త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | పొంగులేటిని మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించం.. స‌భ‌లో తేల్చిచెప్పిన రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించే ప్ర‌స‌క్తే లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శాస‌న‌స‌భా వేదిక‌గా తేల్చిచెప్పారు. మీరు చెప్పింది విన‌క‌పోతే పొంగులేటి రాజీనామా చేయాలా..? మీ తాతలు దిగొచ్చినా అది జ‌ర‌గ‌దు అని సీఎం రేవంత్ స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Mar 29, 2026, 3.27 pm IST

CM Revanth Reddy | పొంగులేటిని మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించం.. స‌భ‌లో తేల్చిచెప్పిన రేవంత్ రెడ్డి
Advertisement

మీరు చెప్పింది వినకపోతే పొంగులేటి రాజీనామా చేయాలా?
మీ తాతలు దిగొచ్చినా అది జరగదు..
వాళ్ల కింద ఎంత న‌ల్ల‌గ ఉందో నాకు తెలుసు..
నేను మొత్తం చూసి వ‌చ్చాను..
ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు..
బ్లాక్ మెయిల్ చేయడానికే హౌస్ క‌మిటీ కోరుతున్నారు..
పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి..
స్పీక‌ర్‌కు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించే ప్ర‌స‌క్తే లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శాస‌న‌స‌భా వేదిక‌గా తేల్చిచెప్పారు. మీరు చెప్పింది విన‌క‌పోతే పొంగులేటి రాజీనామా చేయాలా..? మీ తాతలు దిగొచ్చినా అది జ‌ర‌గ‌దు అని సీఎం రేవంత్ స్ప‌ష్టం చేశారు. మైనింగ్ వ్య‌వ‌హారంలో అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త‌క్ష‌ణ‌మే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని బీఆర్ఎస్ స‌భ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను ఉద్దేశించి మాట్లాడారు.

మైనింగ్ కార్య‌క‌లాపాల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆధారాలుంటే సీబీసీఐడీ ముంద‌ర పెట్టండి. సిగ్గుంటే స‌భ‌కు రాని చంద్ర‌శేఖ‌ర్ రావు చేత రాజీనామా చేయించండి. సిగ్గు లేని మాట‌లు మాట్లాడితే నాకు కూడా చికాకు వ‌స్త‌ది. స‌హ‌నానికి కూడా హ‌ద్దు ఉంట‌ది. కోటి ప‌ది ల‌క్ష‌లు జీతం తీసుకుని స‌భ‌కు రాకుండా రాజీనామా చేయ‌డంట‌.. జీతం కూడా వాప‌స్ ఇవ్వ‌డంట. కానీ రోజుకు 18 గంట‌లు ప‌ని చేస్తూ.. నాలుగున్న‌ర ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్లు క‌ట్టించి, ద‌ళిత‌, ఆదివాసీ, గిరిజ‌నుల ఇళ్ల‌ల్లో వెలుగు, వారి క‌ళ్ల‌ల్లో ఆనందం చూస్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాంటి పొంగులేటి రాజీనామా చేయాల‌ట‌. సిగ్గుండాలి కొంచెమ‌న్న మాట్లాడడానికి.. అంటే మీరు చెప్పింది విన‌క‌పోతే రాజీనామా చేయాల్నా..? మీ తాత‌లు దిగొచ్చినా అది జ‌ర‌గ‌దు. అరిస్తే గోల పెడితే వింట‌రు అని మీరు అనుకోవ‌చ్చు. మీ సంగ‌తి అంతా తెలుసు.. గురివింద గింజ కింద ఎంత న‌ల్ల‌గా ఉందో తెల్వ‌దు. వాళ్ల కింద ఎంత న‌ల్ల‌గ ఉందో నాకు తెలుసు.. నేను మొత్తం చూసి వ‌చ్చాను. ఇక నేను చిట్టా విప్పితే అస‌లు బాగుండ‌దు అని సీఎం రేవంత్ ఆవేశంతో ఊగిపోయారు.

ఆధారాలుంటే సీబీసీఐడీ అధికారుల‌కు అప్ప‌గించండి..

ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలనే విధానంతో ముందుకు వెళుతున్నాం. సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నాం. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో 2025 లో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నాం. ఇంత పారదర్శకంగా మేం తీసుకున్న చర్యలను అభినందిస్తే మా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసేవారు. మా ప్రభుత్వం ఇచ్చిన నోటీసును తీసుకొచ్చి వాళ్లేదో కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు. దానిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల ప్రభుత్వంలో మూడు హౌస్ కమిటీలు వేసి బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి రాజకీయ లబ్ది పొందారు. వారిలా హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ది పొందాలని మేం చూడలేదు. అందుకే పదేళ్లనుంచి ఇప్పటి వరకు జరిగిన ఖనిజ సంపద దోపిడీ, అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా సీబీసీఐడీ అధికారులకు అందించండి అని సీఎం రేవంత్ కోరారు.

ఆధారాలుంటే ఎవరిపై అయినా చర్యలు తీసుకుంటాం..

హరీష్ రావు, కేటీఆర్, ఇతర సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇతర పార్టీల సభ్యులు కూడా తెలంగాణ ఖనిజ సంపద దోపిడీకి సంబంధించి సమాచారం అధికారులకు ఇవ్వండి. సంపూర్ణంగా విచారణ చేసి దోషులను శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. హౌస్ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకు ఇవ్వాల్సిందే. అందుకే మేం నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం. సీబీసీఐడీపై నమ్మకం లేకపోతే సీబీఐకి విచారణ అప్పగించాలా చెప్పండి.. బ్లాక్ మెయిల్ చేయడానికే వారు హౌస్ కమిటీ కోరుతున్నారు.. ఇక్కడ మీ పప్పులు ఉడకవు.. అక్రమ మైనింగ్ విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి కుటుంబమైనా ఇందులో ఎవరున్నా ఆధారాలు పెట్టండి. ఆధారాలుంటే ఎవరిపై అయినా చర్యలు తీసుకుంటాం అని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి..

సభా సంప్రదాయాలకు వ్యతిరేకంగా చైర్‌ను డిక్టేట్ చేసే సంస్కృతి ఎక్కడిది. ఇన్నేళ్లు సభ్యులుగా చేశాం అని చెప్పుకునే వాళ్లకు తెలిసింది ఇదేనా. స్పీకర్ ఎవరికి అవకాశం ఇస్తే వాళ్లు సభలో మాట్లాడాలి. స్పీక‌ర్‌తో పాటు సీనియర్ సభ్యులను అవమానించే ఇలాంటి వ్యవహార శైలి మంచిది కాదు. దీనికి ఇక్కడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవమాన కరంగా, అసభ్యంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి. హరీష్ రావు సూచన మేరకు ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాన‌ని సీఎం పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement