త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | త్వ‌ర‌లోనే కొత్త పీఆర్సీపై నిర్ణ‌యం : భ‌ట్టి విక్ర‌మార్క‌

Bhatti Vikramarka | ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదిక రాగానే ప‌రిశీలించి కొత్త పీఆర్సీ అమ‌లుపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప్ర‌స్తుతం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.. వాటిపై విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 23, 2026, 2.24 pm IST

Bhatti Vikramarka | త్వ‌ర‌లోనే కొత్త పీఆర్సీపై నిర్ణ‌యం : భ‌ట్టి విక్ర‌మార్క‌
Advertisement

పెండింగ్ డీఏల‌పై కూడా నిర్ణ‌యం తీసుకుంటాం
ఉద్యోగుల రిటైర్డ్ వ‌య‌సు పెంచ‌డంతో ప్ర‌భుత్వంపై భారం
మెడిక‌ల్ బిల్లులు మొత్తం క్లియ‌ర్ చేశాం
ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి 1.25 కోట్ల ప్రమాద బీమా
బీఆర్ఎస్ హ‌యాంలో ఉద్యోగుల‌పై ఆంక్ష‌లుండేవి
ప్ర‌జా పాల‌న‌లో ఉద్యోగుల‌కు పూర్తి స్వేచ్ఛ క‌ల్పించాం

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదిక రాగానే ప‌రిశీలించి కొత్త పీఆర్సీ అమ‌లుపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప్ర‌స్తుతం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.. వాటిపై విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగిన‌ ప్రశ్నలకు ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క సమాధానం ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15వ తేదీ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేవారు.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీనే వేతనాలు చెల్లిస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు పెండింగ్‌లో పెట్టి వెళ్లిన మూడు డీఏల‌ను మా ప్రభుత్వం చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల భారం తప్పించుకునేందుకు గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును మూడు సంవత్సరాలకు పెంచింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. నాలుగవ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడంతో 17వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల భారం ప్రజా ప్రభుత్వంపై పడిందని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు ప్రతినెల రూ. 700 కోట్లు

ఉద్యోగుల మెడికల్ బిల్లులను మొత్తం క్లియర్ చేశాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి గత ప్రభుత్వం రూ. 40,150 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ విషయంపై సభలో శ్వేత పత్రం విడుదల చేశాం. ఆ బకాయిల్లో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల మొత్తం రూ. 4,575 కోట్లు ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేందుకు ప్రతినెల రూ. 700 కోట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. రాబోయే రోజుల్లో బకాయిలు త్వరితగతిన క్లియర్ చేసేందుకు ప్రతినెలా చెల్లించి రూ. 700 కోట్లను రూ. 1000 కోట్లకు పెంచాలని విధానపరమైన నిర్ణయం తీసుకునే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది అని ఆర్థిక మంత్రి వెల్ల‌డించారు.

ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స

మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ సభ్యులకు మానవీయ కోణం ఉండటంతోనే ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్స కార్డులను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. మీ ప్రభుత్వ కాలంలో పది సంవత్సరాలపాటు హెల్త్ కార్డుల కోసం ఉద్యోగ సంఘాలు అడిగి అలసిపోయాయి. ప్రమాదవశాత్తు ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి 1.25 కోట్ల ప్రమాద బీమాని అమలు చేయబోతున్నాం. మా ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపు రూ. 6,146 కోట్లు క్లియర్ చేశామ‌ని భ‌ట్టి తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం

బీఆర్ఎస్ ప్రభుత్వ హ‌యాంలో ఉద్యోగులపై ఆంక్షలు ఉండేవి. మా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో నిత్యం సంప్రదింపులు చేస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసి మెలిసి పనిచేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఏ సమయంలోనైనా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసేందుకు పూర్తి స్వేచ్ఛ కల్పించాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు. వ్యవస్థలు పనిచేయకుండా చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని భ‌ట్టి విక్ర‌మార్క ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement