త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | నాలుక‌ను అదుపులో ఉంచుకోవాలి.. హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు

Harish Rao | ప్ర‌తి నేత నాలుక‌ను అదుపులో ఉంచుకోవాల‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక్క‌సారి నోరు జారితే ఆ మాట‌ను వెన‌క్కి తీసుకోలేం అని పేర్కొన్నారు.

S

Telangana | Published On Jan 6, 2026, 4.50 pm IST

Harish Rao | నాలుక‌ను అదుపులో ఉంచుకోవాలి.. హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ప్ర‌తి నేత నాలుక‌ను అదుపులో ఉంచుకోవాల‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఒక్క‌సారి నోరు జారితే ఆ మాట‌ను వెన‌క్కి తీసుకోలేం అని పేర్కొన్నారు. సిద్దిపేట‌లో నూత‌న స‌ర్పంచ్‌ల సన్మాన కార్య‌క్ర‌మంలో హ‌రీశ్‌రావు కొత్త స‌ర్పంచ్‌, ఉప స‌ర్పంచ్‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.

అన్నింటి కంటే ముఖ్యం మ‌న నాలుక‌. మ‌న నోరును అదుపులో పెట్టుకోవాలి. ఏద‌న్న పోతే వ‌స్త‌ది కానీ.. నోట్లో నుంచి బ‌య‌ట‌కు పోయిన మాట‌ను తిరిగి వెన‌క్కి తీసుకోలేం. ప‌ద‌వి పోతే వ‌స్త‌ది.. పైసా పోతే వ‌స్త‌దేమో.. కానీ జారిన నోటి మాట‌ను వెన‌క్కి తీసుకోవ‌డం క‌ష్టం. ఎదుటివాడి మ‌న‌సు బాధ‌ప‌డితే, క‌లుక్కుమ‌న్నాక అది అతుకుడు చాలా క‌ష్ట‌మైత‌ది. అందువ‌ల్ల మాట జాగ్ర‌త్త‌గా మాట్లాడండి. మ‌న మాట‌, న‌డ‌వడిక‌, మార్య‌ద చాలా ముఖ్యం. ఇక నాలుగోది ప‌ని. ఎంత ప‌ని చేసినా మాట జారితే.. చేసిన అభివృద్ధి అంతా మాయ‌మైపోత‌ద‌ని హ‌రీశ్‌రావు వ్యాఖ్యానించారు.

సర్పంచ్‌గా గెల‌వ‌డం పెద్ద చాలెంజ్..

స‌ర్పంచ్‌గా గెల‌వ‌డం అనేది పెద్ద చాలెంజ్. పార్టీ గుర్తు మీద గెలిచేందుకు అవ‌కాశం ఎక్కువ‌. పార్టీ గుర్తు లేకుండా గెల‌వ‌డం అంటే అదొక చాలెంజ్. ఎవ‌రైతే ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని పొందుతారో.. గ్రామాన్ని కాపాడుతారు అని అనుకుంటారో వారిని గెలిపిస్తారు. ఆ న‌మ్మ‌కాన్ని కాపాడుకోవాలి. నా స‌ర్వ‌శ‌క్తులు ఉప‌యోగించి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తా అని హ‌రీశ్‌రావు హామీ ఇచ్చారు.

కేసీఆర్ హ‌యాంలో ముత్యాల్లాగా గ్రామాలు..

కేసీఆర్ ఉన్న‌ప్పుడు గ్రామాలు అభివృద్ధి చెందాయి. ఏ ఊరు చూసినా కూడా ముత్యం లాగా ఉండే. గ‌తంలో మండ‌లానికి ఒక ట్రాక్ట‌ర్ ఉంటుండే. కానీ కేసీఆర్ వ‌చ్చిన త‌ర్వాత దేశంలో ఎక్క‌డా లేని విధంగా, ప్ర‌తి ప‌ల్లెకు ట్రాక్ట‌ర్, ట్యాంక‌ర్ ఇచ్చారు. 200 ఓట్లు ఉన్న ప‌ల్లెకు కూడా ట్రాక్ట‌ర్ ఇచ్చారు. ప్ర‌తి ఊరులో డంప్ యార్డు, వైకుంఠ‌ధామం, ప‌కృతి వ‌నం, న‌ల్లా ఉందంటే అది తెలంగాణ‌లో మాత్ర‌మే ఉంది. అలా కేసీఆర్ ప‌ల్లెల‌ను ముత్యాల్లాగా చేశార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

దుమ్మును తుడిచేయాలి..

కాంగ్రెస్ రెండేండ్ల నుంచి ఎన్నిక‌లు జ‌ర‌ప‌కుండా నిధులు ఇవ్వ‌క‌పోవ‌డంతో మురికి కూపాలుగా మారాయి. ఎంతో అద్భుతంగా గ్రామాల‌ను త‌యారు చేసుకున్నాం. తెలంగాణ ప‌ల్లెల‌కు ఎన్నో అవార్డులు వ‌చ్చాయి. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం వ‌చ్చాక అవార్డులు మాయం అయ్యాయి. ఆద‌ర్శంగా ఉన్న గ్రామాలు అధ్వాన్నంగా మారాయి. కేసీఆర్ నెల నెల ప‌ల్లె ప్ర‌గ‌తి నిధులు విడుద‌ల చేస్తుండే. ఆ నిధుల‌ను అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు వినియోగించేవారు. ఈ రెండేండ్లు గ్రామ‌పంచాయ‌తీల‌ను ప‌ట్టించుకోలేదు. పంచాయ‌తీ సెక్ర‌ట‌రీలు కూడా త‌మ జీతాల‌తో డిజీల్ పోయడం, లైట్లు వేయాల్సిన దుస్థితి వ‌చ్చింది. రెండేండ్ల‌లో పేరుకుపోయిన దుమ్మును తుడిచేయాల్సిన బాధ్య‌త మీపై ప‌డింద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

మ‌నం ప్ర‌జ‌ల ప‌క్షం.. ప‌ద‌వి అనేది ఆభ‌ర‌ణం కాదు..

మ‌నం అధికార‌ ప‌క్ష‌మా.. ప్ర‌తిప‌క్ష‌మా కాదు.. ప్ర‌జ‌ల ప‌క్షం. కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి రావాలి. ఏ అవ‌స‌రం ఉన్నా స‌కాలంలో స్పందిస్తాను. కుటుంబం మాదిరిగా ప‌ని చేసుకుందాం. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మే మ‌న బాధ్య‌త‌. మీకు నాకు మంచి పేరు రావాలి. మీరు గ్రామ‌స్థాయిలో, నేను నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ప్ర‌జా సేవ చేస్తాం. మ‌నం ప్ర‌జా సేవ‌కులం. మ‌న‌కు ప‌ద‌వి అనేది ఆభ‌ర‌ణం కాదు.. ఒక బాధ్య‌త‌. ఇది ప్ర‌జ‌లు ఇచ్చిన ప‌ద‌వి. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని కాపాడుకోవాలి వారికి సేవ చేయాలని హ‌రీశ్‌రావు సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement