త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

N Ramchander Rao | ట్యాక్స్‌ల పేరుతో రూ.2500కోట్ల కుంభ‌కోణం : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్‌రావు

N Ramchander Rao | మున్సిపాలిటీలో ట్యాక్స్ పేరుతో పెద్ద కుంభ‌కోణాలు జ‌రుగుతున్నాయ‌ని.. ఏడు కార్పోరేష‌న్ల‌లో రూ.2500 కోట్ల‌కుపైగా కుంభ‌కోణం జ‌రిగింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్‌రావు ఆరోపించారు. రెండేళ్ల ప్ర‌భుత్వ పాల‌న‌పై బీజేపీ చార్జిషీట్‌ని విడుద‌ల చేశారు.

P

Telangana | Published On Feb 2, 2026, 6.34 pm IST

N Ramchander Rao | ట్యాక్స్‌ల పేరుతో రూ.2500కోట్ల కుంభ‌కోణం : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్‌రావు
Advertisement

ప్ర‌జ‌ల ప‌న్నుల‌న్నీ దుర్వినియోగం
- కాంగ్రెస్ పాల‌న‌లో మ‌న బ‌తుకులు మారాయా?
- కాంగ్రెస్ స‌ర్కారు, సీఎం అన్నింట్లో ఫెయిల్‌
- కేంద్రం నిధుల కోస‌మే మున్సిప‌ల్ ఎన్నిక‌లు
- మున్సిపాలిటీల్లో బీజేపీని గెలిపించాలి
- బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్‌రావు

N Ramchander Rao | త్రినేత్ర‌.న్యూస్ : మున్సిపాలిటీలో ట్యాక్స్ పేరుతో పెద్ద కుంభ‌కోణాలు జ‌రుగుతున్నాయ‌ని.. ఏడు కార్పోరేష‌న్ల‌లో రూ.2500 కోట్ల‌కుపైగా కుంభ‌కోణం జ‌రిగింద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రామ‌చంద‌ర్‌రావు ఆరోపించారు. రెండేళ్ల ప్ర‌భుత్వ పాల‌న‌పై బీజేపీ చార్జిషీట్‌ని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి స‌గం ప‌ద‌వీకాలం అవుతోంద‌ని, అనేక వ‌ర్గాలు అసంతృప్తితో ఉన్నార‌న్నారు. బూట‌కపు హామీలు, మోస‌పూరిత వాగ్ధాల‌పై సేవ్ తెలంగాణ‌.. ఓట్ బీజేపీ నినాదంతో చార్జిషీట్‌ను రిలీజ్ చేశామ‌న్నారు. కాంగ్రెస్ అన్నీ మోస‌పూరిత వాగ్ధానాలు చేసింద‌ని.. కామారెడ్డి, వ‌రంగ‌ల్‌, చేవెళ్లలో డిక్ల‌రేష‌న్ పేరుతో ఓట్లు వేయించుకొని.. వారికి చేసిందేమీ లేద‌ని విమ‌ర్శించారు. కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల కోస‌మే రాష్ట్ర ప్ర‌భుత్వం మున్సిప‌ల్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుంద‌ని వ్యాఖ్యానించారు.

జీతాలు ఇచ్చేందుకు నిధులు లేవు..

ప్ర‌భుత్వం వ‌ద్ద నిధులు లేవ‌ని.. క‌నీసం జీతాలు ఇచ్చేందుకు డ‌బ్బులు లేవ‌న్నారు. రిట‌ర్డ్ ఎంప్లాయిస్ ఉద్యోగుల‌కు బెనిఫిట్స్ ఇవ్వ‌లేద‌ని, చాలామంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల‌కు పెన్ష‌న్ ఇవ్వ‌లేని స్థితి ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో ఏం చేస్తుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మొద‌టిసారి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు రావ‌డం లేద‌ని, యూనివ‌ర్సిటీల్లో ఉద్యోగుల‌కు స‌మ‌యానికి జీతాలు రావ‌డం లేద‌న్నారు. ఓయూలో విద్యార్థులు నిర‌స‌న చేస్తుంటూ యూనివ‌ర్సిటీకి సీఎం రెండుసార్లు వెళ్లి రూ.1000 ఇస్తామ‌ర‌ని గుర్తు చేశారు. యూనివ‌ర్సిటీకి వెళ్లి హాట‌ల్స్, మెస్‌ల ప‌రిస్థితి ఎలా ఉంది ? విద్యార్థులు ఎలా చ‌దువుతున్నార‌ని.. టీచింగ్‌, నాన్ టీచింగ్ స్టాఫ్ లేద‌ని.. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఏ ప‌రిస్థితైతే ఉందో.. ఇప్పుడు కాంగ్రెస్ పాల‌న‌లో కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. ఓయూకు రూ.1000 కోట్లు ఇస్తామ‌ని రూపాయి ఇవ్వ‌లేద‌న్నారు. ఈ ప్ర‌భుత్వం విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతోంద‌ని మండిప‌డ్డారు.

ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు బ‌కాయిలు..

ఆరోగ్య శ్రీ కింద కోట్లాది రూపాయిలు ప్రైవేటు ద‌వాఖానాల‌కు ప్ర‌భుత్వం బ‌కాయిలు ప‌డింద‌ని, నిరుపేద‌లు ఆసుప‌త్రికి వెళ్తే.. అడ్మిష‌న్స్ కూడా ఇవ్వ‌డం లేద‌ని తెలిపారు. అయినా ఈ ప్ర‌భుత్వానికి ఏమీ ప‌ట్ట‌డం లేద‌ని విమ‌ర్శించారు. నిరుద్యోగుల‌కు రూ.4వేలు ఇస్తామ‌న్నార‌ని.. ఈ రోజు విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ రూ.8వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు. రైతుల‌కు రైతుబంధు ఇవ్వలేద‌ని, ఏ ఒక్క‌రంగంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం హామీలు నెర‌వేర్చ‌లేద‌ని మండిప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వం స్వ‌నిధి ప‌థ‌కం కింద తెలంగాణలోని మున్సిప‌ల్ ఏరియాల్లో వేలాది మంది ల‌బ్ధి పొందుతున్నార‌ని తెలిపారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇండ్లు ఇచ్చామ‌ని చెబుతున్నా.. ఒక్క‌రికీ రాలేద‌న్నారు. గ‌తంలో డ‌బుల్ బెడ్రూం అన్నార‌ని.. ఎవ‌రికీ రాలేవ‌న్నారు. ఓట్లు వ‌చ్చే స‌మ‌యంలో ఇందిర‌మ్మ ఇండ్లు ఇస్తామ‌ని చెబుతున్నార‌ని.. ఆ త‌ర్వాత మ‌రిచిపోతున్నార‌న్నారు.

మున్సిపాలిటీల‌కు కాంగ్రెస్ చేసిందేమీ లేదు

మున్సిపాలిటీల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిందేమీ లేద‌ని ఆయ‌న ఆరోపించారు. రేష‌న్ దుకాణాల్లో వినియోగ‌దారుల‌కు కేంద్రమే బియ్యం స‌ర‌ఫ‌రా చేస్తుంద‌న్నారు. గ్రామీణ ప్రాంతాల‌కు మున్సిపాలిటీల కింద గ్రామీణ స‌డ‌క్ యోజ‌న కింద నిర్మిస్తున్నామ‌ని, ఎన్నో ప‌థ‌కాల కింద రాష్ట్ర ప్ర‌భుత్వానికి నిధులు ఇస్తే దారి మ‌ళ్లిస్తున్నార‌ని ఆరోపించారు. మున్సిపాలిటీలో ట్యాక్స్ పేరుతో పెద్ద కుంభ‌కోణాలు జ‌రుగుతున్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌న్ను చెల్లింపుదారులు చెల్లిస్తున్న డ‌బ్బులు ఏం చేస్తున్నారు? ఆయ‌న నిల‌దీశారు. ఏడు కార్పోరేష‌న్ల‌లో వ‌సూలు చేసిన ప‌న్నుల‌ను దుర్వినియోగం అయ్యాయ‌ని.. రూ.2500కోట్లపైగా కుంభ‌కోణం జ‌రిగింద‌న్నారు. ఆ నిధుల‌న్నీ ఎక్క‌డికి వెళ్లాయి? ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర నుంచి ప‌న్నులు చేస్తున్నార‌ని.. ఈ నిధుల‌న్నీ ఎక్క‌డికి వెళ్లాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. రోడ్లు, సీవ‌రేజీ సిస్ట‌మ్స్‌, స్వ‌చ్ఛ్ భార‌త్‌, లైట్లు అన్నింటికి కేంద్ర‌మే నిధులు ఇస్తుంద‌ని తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో బీజేపీ పోటీ చేస్తుంది.. బీజేపీని గెలిపించాల‌ని ఆయ‌న కోరారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక మ‌న బ‌తుకులు మారాయా? మ‌న న‌గ‌రాల్లో మార్పులు వ‌చ్చాయా? ఆయ‌న ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫెయిల్‌

తెలంగాణ‌లో లా అండ్ ఆర్డ‌ర్ అమ‌లులో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫెయిల్ అయ్యింద‌ని.. పిల్ల‌లు డ్ర‌గ్స్‌కు అల‌వాట్లు ప‌డుతున్నార‌ని.. దాంతో ప్ర‌జ‌లు ఆవేద‌న‌కు గుర‌వుతున్నార‌న్నారు. గ్రామీణ ప్రాంతాలు, ప‌ట్ట‌ణాల్లో డ్ర‌గ్స్ దొర‌కుతున్నాయ‌ని.. ఎక్క‌డ చూసినా దొంగ‌త‌నాలు, హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. హిందూ ఆల‌యాలు కూల‌గొడుతున్నార‌ని.. ఒక్క‌దానిపై చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. హైద‌రాబాద్‌లో ప్ర‌తి రెండువారాల‌కో ఆల‌యంపై దాడులు జ‌రుగుతున్నాయ‌న్నారు. జూబ్లీహిల్స్‌, పురాణాపూల్‌, మ‌ల్కాజ్‌గిరి, ముత్యాల‌మ్మ ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయ‌ని.. ఏ గుడి కూల‌గొట్టినా.. దేవీదేవ‌త‌ల‌ను అవ‌మానించినా పోలీసులు మాత్రం మెంట‌ల్‌ కేసు పోలీసులు అంటున్నార‌ని.. వాడు మెంట‌లా? పోలీసులు మెంట‌లా తేల్చుకోవాల‌ని.. ప్ర‌తి మెంట‌లోడు హిందూ దేవాల‌యాల‌పైకి వెళ్తారా? అంటూ ఘాటుగా స్పందించారు. ఆల‌యాలు భూములు క‌బ్జాలో ఉన్నాయ‌ని.. రాజ‌కీయ నేత‌లు ఇవాళ రియ‌ల్ ఎస్టేట్‌కు వాడుతున్న‌ర‌ని ఆరోపించారు. గోర‌క్ష‌కుల‌పై ప‌ట్ట‌ప‌గ‌లే తుపాకీల‌తో కాల్పులు జ‌రుపుతున్నార‌ని.. ఈ ప్ర‌భుత్వం ఏం చేస్తుంది? ఆయ‌న నిల‌దీశారు. హోం మంత్రిత్వ‌శాఖ‌, న్యాయ‌శాఖ‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ అన్నీ సీఎం వ‌ద్దే ఉన్నాయ‌ని.. సీఎం సైతం అన్నింట్లో ఫెయిల్ అయ్యార‌ని మండిప‌డ్డారు. క‌మిష‌న్ల కోస‌మే, కాంట్రాక్టుల కోస‌మే ప్ర‌భుత్వాన్ని ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగింద‌న్నారు. మున్సిపాలిటీల్లో బీజేపీని గెలిపిస్తే అవినీతి ర‌హిత పాల‌న అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement