకు అన‌ర్హం

Harish Rao | హైద‌రాబాద్ : రేవంత్ రెడ్డి రెండేండ్ల పాల‌న‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఇది ప్ర‌జా పాల‌న కాదు.. ప్ర‌జా కంఠ‌క పాల‌న అని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు హ‌రీశ్‌రావు. ఈ రెండేండ్ల‌లో ప్ర‌జ‌ల‌కు వేద‌న‌, రోద‌నే మిగిలింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రేవంత్ రెడ్డి జ‌రుపుకోవాల్సింది విజ‌యోత్స‌వాలు కాదు.. అపజ‌యోత్స‌వాలు. రేవంత్ రెడ్డి ఓ బిల్డ‌ప్ బాబాయ్ మాదిరి త‌యార‌య్యార‌ని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈ రెండేండ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మొండి చెయ్యి చూపించింది. ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్న క‌డ‌గండ్ల పాల‌న‌కు రెండేండ్లు పూర్తైంది. రాష్ట్రాన్ని అధోగ‌తి పాలు చేశారు. రేవంత్ రెడ్డి, మంత్రుల మాట‌లు కోట‌లు దాటాయి.. కానీ చేత‌లు గ‌డ‌ప దాట‌లేదు. ఐదేండ్ల కోసం ఎన్నికైంది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. మొద‌టి రెండేండ్లు చాలా కీల‌కం. ఈ రెండేండ్ల పాల‌న చూస్తే అభివృద్ధి, సంక్షేమంలో ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

కేసీఆర్ రెండేండ్ల పాల‌న‌లో ఎన్నో గొప్ప కార్య‌క్ర‌మాలు..

రేవంత్ రెడ్డి పాల‌న చూస్తుంటే.. మూడు మాట‌ల్లో నిస్సారం, నిష్ఫ‌లం, నిర‌ర్ధ‌కం.. ఇంతకు మించి లేదు అని హ‌రీశ్‌రావు అన్నారు. కేసీఆర్ రెండేండ్ల పాల‌న‌లో ఎన్నో గొప్ప కార్య‌క్ర‌మాలు తీసుకున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఏమీ లేని ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. నాడు ప‌వ‌ర్ హాలీడే.. అటువంటి ద‌శ నుంచి రెండేండ్ల‌లో రైతుల‌కు, ప‌ల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు, ప‌రిశ్ర‌మ‌ల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను అందించాం. మిష‌న్ భ‌గీర‌థ దేశానికి ఆద‌ర్శంగా నిలిచింది. కాక‌తీయ కాలం నుంచి వార‌స‌త్వ సంప‌దగా వ‌చ్చిన చెరువుల‌ను మిష‌న్ కాక‌తీయ కింద పున‌రుద్ధ‌రించుకున్నాం.కేసీఆర్ మొద‌టి కేబినెట్‌లోనే పెన్ష‌న్‌ను రూ. 1000కి పెంచాం. ఎన్నిక‌ల్లో ఎలాంటి హామీ ఇవ్వ‌న‌ప్ప‌టికీ క‌ల్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ అమ‌లు చేశాం. రేష‌న్ బియ్యాన్ని 6 కేజీల వ‌ర‌కు పెంచాం. ప్ర‌భుత్వ హాస్ట‌ళ్ల‌లోని పేద విద్యార్థుల‌కు స‌న్నబియ్యంతో అన్నం పెట్టాం. వ్య‌వ‌సాయాన్ని ఆధునీక‌ర‌ణ చేసే భాగంలో వ్య‌వ‌సాయ ప‌నిముట్ల‌ను పెద్ద ఎత్తున పంపిణీ చేశాం. ఎస్సీల‌కు పూర్తిగా స‌బ్సిడీ కింద వ్య‌వ‌సాయ ప‌రిక‌రాలు పంపిణీ చేశాం. పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ఆక‌ర్షించ‌డానికి టీఎస్ ఐపాస్ పాల‌సీని తీసుకొచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ‌ను మొద‌టి వ‌రుస‌లో నిలిపాం. లా అండ్ ఆర్డ‌ర్‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చి దేశానికి ఆద‌ర్శంగా నిలిపాం. అలా తొలి రెండేండ్ల‌లో కేసీఆర్ అద్భుత‌మైన కార్య‌క్ర‌మాలు చేశార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

విందులు, వినోదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ప్ర‌జా భ‌వ‌న్

మ‌రి రేవంత్ రెడ్డి రెండేండ్ల‌లో చేసిందేమీటి..? మేనిఫెస్టోలో ఉన్న మొద‌టి కార్య‌క్ర‌మం మొద‌టి మాట తుస్సుమ‌న్న‌ది. సీఎం కార్యాల‌యంలో ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హిస్తామ‌ని మేనిఫెస్టోలోని మొద‌టి పేరాలో చెప్పారు. ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్పుడు సామాన్యుల‌ను సైతం క‌లుస్తాన‌ని గ‌ప్పాలు కొట్టిండు. ఆ త‌ర్వాత క‌నిపించ‌లేదు. ఇప్పుడు ప్ర‌జా ద‌ర్బార్ లేదు. రేవంత్ రెడ్డి బిల్డ‌ప్ బాబాయ్.. ఏం మాట్లాడిన అబ‌ద్ధాలే, గోబెల్స్. ప్ర‌జా భ‌వ‌న్లో తీసుకున్న ద‌ర‌ఖాస్తులకు ప‌రిష్కారం లేకుండా పోయింది. ప్ర‌జా భ‌వ‌న్ జ‌ల్సాలు, విందుల‌కు, వినోదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మార్చారు. పొద్దున బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లు, మ‌ధ్యాహ్నం సెటిల్‌మెంట్లు, సాయంత్రం గాన‌భ‌జానాలు, సంగీత్‌లు, రిసెప్ష‌న్లు, పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్లు వీటికి వేదిక‌గా ప్ర‌జా భ‌వ‌న్‌ను మార్చారు. సీఎల్పీ మీటింగ్‌ల‌కు వేదికైంది. రెండేండ్లు మీరు చెప్తున్న‌ది అభివృద్ధి కాదు అస‌మ‌ర్థ‌త‌. పార‌ద‌ర్శ‌క‌త కాదు దోపిడీ. గ్యారెంటీలు కాదు గార‌డీలు. ఇది ప్ర‌జాపాల‌న కాదు న‌య‌వంచ‌క పాల‌న‌. రేవంత్ రెడ్డిది ఒక ప్ర‌యివేటు లిమిటెడ్ కంపెనీ పాల‌న అని హ‌రీశ్‌రావు దుయ్య‌బ‌ట్టారు.

రేవంత్ వ‌ల్ల హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగం

తెలంగాణ ఏర్ప‌డిన రెండేండ్ల‌లోనే బీఆర్ఎస్ ఎన్నో విజ‌యాలు సాధించింది.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి రెండేండ్లు అవుతున్నా ఒక్క‌టి కూడా సాధించ‌లేదు. ఆత్మ‌స్తుతి ప‌ర‌నింద త‌ప్ప ఏం లేదు. ఈ రెండేండ్ల‌లో ప్ర‌జ‌ల‌కు వేద‌న, రోద‌న‌లు మిగిల్చావు. మెట్రో రైలు, ఫార్మా సిటీ ర‌ద్దు అంటావు, కేసీఆర్ కిట్, ద‌ళిత బంధు, న్యూట్రిష‌న్ కిట్, గోర్రెల పంపిణీ, సీఎం బ్రేక్ ఫాస్ట్ ప‌థ‌కం ర‌ద్దు అవుతాయి. కేసీఆర్ ప్రారంభించిన‌ రోడ్లు, ప్రాజెక్టుల‌ను అట‌కెక్కించారు. కాళేశ్వ‌రానికి వ‌న్ ప‌ర్సెంట్ ఖ‌ర్చు పెడితే ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు ఇచ్చే అవ‌కాశం ఉంది. రేవంత్ నిర్ణ‌యాల వ‌ల్ల‌ హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగ‌మైపోయింది. పెట్టుబ‌డుల సంస్థ‌ల‌న్నీ పెట్టుబ‌డులు పెట్టేందుకు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాయి. నీ అప‌రిప‌క్వ‌త వ‌ల్ల రాష్ట్ర ప్ర‌గ‌తి మ‌స‌క‌బారుతుంది. కేసీఆర్ పాల‌న‌లో ఆదాయం అంత‌కంత‌కు పెరిగితే నీ హ‌యాంలో ఎందుకు త‌గ్గుతుంది. ఆత్మ విమ‌ర్శ చేసుకో.. మ‌నస్సాక్షిగా రివ్యూ చేసుకో అని రేవంత్ రెడ్డికి హ‌రీశ్‌రావు సూచించారు.

క‌ర‌ప్ష‌న్‌కు తెలంగాణ కాంగ్రెస్ పాల‌న ఒక సిల‌బ‌స్

రేవంత్ రెడ్డి త‌న పాల‌న‌లో ఆర్గ‌నైజ్డ్ క‌రప్ష‌న్ తీసుకొచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో చూడ‌ని పాల‌సీ తీసుకొచ్చాడు. బ‌హుషా ఈ దేశంలో ఎక్క‌డా ఉండ‌క‌పోవ‌చ్చు ఇలాంటి పాల‌సీ. క‌రప్ష‌న్ నేర్ప‌డానికి ఒక కాలేజీ అంటూ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాల‌న ఒక సిల‌బ‌స్‌గా మారుతుంది. అన‌ధికారిక ట్యాక్స్‌లు వ‌సూలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బిల్డ‌ర్ల మీటింగ్ పెట్టి.. ప‌ర్సంటేజ్ ఫిక్స్ చేశారు. రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందాల‌నే ఉద్దేశంతో బిల్డ‌ర్ల‌తో కేసీఆర్ మీటింగ్ పెట్టారు. కానీ ఇప్పుడు బిల్డ‌ర్ల‌తో రేవంత్ రెడ్డి 30 శాతం ప‌ర్సంటేజ్ వ‌సూలు చేస్తున్నారు. ఇదంతా ఆర్గ‌నైజ్డ్ క‌రప్ష‌న్. కాంగ్రెస్ నేత‌ల జేబులు నింపుకునేందుకు కొత్త ట్యాక్స్ లు తెచ్చారు. దోచుకున్న దాన్ని ఢిల్లీకి క‌ప్పం క‌డుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా అవినీతిని చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

ఏ టూ జ‌డ్ అన్ని కుంభ‌కోణాలే..

రేవంత్ పాల‌న‌లో ఏ టూ జ‌డ్ అన్ని కుంభ‌కోణాలే. ఫార్మా సిటీ కోసం కేసీఆర్ సేక‌రించి పెట్టిన భూమిని ఫ్యూచ‌ర్ సిటీ పేరిట‌ వ్యాపారానికి తెర‌లేపిండు. ర‌వాణా శాఖ‌లో స్మార్ట్ కార్డుల స్కామ్ న‌డుస్తోంది. పారిశ్రామిక భూముల అమ్మ‌కంలో స్కామ్. ప‌వ‌ర్ స్కాం వ‌చ్చింది. యూరియా స్కామ్ కూడా ఈ ప్ర‌భుత్వంలోనే చూశాం. హెచ్ఎండీఏలో స్కాంలు. చివ‌రికి లిక్క‌ర్ స్కాం. ఫెయిలైన ఎంబీబీఎస్ విద్యార్థుల‌ను పాస్ చేసేందుకు కూడా స్కాం చూశాం. కాళోజీ అన్న‌ట్లు క‌విత‌కు కాదేది అన‌ర్హం అన్న‌ట్టు రేవంత్ రెడ్డి పాల‌న‌లో కాదేది స్కాంకు అన‌ర్హం అన్న‌ట్టు పిల్ల‌ల ప్ర‌శ్నాప‌త్రాలు దిద్ద‌డంలో హెల్త్ యూనివ‌ర్సిటీ వీసీ స్కామ్‌కు పాల్ప‌డి చివ‌ర‌కు రాజీనామా చేశారు. ఈ విష‌యాల్లో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం సిగ్గుతో త‌ల దించుకోవాలి అని హ‌రీశ్ రావు అన్నారు.

హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌ల్లో తెలంగాణ రైజింగ్..

కాంగ్రెస్ పాల‌న‌ అభ‌య‌హ‌స్తం కాదు భ‌స్మాసుర హ‌స్తం అయిపోయింది ప్ర‌జ‌ల పాలిట‌. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని మొద‌టి ప‌థ‌కం మ‌హాల‌క్ష్మికి దిక్కు లేదు. మ‌హిళ‌ల‌ను అంబానీలు చేశాన‌ని ట్వీట్ పెట్టిండు. ఏ ఊరికైనా పోదామా.. అప్పుల పాలు చేశావు అంద‌ర్నీ. వ‌డ్డీ లేని రుణాలు అంటూ మ‌హిళ‌ల‌ను మోసం చేశారు. కోటి మంది అక్కాచెల్లెళ్ల‌కు రూ. 60 వేల చొప్పున బాకీ ప‌డ్డావు. బ‌తుక‌మ్మ చీర‌లు ఇవ్వ‌కుండా.. ఒక్క చీర ఇచ్చి మ‌హిళ‌ల‌ను అవ‌మాన ప‌రిచే విధంగా మాట్లాడుతున్నావ్. మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం అమ‌లు చేయ‌కుండా మ‌హిళ‌ల‌ను మోసం చేశారు. తెలంగాణ రైజింగ్ ఏమో కానీ.. రాష్ట్రంలో 50 శాతం మ‌ర్డ‌ర్లు పెరిగాయి. 2023లో 789 మ‌ర్డ‌ర్లు జ‌రిగితే రేవంత్ పాల‌న‌లో 1045 వ‌ర‌కు మ‌ర్డ‌ర్లు పెరిగాయి. అత్యాచారాలు 35 శాతం పెరిగాయి. మ‌హిళ‌లకు భ‌ద్ర‌త క‌రువైంది. 822 మంది రైతులు, 179 మంది ఆటో డ్రైవ‌ర్లు, 116 మంది గురుకుల విద్యార్థులు, 27 మంది రిటైర్డు ఉద్యోగులు, బిల్డ‌ర్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. చివ‌ర‌కు బీసీ రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌నందుకు బీసీ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకునే ప‌రిస్థితీ తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

ప్ర‌జా పాల‌న కాదు.. ఇది ప్ర‌జా కంఠ‌క పాల‌న‌..

అస‌లు రోడ్డెక్క‌ని వారు ఎవ‌రున్నారు ఈ రాష్ట్రంలో. మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా పాల‌న కొన‌సాగాల‌ని కోరుకుంటారు. రేవంత్ పాల‌న‌లో మూడు ధ‌ర్నాలు ఆరు అరెస్టులుగా కొన‌సాగుతున్నాయి. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా యూరియా కోసం రైతుల‌ను పండుగ పూట వ‌ర్షంలో నిల‌బెట్టావు. రేవంత్ రెడ్డి జ‌రుపుకోవాల్సింది విజ‌యోత్స‌వాలు కాదు అప‌జ‌యోత్స‌వాలు జ‌రుపుకోవాలి. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కోసం కాలేజీలు మూత‌బ‌డ్డాయి. దాంతో కాలేజీ యాజ‌మాన్యాల మీద విజిలెన్స్ దాడులు చేయించి కేసులు పెట్టించిండు. ఆరోగ్య శ్రీ సేవ‌లు బంద్ చేస్తామంటే వైద్యారోగ్య శాఖ‌తో విజిలెన్స్‌తో దాడులు చేయిస్తాడు. డీఏ, పీఆర్సీ, పెన్ష‌న్ బెనిఫిట్లు అడిగితే ఉద్యోగుల‌పై ఏసీబీ రైడ్లు చేయిస్తున్నాడు. ఏక్ పోలీసింగ్ అడిగితే వారిని అరెస్టు చేయిస్తాడు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై రేవంత్ రెడ్డికి ప్రేమ లేదు. ప్ర‌జా పాల‌న కాదు ప్ర‌జా కంఠ‌క పాల‌న ఇది. ప్ర‌శ్నించిన వారిపై ప‌గ‌బ‌డుతున్నారు.. అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నారు ఎమ్మెల్యేల‌పై. బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇది బ్లాక్ మెయిల్ పాల‌న అని హ‌రీశ్‌రావు దుయ్య‌బ‌ట్టారు.

రేవంత్‌ది రైతు సంక్షోభ ప్ర‌భుత్వం..

కేసీఆర్ హ‌యాంలో రైతు రాజుగా బ‌తికాడు. కోటి ఎక‌రాల మాగ‌ణిగా మార్చాడు. ప్ర‌పంచ‌లో ఎక్క‌డా లేని విధంగా రైతు బీమా, రైతు బంధు తెచ్చిండు కేసీఆర్. దేశంలోనే ధాన్యం ఉత్ప‌త్తిలో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా నిలిపాడు. క‌రోనా స‌మ‌యంలో ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు కేసీఆర్ జీతాలు ఆపి.. రైతుల‌కు రైతుబంధు ఇచ్చిండు. రైతుబంధు ఎగ్గొట్టిన ఘ‌న‌త రేవంత్ రెడ్డిది. ఏ గ్రామంలో కూడా సంపూర్ణ‌మైన రుణ‌మాఫీ కాలేదు. సిగ్గు లేకుండా రైతు రుణ‌మాఫీ పూర్త‌యిన‌ట్లు ట్వీట్లు పెట్టిండు రేవంత్ రెడ్డి. వ్య‌వ‌సాయ మంత్రి వ‌స్తాడో, ఆర్థిక మంత్రి వ‌స్తాడో, సీఎం వ‌స్తాడో.. ఎక్క‌డ పోదామో చెప్పండి.. మీ ఊర్ల‌లో రుణ‌మాఫీ అయిందంటే నేను రాజీనామా చేస్తాను మీరు సిద్ధ‌మా..? దేవుళ్ల‌ను కూడా మోసం చేసిన ఘ‌నుడు రేవంత్ రెడ్డి, రైతులే కాదు దేవుళ్లు కూడా బ‌లైపోయారు. ఈ దేశంలో ఆ ఘ‌న‌త రేవంత్ రెడ్డికి మాత్ర‌మే ద‌క్కింది. బీఆర్ఎస్‌ది రైతు సంక్షేమ ప్ర‌భుత్వం అయితే కాంగ్రెస్‌ది రైతు సంక్షోభ ప్ర‌భుత్వం అని హ‌రీశ్‌రావు విమర్శించారు.

2 లక్ష‌ల ఉద్యోగాలు ఏమ‌య్యాయి..?

నిరుద్యోగుల‌ను కూడా మోసం చేశాడు రేవంత్ రెడ్డి. చిక్క‌డ‌ప‌ల్లి లైబ్ర‌రీలో రాహుల్ గాంధీ ఇచ్చిన‌ హామీ ఏమైంది.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఏమ‌య్యాయి..? కేసీఆర్ ల‌క్షా 65 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశాడు. మ‌రో 55 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇచ్చి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తే రేవంత్ రెడ్డి కాగితాలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి కొత్త‌గా ఇచ్చిన ఉద్యోగాలు ఐదారు వేల‌కు మించి లేవు. మేం ఇచ్చిన నోటిఫికేష‌న్ల‌కు ఉద్యోగాలిచ్చి మంది బిడ్డ మా బిడ్డ అని ముద్దు ఇచ్చిన‌ట్టు ఉంది రేవంత్ రెడ్డి తీరు. జాబ్ క్యాలెండ‌ర్ నోటిఫికేష‌న్ లేదు కానీ రెండు నెల‌ల ముందే మ‌ద్యం దుకాణాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చిండు. 3 వేల కోట్ల ఆదాయం సంపాదించిండు. ఊరూరికి ప‌బ్‌లు, బార్లు పెడుతాడంట‌. కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కోసం ప్ర‌య‌త్నిస్తే రేవంత్ రెడ్డి తాగుబోతుల తెలంగాణ కోసం ఆరాట‌ప‌డుతున్నాడు. కేసీఆర్ వైద్య రంగాన్ని బ‌లోపేతం చేసిండు. 4 టిమ్స్ ఆస్ప‌త్రులు పెట్టిండు.. ఆరోగ్య తెలంగాణ వైపు కేసీఆర్ అడుగులు వేస్తే రేవంత్ రెడ్డి తాగుబోతు తెలంగాణ వైపు అడ‌గులేస్తున్నాడు అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

రూ. 18 వేల కోట్ల బిల్లుల‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా..?

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డం దారుణం. క‌రోనా వ‌చ్చినా, పెద్ద నోట్ల ర‌ద్దు జ‌రిగినా, ఆర్థిక ఇబ్బందులు వ‌చ్చినా కేసీఆర్ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఆప‌లేదు. కాంగ్రెస్ పెండింగ్ పెట్టిన రూ. 3 వేల కోట్ల బ‌కాయిల‌ను కేసీఆర్ ఇచ్చిండు. కానీ నువ్వేందుకు ఇవ్వ‌వు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్ల‌ల‌కు రీయింబ‌ర్స్‌మెంట్ ఇచ్చావా..? తొమ్మిదిన్న‌ర ఏండ్ల‌లో 20 వేల కోట్ల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇచ్చారు కేసీఆర్. మ‌రి ఈ రెండేండ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వ‌లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్ల‌ల‌ను మోసం చేయ‌డం కాదా..? పాత బ‌కాయిలు ఇవ్వ‌లేదు. గ్రీన్ చానెల్ లేదు.. కొత్త‌గా ఇచ్చింది కూడా ఏమీ లేదు అని రేవంత్ రెడ్డిని హ‌రీశ్‌రావు తూర్పారా బ‌ట్టారు. ఢిల్లీ, హ‌ర్యాన, మ‌హారాష్ట్ర‌, బీహార్ ఎన్నిల‌కు ముందు బ‌డా కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు రీలిజ్ అవుతాయి. రేవంత్ ప్ర‌భుత్వం రూ. 18 వేల కోట్ల బిల్లుల‌ను బ‌డా కాంట్రాక్ట‌ర్ల‌కు రిలీజ్ చేశారు. ప్ర‌తి బిల్లుకు 30 శాతం క‌మీష‌న్ తీసుకున్నారు. ఢిల్లీకి మూట‌లు మోశారు. స్కాల‌ర్‌షిప్ ఇవ్వ‌మంటే నా ద‌గ్గ‌ర పైస‌లు లేవు అంట‌డు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వ‌రు. ఛాలెంజ్ చేస్తున్నా.. బ‌డా కాంట్రాక్ట‌ర్ల‌కు రూ. 18 వేల కోట్లు ఇచ్చావా లేదా.. దీని మీద బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధం అని హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement