త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | బీఆర్ఎస్ అనే మొక్క‌ను మొల‌వ‌నివ్వొద్దు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి ప‌ట్టిన పీడ అని సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్‌ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదు. మ‌ళ్లీ బీఆర్ఎస్ మొక్క‌ను మొల‌వ‌నివ్వొద్దు అని సీఎం అన్నారు.

S

Telangana | Published On Feb 9, 2026, 6.27 pm IST

CM Revanth Reddy | బీఆర్ఎస్ అనే మొక్క‌ను మొల‌వ‌నివ్వొద్దు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

బీఆర్ఎసోళ్లు మోరీల‌నైనా శుభ్రం చేశారా..?
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు..!
బీఆర్ఎస్ నేత‌లు గంజాయి సేవించి మాట్లాడుతున్న‌ట్టుంది..
ఈగ‌ల్, నార్కోటిక్స్ అనాలసిస్‌కు ఆదేశిస్తాం..
బీఆర్ఎస్‌ను యాసిడ్ పోసి క‌డిగితేనే పీడ పోత‌ది..
కేంద్రంతో కొట్లాడి నిధులు సాధిస్తాం..
మ‌రో ఎనిమిదేండ్లు మ‌న‌దే అధికారం..
మీడియా స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి ప‌ట్టిన పీడ అని సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్‌ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదు. మ‌ళ్లీ బీఆర్ఎస్ మొక్క‌ను మొల‌వ‌నివ్వొద్దు అని సీఎం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసంలో సోమ‌వారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో గత పదేళ్లు బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది.. పంచాయ‌తీ మెంబ‌ర్ నుంచి పార్ల‌మెంట్ వ‌ర‌కు వారే ఉన్నారు. మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ నుంచి ముఖ్య‌మంత్రి వ‌ర‌కు వారే ఉన్నారు. అస‌లు వాళ్లు లేని ప‌ద‌వి ఏదైనా ఉందా.? పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని అడుగుతున్నారు. సర్పంచ్ నుంచి మున్సిపల్ వరకు పెత్తనం మీరే చెలాయించారు. బ‌రి తెగించిన కోడి బ‌జార్లోకి వ‌చ్చి గుడ్డు పెట్టిన‌ట్టు ఉంది ఇవాళ బీఆర్ఎస్ నేత‌ల తీరు. ఇవాళ సమస్యలకు ప్రధాన కారణం కేసీఆర్, కేటీఆర్, హరీష్ కాదా? ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోలేదు. క‌నీసం మోరీల‌నైనా శుభ్రం చేశారు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ఇపుడు మళ్లీ ఓట్లు అడుగుతున్నారు? అని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

ఆవు చేనులో మేస్తే దూడ గ‌ట్టు మీద మేస్త‌దా..?

ఒక‌వేళ బీఆర్ఎసోళ్లు ఒకట్రెండు కౌన్సిల‌ర్లు, కార్పొరేట‌ర్లు గెలిచారు అనుకుందాం.. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న కేసీఆర్ స‌భ‌కే వ‌స్త‌లేరు. ఇక వీళ్లు వ‌స్తారా..? ఆవు చేనులో మేస్తే దూడ గ‌ట్టు మీద మేస్త‌దా..? దూడ కూడా చేనులోనే మేస్త‌ది. 25 నెల‌లు అవుతుంది.. జీతాలు తీసుకుంటున్నారు.. ప్ర‌భుత్వం నుంచి వ‌స‌తులు పొందుతున్నారు. కానీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కేసీఆర్ ప‌ని చేయ‌డం లేదు. మిగ‌తా వారు వ‌చ్చిన కూడా స‌భ‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మున్సిపాలిటీలో గెలిస్తే ఆ మున్సిపాలిటీల్లో జ‌రిగే అభివృద్ధికి స‌హ‌క‌రిస్తారా..? అహంకారం, విద్వేష ప్రసంగాలతో గంజాయి, కొకైన్ తీసుకున్న వారిలా మాట్లాడుతున్నారు. వీరి ప్ర‌వ‌ర్త‌న గురించి అనాల‌సిస్ చేయాల‌ని ఈగ‌ల్, నార్కోటిక్స్ అధికారుల‌కు ఆదేశించాల్సి వ‌స్త‌ది. దోపిడీకి అలవాటు పడ్డ ఇలాంటి వాళ్లకి ఓటు వేస్తే పరిస్థితి ఏంటి..? ఒక ఉన్మాదంతో మానసిక రోగంతో టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్లు వసూలు చేశారు. విచారణకు పిలిస్తే ముసుగు తొడుక్కుని వెళ్లకుండా బరితెగించి ఏదో యుద్ధానికి వెళ్లినట్టు వెళుతున్నారు. మూడోసారి మళ్లీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు అని సీఎం రేవంత్ మండిప‌డ్డారు.

బీజేపీ, బీఆర్ఎస్‌ది విడ‌దీయ‌లేని అనుబంధం..

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది 2023 వరకు విడదీయలేని అనుబంధం. నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్లచట్టాలు, త్రిపుల్ తలాక్ కు మద్దతునిచ్చారు. మీ ప్రేమ ఉంటే చాలు.. ఇంకేమీ అవసరం లేదని మోదీతో కేసీఆర్ అన్నారు. ఈ బంధాన్ని తెలంగాణకు నిధులు తేవడానికి మాత్రం ఉపయోగించలేదు. అందుకే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతోంది. బీఆర్ఎస్‌ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదు. మ‌ళ్లీ బీఆర్ఎస్ మొక్క‌ను మొల‌వ‌నివ్వొద్దు అని సీఎం సూచించారు.

అధికారంలోకి రాగానే 70 వేల ఉద్యోగాలిచ్చాం..

మేం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదటి తారీఖునే వచ్చేలా చేసింది మేమే కదా. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చాం. రేషన్ కార్డులు అందించి పేదలకు సన్నబియ్యం అందిస్తున్నాం. మహిళల ఉచిత ప్రయాణం కోసం రూ.9 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించాం. రైతు రుణమాఫీ చేసి, 9 రోజుల్లో 9 వేల కోట్లు చెల్లించాం. సన్నాలకు రూ.500 బోనస్ అందించి పండించిన ప్రతీ గింజ కొంటున్నాం. పేదలకు నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. ఇల్లు కట్టుకునే పేదలకు రూ. 5 లక్షలు అందిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక 70 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. వందేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా బీసీ కులగణన చేసి చూపించాం. నలభై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం అని సీఎం రేవంత్ తెలిపారు.

ఈ ప్ర‌భుత్వం మీది.. మీ కోసం ప‌ని చేస్తుంది..

పన్నెండేళ్ళ మోడీ పాలన, పదేళ్ల బీఆరెస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయండి. తెలంగాణ సమాజానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఈ ప్రభుత్వం మీది.. మీ కోసం ప‌ని చేస్తుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం మోదీని కలిసి అడుగుతాం.. అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతాం. మరో ఎనిమిదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా నాది అని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement