త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కాళేశ్వ‌రంపై కేంద్రం వ్యాఖ్య‌లు.. బీజేపీ – కాంగ్రెస్ ఫెవికాల్ బంధానికి నిదర్శ‌నం : హ‌రీశ్‌రావు

Harish Rao | కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం.. ఇది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఫెవికాల్ బంధానికి నిదర్శనం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ 'ఎకనామిక్ సర్వే', రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టిన బడ్జెట్ లెక్కలే కాళేశ్వరం విజయానికి సజీవ సాక్ష్యాలు అని తెలిపారు.

S

Telangana | Published On Mar 31, 2026, 3.29 pm IST

Harish Rao | కాళేశ్వ‌రంపై కేంద్రం వ్యాఖ్య‌లు.. బీజేపీ – కాంగ్రెస్ ఫెవికాల్ బంధానికి నిదర్శ‌నం : హ‌రీశ్‌రావు
Advertisement

ఆ లెక్క‌లే కాళేశ్వ‌రం విజ‌యానికి స‌జీవ సాక్ష్యాలు
కాళేశ్వ‌రంపై న్యాయ‌మూర్తులు సైతం ప్ర‌శంస‌లు
మ‌ల్ల‌న్న సాగ‌ర్‌లో 25 టీంఎసీలు ఎక్క‌డ్నుంచి వ‌చ్చాయి..?
ద‌మ్ముంటే మాతో రండి.. కాళేశ్వ‌రం జ‌లాలు చూపిస్తాం
పగ ఉంటే మాకు శిక్ష వేయండి.. కానీ రైతుల పొట్ట కొట్టకండి

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : కాళేశ్వరంపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం.. ఇది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఫెవికాల్ బంధానికి నిదర్శనం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ 'ఎకనామిక్ సర్వే', రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టిన బడ్జెట్ లెక్కలే కాళేశ్వరం విజయానికి సజీవ సాక్ష్యాలు అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే.. మల్లన్న సాగర్‌లో 25 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని నిల‌దీశారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాతో రండి.. కాళేశ్వరం జలాలతో గలగలా పారుతున్న గోదావరి నీళ్లను, పండుతున్న పొలాలను చూపిస్తామ‌ని హ‌రీశ్‌రావు స‌వాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన వ్యాఖ్యలు అచ్చం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషలాగే ఉన్నాయి. బీఆర్ఎస్‌పై బురదజల్లేందుకు కాంగ్రెస్, బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 90 వేల కోట్లు, లక్ష కోట్లు కొట్టుకుపోయాయి అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ఎలా మాట్లాడుతారు? అని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే

కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శం అని కేంద్ర మంత్రులు, అధికారులు చెప్పారు. ఇది తెలంగాణకు వరప్రదాయిని అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. తెలంగాణకు ఇది ముక్తేశ్వర ప్రాజెక్టు అని ఆనాటి గవర్నర్ నరసింహన్ కొనియాడారు. కాళేశ్వరం కంటే గొప్ప ప్రాజెక్టు దేశంలో లేదని సాక్షాత్తూ ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు చెప్పారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గోదావరి నదికి నడకలు నేర్పి జీవనదిగా మార్చారు అని ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పనులు జరుగుతున్నాయి, ప్రాజెక్టు డిజైన్లు, ప్రణాళికలు చాలా బాగున్నాయి అని సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుస్సేన్ కితాబిచ్చారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రాజెక్టును విజిట్ చేసి ఇదొక అద్భుతం అని చెప్పారు. అమెరికాలోని సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు ఇచ్చి సత్కరించింది. సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు కూడా ప్రాజెక్టును ప్రశంసించారు అని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

కాళేశ్వ‌రంతో కొత్త ఆయ‌క‌ట్టు సాగులోకి

నిన్నగాక మొన్న ఇదే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా' (చాప్టర్ 8) రిపోర్ట్ ప్రకారం.. "2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి ఏకంగా 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ నిర్మించిన 'కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ' పథకాలే" అని కుండబద్దలు కొట్టింది. ఇక నిన్న బడ్జెట్‌లో సాక్షాత్తూ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డే.. కాళేశ్వరం ప్రాజెక్టులో పారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 2024 లో 3000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది. 2025లో కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని స్పష్టంగా చెప్పార‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

అవి కాళేశ్వరం నీళ్లు కావా?

ప్రాజెక్టు లక్ష కోట్లు కొట్టుకుపోతే.. ఈ కొత్త ఆయకట్టుకు పారకం ఎక్కడినుంచి వచ్చింది? భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు కాలువలకు వెళ్లి నీళ్లు వదులుతున్నారు కదా.. అవి కాళేశ్వరం నీళ్లు కావా? గంధమల్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు, అది కాళేశ్వరంలో భాగం కాదా? హైదరాబాద్‌కు తాగునీటి కోసం మూసీ పక్కనుంచి 20 టీఎంసీల నీళ్లు తెస్తామని రూ. 8,000 కోట్లతో కాలువలు తవ్వుతున్నారు కదా.. కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్న సాగర్ నుంచి ఆ నీళ్లు ఎలా వస్తున్నాయి? ఈ నిమిషానికి కూడా మల్లన్న సాగర్‌లో 25 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. వాస్తవాలను మరుగునపరిచి బీఆర్ఎస్‌పై బురద రాజకీయం చేస్తున్నారని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

ఈ నిమిషానికి 80,000 ఎకరాల పంట పండింది..

కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కి, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ నాయకులకు నేను సవాల్ విసురుతున్నాను. మీరు తెలంగాణకు రండి. యాదాద్రి భువనగిరి, చొప్పదండి, జగిత్యాల, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్ రైతుల్ని అడుగుదాం పదండి. గలగలా పారుతున్న ఆ గోదావరి నీళ్లు ఎక్కడివో అడుగుదాం. కాళేశ్వరం నీళ్ల వల్ల పండిన పచ్చని పొలాలను చూద్దాం, రైతులను పలకరిద్దాం రండి. సిద్దిపేటలో ఈ నిమిషానికి 80,000 ఎకరాల పంట పండింది.. అవన్నీ కాళేశ్వరం నీళ్లతో పండిన పంటలే కదా అని మాజీ మంత్రి తెలిపారు.

ఉత్త‌ర తెలంగాణ‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌గ‌

నేను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 20 ఉత్తరాలు రాశాను. ప్రభుత్వం కేవలం రూ. 50 కోట్లు విడుదల చేస్తే.. కొత్తగా ఒక సంవత్సరానికి రెండు లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. కానీ ఆ నిధులు ఇవ్వకుండా పగ పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర తెలంగాణపై పగబట్టింది. కరీంనగర్, నల్గొండ, యాదాద్రి, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు 50 కోట్లు ఇస్తే రెండు లక్షల ఆయకట్టుకు నీళ్లు వస్తాయి. కానీ అలా నీళ్లు ఇస్తే కాళేశ్వరం పోయింది అని తాము చెప్పిన అబద్ధం ఎక్కడ బయటపడుతుందో అన్న అక్కసుతో రైతులకు శిక్ష వేస్తున్నారు. మా మీద మీకు పగ, ద్వేషం ఉంటే మాకు శిక్ష వేయండి.. కానీ రైతుల పొట్ట కొట్టకండి. తక్షణమే ఆ నిధులు విడుదల చేసి కాలువలకు నీళ్లు వదలాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement