త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | మిషన్ మోడ్‌లో ధాన్యం సేకరించండి: సీఎం రేవంత్‌

CM Revanth Reddy | మిషన్ మోడ్‌లో పనిచేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లతో మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

S

Telangana | Published On May 12, 2026, 5.53 pm IST

CM Revanth Reddy | మిషన్ మోడ్‌లో ధాన్యం సేకరించండి: సీఎం రేవంత్‌
Advertisement

- కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
- రైతులకు ఇబ్బంది కలగొద్దు
- కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి
- నిర్ల‌క్ష్యం చేస్తే చ‌ర్య‌ల‌కు వెనుకాడం
- క‌లెక్ట‌ర్ల‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: మిషన్ మోడ్‌లో పనిచేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లతో మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చ‌రించారు.

కాంట్రాక్ట‌ర్ల‌పై కేసుల‌కు వెన‌కాడొద్దు..

అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్స్ కు తరలించాలని ఆదేశించారు. సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని చెప్పారు. అవసరమైతే క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దన్నారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. అధికారులంతా జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని స్ప‌ష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకూ ప్రభుత్వం వెనకాడదని సీఎం హెచ్చరించారు.

కొన్ని ప్రాంతాల్లో గోడౌన్స్ అవసరాన్నిబట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు చెప్పారు. రైతుబజార్లు, ఫంక్షన్ హాల్స్‌ను ఎంగేజ్ చేసి ధాన్యాన్ని తరలించాలని సూచించారు. వెసులుబాటు ఆధారంగా అక్కడినుంచి గోడౌన్స్‌కు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల‌న్నారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్ట్ పంపించాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు.

రైతుల కోసం ప్రత్యేక వ్యవస్థ..

అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలని, వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.

ప్రతి ఐకేపీ సెంటర్‌కు ఒక అధికారిని నియమించి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చర్యలు తీసుకోవాలని, అలా చేస్తే తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చని చెప్పారు. లారీల కొరతను అధిగమించేందుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement