త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | సీట్ల పెంపులో దక్షిణాదికి అన్యాయం వద్దు.. కేంద్రానికి సీఎం రేవంత్ ‘హైబ్రిడ్ మోడల్’ ప్రతిపాదన

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాలపై కేంద్ర ప్రభుత్వ తీరును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెబుతూ, 'హైబ్రిడ్ మోడల్'ను ప్రతిపాదించారు.

J

Telangana | Published On Apr 13, 2026, 5.35 pm IST

CM Revanth Reddy | సీట్ల పెంపులో దక్షిణాదికి అన్యాయం వద్దు.. కేంద్రానికి సీఎం రేవంత్ ‘హైబ్రిడ్ మోడల్’ ప్రతిపాదన

సంక్షిప్త సారాంశం

మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం కేంద్రం వ్యూహాత్మక కుట్ర అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేవలం జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. దీనికి పరిష్కారంగా కొత్తగా పెంచే సీట్లలో 50 శాతం జనాభా ప్రాతిపదికన, మిగతా 50 శాతం రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ఆధారంగా కేటాయించే 'హైబ్రిడ్ మోడల్'ను ఆయన తెరపైకి తెచ్చారు.

Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పేరిట కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి హడావుడి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ రెండు అంశాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు నియోజకవర్గాల పెంపుపై సీఎం రేవంత్ ఒక కీలకమైన 'హైబ్రిడ్ మోడల్'ను దేశం ముందు ఉంచారు.

మహిళా రిజర్వేషన్లకు, సీట్ల పెంపునకు సంబంధం లేదు

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన.. ఈ రెండు అంశాలకు ఒకదానితో ఒకటి ఎలాంటి సంబంధం లేదని సీఎం స్పష్టం చేశారు. కానీ, కేంద్రం వ్యూహాత్మకంగా ఈ రెండింటిని కలిపి, ప్రతిపక్షాలు సహకరించడం లేదనే తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

దేశంలో మహిళలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించింది, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన గుర్తుచేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, 2026 జనాభా లెక్కల ప్రకారం నిబంధనను సవరించుకుంటే 2029 లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజన్వేషన్లను అమలు చేయొచ్చన్నారు.

 

జనాభా ఆధారంగా పెంపు.. దక్షిణాదికి తీరని ద్రోహం

నియోజకవర్గాల పునర్విభజనను ప్రధాని మోదీ ప్రమాదకరమైన రాజకీయ పావుగా వాడుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసి జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు, కేవలం జనాభా ఆధారంగా సీట్లు పెంచితే తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.

గతంలో ఇందిరాగాంధీ ఈ సమస్యను గుర్తించే సీట్ల పెంపుపై 25 ఏళ్ల పాటు నిషేధం విధించారని ఆయన గుర్తుచేశారు.

ప్రస్తుతం దక్షిణాదిలో 130 లోక్‌సభ సీట్లు ఉండగా.. 50 శాతం పెంచితే అవి 195కు చేరుతాయి. అదే ఉత్తరాదిలో 413 సీట్లు ఉంటే అవి 621కి పెరుగుతాయి. దీనివల్ల ఉత్తరాది, దక్షిణాది మధ్య అంతరం 412 నుంచి ఏకంగా 620 సీట్లకు పెరుగుతుందన్నారు.

ఇది కేవలం దక్షిణాదికే కాకుండా ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రాల రాజకీయ మనుగడకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.

CM Revanth Reddy Proposes Hybrid Model for Delimitation Slams Centre on Linking Women Quota

సీట్ల పెంపునకు సీఎం రేవంత్ 'హైబ్రిడ్ మోడల్'

దేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాది రాష్ట్రాలు వెన్నెముకగా నిలుస్తున్నాయని, పన్నుల రూపంలో అత్యధిక ఆదాయాన్ని ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాలను కేవలం జనాభా ప్రాతిపదికన ఎలా శిక్షిస్తారని సీఎం ప్రశ్నించారు. ఈ సమస్య పరిష్కారానికి ఆయన ఒక 'హైబ్రిడ్ మోడల్' ను ప్రతిపాదించారు.

కొత్తగా 272 లోక్‌సభ సీట్లను పెంచాలని భావిస్తే.. అందులో సగం (136 సీట్లు) జనాభా ప్రాతిపదికన (ప్రోరేటా), మిగతా సగం (136 సీట్లు) రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (GSDP - ఆర్థిక సహకారం) ఆధారంగా పెంచాలి.

దీనివల్ల దేశ ప్రగతిలో అత్యధిక భాగస్వామ్యం అందిస్తున్న రాష్ట్రాలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుంది.

అఖిలపక్షంతో చర్చించాలి

నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఏకపక్షంగా ముందుకు వెళ్లకుండా, నిపుణులతో ఒక కమిటీ వేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో దీనిపై సమగ్ర చర్చ జరగాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని తొందరపాటు లేకుండా 2028 మార్చి నాటికి పూర్తి చేయవచ్చని, దేశంలో ఉత్తరాది-దక్షిణాది మధ్య అంతరాన్ని, వివక్షను పెంచే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.

Advertisement
Advertisement