త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | శివ‌య్య‌ను కేసీఆర్ మోసం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | వేముల‌వాడ రాజ‌న్న‌ను కేసీఆర్ మోసం చేశార‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ తాను స్వ‌యంగా రాజ‌న్న‌ను ద‌ర్శించుకుని, ఆల‌య అభివృద్ధి కోసం రూ. 150 కోట్ల నిధులు మంజూరు చేసిన‌ట్లు రేవంత్ తెలిపారు.

S

Telangana | Published On Feb 5, 2026, 7.50 pm IST

CM Revanth Reddy | శివ‌య్య‌ను కేసీఆర్ మోసం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : వేముల‌వాడ రాజ‌న్న‌ను కేసీఆర్ మోసం చేశార‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ తాను స్వ‌యంగా రాజ‌న్న‌ను ద‌ర్శించుకుని, ఆల‌య అభివృద్ధి కోసం రూ. 150 కోట్ల నిధులు మంజూరు చేసిన‌ట్లు రేవంత్ తెలిపారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా చొప్ప‌దండిలో “ప్రజా పాలన- ప్రగతి బాట” కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

వేముల‌వాడ పోతా అంటే అక్క‌డికి వెళ్లిన వారికి ప‌ద‌వి పోత‌ద‌ని కొంద‌రు చెప్పారు. నేను విన‌కుండా వేముల‌వాడ వెళ్లి హ‌రిహ‌ర మ‌హా దేవుడు శివ‌య్య‌ను ద‌ర్శించుకుని అభివృద్ధికి రూ. 150 కోట్లు నిధులు ఇచ్చాం. వేముల‌వాడ ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తామ‌ని కేసీఆర్ మాటిచ్చి మోసం చేశారు. ఇప్పుడు మేం నిధులిచ్చిన త‌ర్వాత ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇక వేముల‌వాడ రాజ‌న్న‌ను ద‌ర్శించుకున్న త‌ర్వాత‌నే 60 శాతం స‌ర్పంచ్ సీట్ల‌ను గెలుచుకున్నాం. శివ‌య్య మ‌న‌ల్ని ఆశీర్వ‌దించిన‌ట్టా.. ప‌ద‌వి పొగొట్టిన‌ట్టా..? అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

గోదావ‌రి పుష్క‌రాల‌ను అద్భుతంగా నిర్వ‌హిస్తాం..

2027లో గోదావ‌రి పుష్క‌రాలు రాబోతున్నాయి. బాస‌ర నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు ఉన్న ఆల‌యాన్నింటినీ రూ. 5 వేల కోట్ల‌తో అభివృద్ధి చేస్తాం. కేసీఆర్ లాగా మాటిచ్చి మోసం చేయ‌ను. బాస‌ర నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు ప్ర‌తి మందిరాన్ని అభివృద్ధి చేసి ప‌ర్యాట‌క కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం. ఎకో టూరిజంను కూడా అభివృద్ధి చేస్తామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

సోమ‌రిపోతులా.. దున్న‌పోతులా..

పెద్దాయ‌న సీఎం అయ్యాక మేడారం జాత‌ర‌కు పోయిండా.? సురేఖ‌, సీత‌క్క ఆహ్వాన ప‌త్రిక అందించారు. స‌రే ఆయ‌న రాలేదు అనుకుందాం. క‌నీసం ఆ పిల్ల‌ల‌కైనా ఏమైంది.. సోమ‌రిపోతులా.. దున్న‌పోతులా.. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డానికి వారికి నామోషా..? చెట్టంతా పెరిగిండు హ‌రీశ్‌రావు, అచ్చోసిన అంబోతులా కేటీఆర్ తిరుగుత‌డు.. కానీ ద‌ర్శ‌నానికి వ‌చ్చారా..? రాజ‌న్న‌, స‌మ్మ‌క్క-సార‌ల‌మ్మ పేదోళ్ల దేవుళ్లు అని వారు రావ‌డం లేదు. పిల్లి శాప‌నార్థాల‌కు ఉట్టి తెగిప‌డిపోదు. అట్ల‌నే బీఆర్ఎస్ వాళ్లు పిల్లి శాప‌నార్థాలు పెడుతున్నారు. ఇంకా ఎనిమిదేండ్లు ఈ ప్ర‌భుత్వం ఉంట‌ది. అత్య‌ధిక ఉద్యోగాలు ఇచ్చి, అభివృద్ధి చేసి, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసి ఈ రాష్ట్రాన్ని నంబ‌ర్ వ‌న్‌గా తీర్చిదిద్దుతాం అని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

గాలి, నీరు.. ఏది వ‌ద‌ల్లేదు..

రాష్ట్రాన్ని అప్పుల‌పాలు చేసి ఫామ్ హౌస్‌లో పండుకున్నాడు పెద్దాయ‌న‌. నెల నెల జీతం మాత్రం తీసుకుంటున్నాడు. దానికి మాత్రం త‌క్కువ లేదు. వెనుక‌టికి ఓ పెద్దాయ‌న చెప్పిండంట‌.. మందేమో ఎప్ప‌టోల‌నే.. మూలుగుడేమో మునుప‌టోల‌నే అని.. మందేం త‌గ్గ‌లే.. మూలుగుడు కూడా త‌గ్గ‌లేదు. అది అట్ల‌నే ఉంది ఇది ఇట్ల‌నే ఉంది. అధికారం ఉంటేనే అసెంబ్లీ వ‌స్తా లేక‌పోతే రాను అంటున్న‌డు. బ‌డికి రాక‌పోతే పిల్ల‌గాని పంతులు వీపులు పగుల‌కొడుతాడు. ప్ర‌భుత్వ ఉద్యోగి రాక‌పోతే జీతం క‌ట్ చేస్త‌లేమా..? మ‌రి ఇవాళ కేసీఆర్‌కు ఏం క‌ట్ చేయాలని మిమ్మ‌ల్ని అడుగుతున్నా. ఒక్క రోజు అసెంబ్లీకి రాడు.. మంచి మాట మాట్లాడ‌డు. శాప‌నార్థ‌లు పెట్టి పోత‌డు. ఈ శాప‌నార్థాలు తెలంగాణ‌కు స‌మాజానికి మంచిదేనా..? వాళ్లంద‌రూ క‌ట్ట క‌ట్టుకుని విషం చిమ్ముతున్న‌రు మ‌న ప్ర‌భుత్వంపై. ఓ రోజు తండ్రి, ఓ రోజు కొడుకు, ఓ రోజు అల్లుడు, ఓరోజు బిడ్డ‌, ఓరోజు స‌డ్డ‌కుని కొడుకు అంద‌రూ విషం చిమ్ముతున్నారు. వీరు ఏది వ‌ద‌ల్లేదు. చివ‌ర‌కు గాలి, నీరు, ఇసుక‌, కంక‌ర‌, రోడ్డు వ‌ద‌ల్లేదు.. రాష్ట్రాన్ని మొత్తం గుల్ల చేసి మ‌ళ్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట్లు అడుగుతామ‌ని వ‌స్తున్నారు. వారి మాట‌ల‌కు మోస‌పోకండి అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

బండి గుండు ఇక్క‌డ బాగానే మాట్లాడుతారు..

క‌రీంన‌గ‌ర్‌కు ఉన్న పెద్ద స‌మ‌స్య డంప్ యార్డు. ఔట‌ర్ రింగ్ రోడ్డు లేదు. క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌కు ఔట‌ర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి.. ఈ రెండు ప‌ట్ట‌ణాల‌ను అనుసంధానం చేస్తాం. డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తాం. బండి గుండు ఇక్క‌డ బాగానే మాట్లాడుతారు.. మోదీ ముందు నిల‌బ‌డే ద‌మ్ము ధైర్యం ఉందా.. పైస‌లు తెస్తారా..? వారికి మోదీ అపాయింట్‌మెంట్‌ ఇస్తాడా..? ముఖ‌మే చెల్ల‌దు. అస‌లు వారిని మోదీ గుర్తు ప‌ట్ట‌డు. ద‌మ్ముంటే వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్‌కు ఔట‌ర్ రింగ్ రోడ్డును తీసుకురావాలి. నిధులు మంజూరు చేయించుకురావాలి. కేసీఆర్, హ‌రీశ్‌రావును బొక్క‌లో వేయాలి. బండి సంజ‌య్ మా వారి మీద రంకెలేసుడు కాదు.. చేత‌నైతే కేసీఆర్‌ను బొక్క‌లో వేయించండని రేవంత్ రెడ్డి స‌వాల్ చేశారు.

Advertisement
Advertisement