Harish Rao | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టిన అన్ని జీవోలను నాలుగు వారాల లోపు బహిర్గతం చేయాలని, పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు రేవంత్ రెడ్డి, చీకటి జీవోల మాటున నువ్వు దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. జీవోలు దాచుతూ చేస్తున్న డ్రామా.. ఆర్టీఐ సమాధానం ఆధారంగా మా పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) తో బట్టబయలు కాబోతున్నది అని తెలిపారు. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 26వ తేదీ వరకు అంటే మొత్తం 13 నెలల్లో 19,064 జీవోలు జారీ చేయగా, వాటిలో కేవలం 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉంచడంలో అంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో 15,774 జీవోలు అంటే 82 శాతం జీవోలను దాచి పెట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? రేవంత్ రెడ్డి ఇదేనా మీరు చెప్పిన ప్రజా ప్రభుత్వం? అని హరీశ్రావు నిలదీశారు.