త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రైతుల‌కు 3 గంట‌ల క‌రెంట్ చాలట‌.. ఇది రేవంత్ మ‌న‌సులోని ఆలోచ‌నే : హ‌రీశ్‌రావు

Harish Rao | రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు.. 3 గంటల కరెంట్ చాలు అని ఈఆర్సీ ముందు కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

S

Telangana | Published On May 29, 2026, 3.47 pm IST

Harish Rao | రైతుల‌కు 3 గంట‌ల క‌రెంట్ చాలట‌.. ఇది రేవంత్ మ‌న‌సులోని ఆలోచ‌నే : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు.. 3 గంటల కరెంట్ చాలు అని ఈఆర్సీ ముందు కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. ఇది కోదండ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదు.. ఇది రేవంత్ రెడ్డి మనసులోని ఆలోచన అని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం

అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయి. పొలం అంటే ఏమిటో.. బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో.. రైతు రాత్రింబవళ్లు ఎలా కష్టపడుతాడో తెలియని వాళ్లు మాత్రమే 3 గంటల కరెంట్ చాలని మాట్లాడగలరు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టింది. కాంగ్రెస్ మాత్రం అదే రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది అని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

రేవంత్ కుట్రలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తోంది..

రుణమాఫీ అటకెక్కించారు. రైతు బంధు బంద్ చేశారు. పంట బోనస్ బోగస్ చేశారు. ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయ్యారు, పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారు. ఇవి చాలదన్నట్లు కేసీఆర్ ఎంతో శ్రమించి అమలు చేసిన 24 గంటల కరెంట్‌ను ఖతం పట్టిస్తున్నారు. రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనా? కరెంట్ కోతలతో, రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ కుట్రలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తోంది. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement