త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | పాల‌మూరు ఎత్తిపోత‌ల కేసీఆర్ ఆలోచ‌న కానే కాదు : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy | పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం నాటి సీఎం కేసీఆర్ ఆలోచ‌న కానే కాద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. డీకే అరుణ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో నాటి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ను మంజూరు చేయించార‌ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

S

Telangana | Published On Jan 17, 2026, 6.53 pm IST

CM Revanth Reddy | పాల‌మూరు ఎత్తిపోత‌ల కేసీఆర్ ఆలోచ‌న కానే కాదు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM  Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం నాటి సీఎం కేసీఆర్ ఆలోచ‌న కానే కాద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. డీకే అరుణ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో నాటి సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ను మంజూరు చేయించార‌ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మ‌హ‌బూబ్‌నగ‌ర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం ప్ర‌సంగించారు.

ఈ నూత‌న ఏడాదిలో సంక్రాంతి పండుగ పాల‌మూరు జిల్లాకు వెలుగులు తీసుకురావాల‌ని, దేశానికి ఆద‌ర్శంగా అభివృద్ధి జ‌ర‌గాల‌ని ఆకాంక్షిస్తున్నాను. ఆ దిశ‌గా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుని ఇవాళ ట్రిపుల్ ఐటీకి శంకుస్థాప‌నం చేశాం.. వంద‌లాది కోట్ల అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించుకున్నాం. ఈ పాల‌మూరు జిల్లా క‌ష్టానికి మారుపేరు. ఈ దేశంలో ఎవ‌రైనా ప్రాజెక్టు క‌డుతున్నారంటే.. అక్క‌డ మ‌ట్టి ప‌ని చేసేది పాల‌మూరు ప్ర‌జ‌లే అని ప్ర‌సిద్ధి. ఈ జిల్లా వెనుక‌బ‌డ‌డానికి కార‌ణం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాక‌పోవ‌డం. విద్యావ‌కాశాలు లేక‌పోవ‌డం వ‌ల్ల నిర‌క్షార‌స్య‌త ఒక శాపంగా మారింది అని రేవంత్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఏ ఒక్క‌టి కూడా కేసీఆర్ మంజూరు చేయ‌లేదు..

దేశంలోనే అత్య‌ధికంగా వెనుక‌బ‌డిన మండ‌లంగా గ‌ట్టు ఉంది. తెలంగాణ‌లో క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉన్న న‌మ్మ‌కంగా, విశ్వాసంగా ప‌ని చేసే పాల‌మూరు జిల్లాకు నిధులు ఇవ్వ‌లేదు. సాగునీటి ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌లేదు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు గొప్ప విజ‌యాలు సాధించాం.. ఇవాళ అన్ని ప‌నులు ఆగిపోయ‌యాని మాజీ మంత్రులు అంటున్నారు. ఈనాడు ఈ జిల్లాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఏ ఒక్క‌టి కూడా కేసీఆర్ మంజూరు చేయ‌లేదు. సీఎంగా కేసీఆర్ ఒక్క కొత్త ప్రాజెక్టు పాల‌మూరు జిల్లాకు మంజూరు చేసిండా..? అని రేవంత్ రెడ్డి నిల‌దీశారు.

పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ 2013లో మంజూరు

బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగ‌ర్, జూరాల‌ కావొచ్చు. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌, క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల‌ కావొచ్చు.. శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్ కావొచ్చు.. సీఎంగా కేసీఆర్ ఉన్న‌ప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసిండా అని సూటిగా అడుగుతున్నా.. మీరు అనుమ‌తి ఇచ్చినా ప్రాజెక్టు కానీ, మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఒక్క‌టైనా ఉందా అని స‌వాల్ విసురుతున్నా. పాల‌మూరు ఎత్తిపోత‌ల కావాల‌ని విఠ‌ల్ రావు అనే వ్య‌క్తి వైఎస్సార్‌కు సూచ‌న చేశారు. వైఎస్సార్ మ‌ర‌ణంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. డీకే అరుణ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో కిర‌ణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి మెప్పించి.. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌ను 2013లో మంజూరు చేయించారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌లేదు. పాల‌మూరు ఎత్తిపోత‌ల‌కు 25 వేల కోట్లు కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు ఇచ్చావు త‌ప్ప ఉద్ధండ‌పూర్ కింద రైతు బాధితుల‌కు ప‌రిహారం ఎందుకు ఇవ్వ‌లేదు అని అడుగుతున్నాను. సంగంబండ‌కు రూ. 12 కోట్లు ఇస్తే 10 వేల ఎక‌రాల‌కు, ప‌ది గ్రామాల‌కు నీళ్లు వ‌చ్చేవి. 10 కోట్లు కూడా ఇవ్వ‌లేదు. కానీ నేను సీఎం అయ్యాక సంగంబండ ప‌గుల‌గొట్టేందుకు నిధులు ఇచ్చాను. క‌ల్వ‌కుర్తి మాడ్గుల‌కు నీళ్లు పారాల‌ని భూసేక‌ర‌ణ‌కు నిధులు మంజూరు చేశామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

మ‌క్త‌ల్ - కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల చిట్టెం న‌ర్సిరెడ్డి క‌ల‌

మ‌క్త‌ల్ - నారాయ‌ణ‌పేట - కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఆషామాషీగా రాలేదు. చిట్టెం న‌ర్సిరెడ్డి వైఎస్సార్ సీఎంగా ఉన్న‌ప్పుడు.. ఎత్తైన ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోత‌ల‌తోని నీళ్లు వ‌స్తాయ‌ని వాదించారు. బీమా ఎక్స్‌టెన్స‌న్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాల‌ని చిట్టెం న‌ర్సిరెడ్డి అడిగారు. వైఎస్సార్ మ‌ర‌ణంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. నేను కొడంగ‌ల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన త‌ర్వాత‌.. నారాయ‌ణ‌పేట - కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి రూ. 1500 కోట్ల‌తో ఉమ్మ‌డి ఏపీలో 2014లో చివ‌రి జీవో వ‌చ్చింది. నేను సీఎం అయ్యాక మ‌క్త‌ల్ - నారాయ‌ణ‌పేట - కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల‌కు నిధులు ఇవ్వ‌డ‌మే కాకుండా 96 శాతం భూమి పోయే రైతుల‌ను ఒప్పించాం. నూటికి నూరు శాతం న‌ష్ట‌ప‌రిహారం వంద రోజుల్లో ఇప్పించాం. ఈ జిల్లా వాడిని కాబ‌ట్టి ఈ ప్రాంత స‌మ‌స్య‌ల‌ను రైతుల క‌ష్టాల‌ను అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నాం. జూరాల వ‌ద్ద కొత్త బ్రిడ్జి కోసం 123 కోట్లు మంజూరు చేసుకున్నామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

తెలంగాణ 'వరి' విప్లవం: ఏపీని వెనక్కి నెట్టి దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన గడ్డ!

భూములివ్వ‌లేం, డ‌బ్బులివ్వ‌లేం.. సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

న‌ల్గొండను హైద‌రాబాద్‌లా అభివృద్ధి చేసుకుందా: మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

Advertisement

తాజావార్తలు

Advertisement