త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ఆ 249 పిక్నిక్ స్పాట్లు వెరీ వెరీ డేంజర్.. బీకేర్ ఫుల్

Telangana | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.

S

Telangana | Published On Jul 30, 2026, 7.10 pm IST

Telangana | ఆ 249 పిక్నిక్ స్పాట్లు వెరీ వెరీ డేంజర్.. బీకేర్ ఫుల్
Advertisement

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి
జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సీఎస్ ఆదేశం

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నందున చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీల‌తో సీఎస్ సంజయ్ జాజు గురువారం రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ భగవత్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి హరిచందన, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ.. గురువారం రాత్రి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతున్నందున జిల్లాల్లో పోలీసు వివిధ శాఖలతో సమన్వయంతో తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రధానంగా, ఆయా జిల్లాలో వాటర్ ఫాల్స్, ప్రమాదకర ప్రదేశాలు ఉన్న పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల కలెక్టర్లు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఇప్పటికే, ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని, అవసరమైనప్పుడు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, ఎల్‌నినో ప్రభావం వల్ల సెప్టెంబర్‌లోనూ వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొన్నందున వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలను వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రధానంగా కూరగాయలు పండిస్తే మార్కెట్‌లో మంచి ధర ఉండడమే కాకుండా హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా కూడా కొనుగోలు చేయించడం జరుగుతుందని సీఎస్ అన్నారు. వ‌చ్చే రెండు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే జిల్లాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించాల‌ని, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ముంద‌స్తుగానే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

రాష్ట్రంలోని పలు జిల్లాలో249 ప్రమాదకర జలాశయాలున్న పిక్నిక్ స్పాట్స్ ను గుర్తించామని, మరో 167 పర్యాటక ప్రాంతాలను గుర్తించి భారీ వర్షాలు, వరదలున్న సమయంలో ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లకుండా పోలీస్ శాఖ తగు చర్యలను చేపట్టిందని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. 12 కంపెనీల SDRF బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు.

Advertisement
Advertisement