త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajaram Yadav | అభివృద్ధి నాలుగు పాదాల న‌డుస్తుంద‌ట‌.. మ‌హేశ్‌కుమార్‌గౌడ్ మాట‌లు సిగ్గుచేటు

Rajaram Yadav | రేవంత్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో అభివృద్ధి నాలుగు పాదాల న‌డుస్తోంద‌ని టీపీసీసీ చీఫ్ చెప్పుకోవ‌డం సిగ్గుచేట‌ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు డి.రాజారామ్ యాద‌వ్ విమ‌ర్శించారు. ఇటీవ‌ల ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం అంకాపూర్‌కు వ‌చ్చి అన్ని అబ‌ద్దాలే మాట్లాడార‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం, మ‌హేశ్‌కుమార్ గౌడ్ వైఖ‌రిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి బాల్కొండ‌లో చేసిన అభివృద్ధి శూన్య‌మ‌న్నారు.

S

Telangana | Published On Aug 7, 2026, 7.13 pm IST

Rajaram Yadav | అభివృద్ధి నాలుగు పాదాల న‌డుస్తుంద‌ట‌.. మ‌హేశ్‌కుమార్‌గౌడ్ మాట‌లు సిగ్గుచేటు
Advertisement
  • బాల్కొండ‌లో రూపాయి అవినీతి లేకుండా 1100 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించిన‌ ఘనత ప్రశాంత్ రెడ్డిదే
  • ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకే పంచుకోవడానికి పోటీ పడుతున్న‌రు
  • ​రేవంత్ ప్రభుత్వానికి అభివృద్ధి చేతకాక బీఆర్‌ఎస్ నేతలపై అబద్దాలు ప్రచారం చేస్తున్నరు
  • బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డి.రాజారామ్ యాదవ్ విమ‌ర్శ‌లు

Rajaram Yadav | త్రినేత్ర‌.న్యూస్: రేవంత్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో అభివృద్ధి నాలుగు పాదాల న‌డుస్తోంద‌ని టీపీసీసీ చీఫ్ చెప్పుకోవ‌డం సిగ్గుచేట‌ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు డి.రాజారామ్ యాద‌వ్ విమ‌ర్శించారు. ఇటీవ‌ల ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం అంకాపూర్‌కు వ‌చ్చి అన్ని అబ‌ద్దాలే మాట్లాడార‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం, మ‌హేశ్‌కుమార్ గౌడ్ వైఖ‌రిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి బాల్కొండ‌లో చేసిన అభివృద్ధి శూన్య‌మ‌న్నారు. ప్ర‌శాంత్‌రెడ్డి 1100 డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్మించి ఇస్తే ఇందిర‌మ్మ ఇళ్ల‌ను కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు పంచ‌డానికి పోటీప‌డుతున్నారని ఆరోపించారు. ఈమేర‌కు శుక్ర‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.

బాల్కొండ‌లో వారు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పలేక గుడ్డిగా మాట్లాడుతున్నారు. ​కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్న పనులు కూడా గతంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో మంజూరైనవే. భీమ్‌గల్ 100 పడకల ఆసుపత్రికి ప్రశాంత్ రెడ్డి ఏకంగా రూ.35 కోట్లు నిధులు మంజూరు చేయించి సుమారు 75 శాతం పనులు పూర్తి చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లకు కేవలం రూ.3 కోట్లు కేటాయించి తామేదో సాధించినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది అని ఆయ‌న మండిప‌డ్డారు.

లింబాద్రి గుట్టను ప్రశాంత్ రెడ్డి, సిద్దుల గుట్టను జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఎంత గొప్పగా అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసు. ​ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు రైతుబంధు ఇవ్వడం చేతకాదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వడం చేతకాదు, సరిపడా కరెంట్, ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వడం చేతకాదు. స్వయంగా ఏ అభివృద్ధి పని చేయలేదు కాబట్టే, గతంలో ప్రశాంత్ రెడ్డి చేసిన గొప్ప అభివృద్ధిపై రాయి వేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని దుయ్యబట్టారు.

వంకాయ‌లు, బెండ‌కాయ‌లు పంచిన‌ట్లు..

గతంలో ప్రశాంత్ రెడ్డి సుమారు 1100 డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టి రూపాయి అవినీతి లేకుండా, పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు అందించారు. కానీ నేడు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్లను వంకాయలు, బెండకాయలు పంచుకున్నట్లు తమ సొంత పార్టీ కార్యకర్తలకు పంచుకోవడానికి కొట్టుకుంటున్నారు. ​ఒకప్పుడు భీమ్‌గల్, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, బాల్కొండ ప్రాంతాలు ఎలా ఉండేవి? ప్రశాంత్ రెడ్డి హయాంలో ఎలా మారాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. రూ.1,500 కోట్లతో SRSP పునరుజ్జీవం కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీకి మళ్లించి, ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా మార్చిన ఘనత ప్రశాంత్ రెడ్డిదే అని రాజారామ్ యాద‌వ్ గుర్తు చేశారు.

కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, నూతన సెక్రటేరియట్, అమరవీరుల స్మారక స్థూపం (అమర జ్యోతి) నిర్మాణాలలో ప్రశాంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు, రైతు వేదికలు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, చివరికి రైతు తోటలకు వెళ్లే బాటలకు కూడా తారు రోడ్లు వేయించిన ఘనత ప్ర‌శాంత్‌రెడ్డిదే.

​గతంలో కాంగ్రెస్ పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం లేదని మాట్లాడే కాంగ్రెస్ నేతలు, నేడు నిజామాబాద్ జిల్లాలో ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులు 'డిఫాక్టో ఎమ్మెల్యేలుగా' వ్యవహరిస్తూ, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని, ప్రతిపక్ష సర్పంచ్‌లను, ప్రజాప్రతినిధులను గౌరవించకుండా అవమానిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా, జిల్లాలో నెంబర్-1 నాయకుడిగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా నిజమైన అభివృద్ధి చేసి చూపించాలి. అబద్ధపు ప్రచారాలు, బురదజల్లే రాజకీయాలు మానుకోవాలి అని రాజారామ్ హెచ్చరించారు.

Advertisement
Advertisement