త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummidihetti Barrage | తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. 150 మీటర్ల ఎత్తుతో డిజైన్!

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి 100 టీఎంసీల నీటిని వాడుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మహారాష్ట్రను ఒప్పించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం కోరాలని నిర్ణయించారు.

J

Telangana | Published On Apr 29, 2026, 11.01 pm IST

Tummidihetti Barrage | తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. 150 మీటర్ల ఎత్తుతో డిజైన్!
Advertisement

Tummidihetti Barrage | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని సాగు, తాగు నీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నిపుణులతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, ఈఎన్సీ శ్రీధర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

100 టీఎంసీల నీటి వినియోగమే లక్ష్యం

తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఎంత ఎత్తులో నిర్మించాలి, ఎంత ఎత్తు నిర్మిస్తే గరిష్టంగా నీటిని వినియోగించుకునే వీలుంటుంది అనే అంశాలపై అధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం ఇప్పటికే రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసిందని, 71.5 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు.

CM Revanth Reddy Speeds Up Tummidihetti Barrage Works, Seeks Union Minister Kishan Reddy's Help

ఇప్పటికే చేపట్టిన ఈ నిర్మాణాలను సద్వినియోగం చేసుకోవాలంటే బ్యారేజీని 150 మీటర్ల ఎత్తులో నిర్మించాలని నిపుణులు సూచించారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించిందని, 152 మీటర్లు నిర్మిస్తే ముంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు. అందుకే మధ్యేమార్గంగా 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే, కనీసం 100 టీఎంసీల నీటిని తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు తరలించవచ్చని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణలోని మెట్ట ప్రాంత రైతాంగానికి సాగు, తాగు నీరు అందుతుందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత కిషన్ రెడ్డిదే

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో వెంటనే సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని, ఒకవేళ ఎక్కడైనా ముంపు వాటిల్లితే దానికి తగిన పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

CM Revanth Reddy Speeds Up Tummidihetti Barrage Works, Seeks Union Minister Kishan Reddy's Help

మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నందున, ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వెంటనే లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం సూచించారు. రేపే (గురువారం) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్‌మెంట్ తీసుకొని, నేరుగా కలిసి చర్చించే బాధ్యతను ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు.

వర్షాకాలం లోపు మేడిగడ్డ పనులు పూర్తి కావాలి

ఇదే సమావేశంలో మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిపై కూడా సీఎం ఆరా తీశారు. బ్యారేజ్ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న జియో టెస్టింగ్ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపు ఈ పనులన్నీ పూర్తి కావాలని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు.

CM Revanth Reddy Speeds Up Tummidihetti Barrage Works, Seeks Union Minister Kishan Reddy's Help

Advertisement
Advertisement