త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Assembly | అసెంబ్లీలో ‘ఇప్ప‌సారా’పై ర‌గ‌డ‌.. గంట‌న్న‌ర‌కు పైగా లొల్లి

Telangana Assembly | దాదాపు ఓ 30 ఏండ్ల క్రితం ఉమ్మ‌డి ఏపీలో నిషేధించిన ఇప్పాసారాపై తెలంగాణ రాష్ట్ర శాస‌న‌స‌భా వేదిక‌గా ర‌గ‌డ చోటు చేసుకుంది. బుధ‌వారం నాడు మంత్రులు, బీజేపీ స‌భ్యుల మ‌ధ్య గంట‌న్న‌ర‌కు పైగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనుచిత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది.

S

Telangana | Published On Mar 25, 2026, 7.31 pm IST

Telangana Assembly | అసెంబ్లీలో ‘ఇప్ప‌సారా’పై ర‌గ‌డ‌.. గంట‌న్న‌ర‌కు పైగా లొల్లి
Advertisement

Telangana Assembly | త్రినేత్ర‌.న్యూస్ : దాదాపు ఓ 30 ఏండ్ల క్రితం ఉమ్మ‌డి ఏపీలో నిషేధించిన ఇప్పాసారాపై తెలంగాణ రాష్ట్ర శాస‌న‌స‌భా వేదిక‌గా ర‌గ‌డ చోటు చేసుకుంది. బుధ‌వారం నాడు మంత్రులు, బీజేపీ స‌భ్యుల మ‌ధ్య గంట‌న్న‌ర‌కు పైగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనుచిత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం చోటు చేసుకుంది. క్ష‌మాప‌ణ చెప్పాల‌ని అధికార ప‌క్షం.. మేం త‌ప్పు మాట్లాడ‌లేద‌ని బీజేపీ స‌భ్యులు ప‌ట్టింపులకు పోవ‌డంతో స‌భా స‌మ‌యం వృథా అయింది. చివ‌ర‌కు బీజేపీ స‌భ్యుడు చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను శాస‌న‌స‌భ రికార్డుల నుంచి తొల‌గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో స‌భ శాంతించింది. త‌ద‌నంత‌రం మ‌ళ్లీ బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై స‌భ్యులు మాట్లాడారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్తరాలు, జీరో అవ‌ర్ ముగిసిన అనంత‌రం స‌భ‌కు విరామం ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ప్రారంభ‌మైన స‌భ‌లో జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పీక‌ర్ అనుమ‌తితో ఇప్ప‌సారాను మ‌ళ్లీ వినియోగంలోకి తీసుకురావాల‌ని, దీంతో అటు ఆదివాసీల‌కు, ఇటు ప్ర‌భుత్వానికి ల‌క్ష‌ల కోట్ల ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని వ్యాఖ్యానించారు.

ఇదే అంశంపై మాట్లాడేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి స్పీక‌ర్ అనుమ‌తి తీసుకున్నారు. రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. మా తాత‌లు ఇప్ప‌సారా తాగి 100 ఏండ్లు బ‌తికార‌ని, ప్ర‌స్తుతం క‌ల్తీక‌ల్లు తాగి ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నార‌ని స‌భ దృష్టికి తీసుకువ‌స్తూ.. ఒక‌వేళ ఇప్ప‌సారా బ్రాండ్ తీసుకురావాల‌నే ఆలోచ‌న ఉంటే.. దానికి మాత్రం ఇందిర‌మ్మ పేరు పెట్ట‌కండి అని కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి సూచించారు.

అస‌లు ర‌గ‌డ ఇక్క‌డే మొద‌లైంది..

ఇక అస‌లు ర‌గ‌డ ఇక్క‌డే మొద‌లైంది. బీజేపీ స‌భ్యుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తీవ్రంగా స్పందించారు. ఏం త‌మాషాగా ఉందా..? సారా ట‌కీలా గురించి మాట్లాడుతూ.. ఇందిర‌మ్మ పేరు తీస్తారా..? ఇది దుర‌దృష్ట‌క‌రం. రికార్డుల నుంచి తొల‌గించాలి.. క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కు మాట్లాడనిచ్చే అవ‌కాశ‌మే లేదు. ఇందిరా గాంధీ మా దేవ‌త‌.. ఈ దేశానికి ప్ర‌ధానిగా సేవ‌లందించిన ఇందిరాను ఉద్దేశించి వాజ‌పేయి ఆమెను ఉక్కు మ‌హిళ అని సంబోధించారు. అంత‌టి ఖ్యాతి ఉన్న ఇందిరా గాంధీ పేరు ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు.. బ‌రాబ‌ర్ క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే అని పొన్నం డిమాండ్ చేశారు.

క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందే : శ్రీధ‌ర్ బాబు

శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి శ్రీధ‌ర్ బాబు క‌ల‌గ‌జేసుకుని.. స‌భ్యులంద‌రూ స‌భా నియామ‌వ‌ళిని పాటించాలి. దేశం కోసం త్యాగం చేసిన మాజీ ప్ర‌ధాని గురించి ఈ విధంగా మాట్లాడ‌డం బాధాక‌రం. క్ష‌మాప‌ణ చెప్పాలి. ఇష్టారాజ్యంగా అడ్డ‌గోలుగా మాట్లాడ‌డం స‌రికాదు. క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందే అని శ్రీధ‌ర్ బాబు డిమాండ్ చేశారు.

ఎక్క‌డ కూడా అన్‌పార్ల‌మెంట‌రీ లాంగ్వేజ్ వాడ‌లేదు : మ‌హేశ్వ‌ర్ రెడ్డి

త‌ద‌నంత‌రం మ‌హేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు మంత్రులు పొన్నం, శ్రీహ‌రి, శ్రీధ‌ర్ బాబు కావొచ్చు.. ఈ అంశంలో ఏం విన్నారో.. ఈ ర‌కంగా ఎందుకు క‌ల‌గ‌జేసుకుని రాద్ధాంతం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. మా ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎక్క‌డ కూడా అన్‌పార్ల‌మెంట‌రీ లాంగ్వేజ్ వాడ‌లేదు అని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

మేం అడ్డ‌గోలుగా స్లీపింగ్ కామెంట్స్ చేయ‌డం లేదు : శ్రీధ‌ర్ బాబు

శ్రీధ‌ర్ బాబు మ‌ళ్లీ క‌ల్పించుకుని.. మ‌హేశ్వ‌ర్ రెడ్డి బాధ్య‌త‌గా తోటి ఎమ్మెల్యే తీరుకు ఏదో త‌ప్పు జ‌రిగింద‌ని చెప్తార‌నుకున్నా.. వారిని స‌మ‌ర్థించే కార్య‌క్ర‌మం చేస్తున్నారు. మీరు ప‌క్క‌నే ఉన్నారు.. ఏం మాట్లాడారో తెలియ‌డం లేదు. పొన్నం, శ్రీహ‌రి స్ప‌ష్టంగా వినే మాట్లాడుతున్నారు. మేం అడ్డ‌గోలుగా స్లీపింగ్ కామెంట్స్ చేయ‌డం లేదు. ఇది తీవ్రంగా ఖండించ‌ద‌గ్గ విష‌యం. మ‌హేశ్వ‌ర్ రెడ్డి జిత్తు మీద పోతుండు. ఇది మీ పార్టీ మీద ప్ర‌భావం చూపుతుంది. మీరు మ‌హిళ‌ల‌కు ఎలాంటి గౌర‌వం ఇస్తున్నారో తెలుస్తుంది. గ‌తంలో మేం ఎప్పుడు కూడా జిత్తుకు పోలేదు. స‌భ‌కు చెడ్డ‌పేరు తెచ్చే విధంగా మ‌హేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని శ్రీధ‌ర్ బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మంత్రులు న‌న్ను బెదిరిస్తున్నారు : రాకేశ్ రెడ్డి

ఈ ప‌రిణామాల మ‌ధ్య రాకేశ్ రెడ్డి మాట్లాడేందుకు స్పీక‌ర్ అనుమ‌తించారు. నేనేం త‌ప్పు మాట్లాడ‌లేదు. త‌ప్పు మాట్లాడితే క్ష‌మాప‌ణ‌ల‌ను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ప‌థ‌కానికి మాజీ ప్ర‌ధాని ఇందిర‌మ్మ పేరు పెడుతున్నారు. ప్ర‌భుత్వం ఇప్ప‌సారా ఫ్యాక్ట‌రీ పెడితే.. రోటిన్‌గా ఆ పేరు పెట్టొద్ద‌ని చెప్పాను. కాంగ్రెస్ నేత‌లు ఎక్క‌డ పేరు పెడుతారో అని భావించి ఆమె మీద‌ గౌర‌వంతో ముందే చెప్పాను. దీనికి మంత్రులు న‌న్ను బెదిరిస్తున్నారు. ఏం త‌మాషాగా ఉందా..? ఒక ఒక హౌస్ క‌మిటీ వేయండి.. ఎవ‌రిక‌న్నా మంత్రి ప‌ద‌వులు రాక‌పోతే నేనేం చేయాలి అని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.

రికార్డుల నుంచి తొల‌గిస్తాం : స్పీక‌ర్

మొత్తానికి గంట‌న్న‌ర‌కు పైగా వాదోప‌వాదాలు జ‌రిగిన త‌ర్వాత స్పీక‌ర్ క‌ల‌గ‌జేసుకుని.. రాకేశ్ రెడ్డి ఇందిరా గాంధీ ప‌ట్ల వాడిన అభ్యంత‌ర‌కర ప‌దాల‌ను రికార్డుల నుంచి తొల‌గించ‌డం జ‌రుగుతుంది. అదే విధంగా స‌భా సంప్ర‌దాయాలు అంద‌రూ పాటించాలి. స‌భ‌ను స‌భ్యులు గౌర‌వించాలి. మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పేరును స‌బ్జెక్టులో తీసుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా, స‌భ్యులంద‌రూ కూడా సభా సంప్ర‌దాయాల‌ను పాటించాల‌ని కోరుతున్నామ‌ని స్పీక‌ర్ పేర్కొన్నారు. దీంతో స్పీక‌ర్ ఈ వివాదానికి ముగింపు ప‌లికారు.

Advertisement

తాజావార్తలు

Advertisement