త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dharmendra Pradhan Resignation | ఒకనాడు స్టూడెంట్ లీడర్‌గా పోరాటం.. నేడు అదే వ్యవహారంతో రాజీనామా: ధర్మేంద్ర ప్రధాన్ ‘కర్మ’ రిటర్న్స్!

1997లో పేపర్ లీక్‌పై విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా పోరాడిన ధర్మేంద్ర ప్రధాన్.. ఇప్పుడు అదే పేపర్ లీక్ ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

J

National | Published On Jul 25, 2026, 7.07 pm IST

Dharmendra Pradhan Resignation | ఒకనాడు స్టూడెంట్ లీడర్‌గా పోరాటం.. నేడు అదే వ్యవహారంతో రాజీనామా: ధర్మేంద్ర ప్రధాన్ ‘కర్మ’ రిటర్న్స్!
Advertisement
  • నీట్ (NEET-UG) పేపర్ లీక్ నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
  • 1997లో ఒడిశాలో ప్లస్-2 పేపర్ లీక్‌పై ఏబీవీపీ (ABVP) నేతగా ప్రధాన్ సుదీర్ఘ పోరాటం
  • నాడు పోలీసుల లాఠీచార్జ్‌లో ఎముకలు విరిగినా వెనక్కి తగ్గని వైనం
  • తాజాగా CJP ఆందోళనల నడుమ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకున్న ప్రధాన్

Dharmendra Pradhan Resignation | త్రినేత్ర.న్యూస్ : 1997లో ఒడిశాలో ప్లస్-2 (Plus Two) ఎగ్జామ్ పేపర్ లీక్ అయినప్పుడు.. సుమారు 1,500 మంది విద్యార్థులు రాష్ట్ర సెక్రటేరియట్ ముందు భారీ ఆందోళన చేపట్టారు. ఆ స్టూడెంట్స్‌ని ముందుండి నడిపించిన ఓ యువకుడు.. ఆ తర్వాత కాలంలో దేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఆయనే ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan). అయితే విధి ఎంత విచిత్రమైనదంటే.. నాడు పేపర్ లీక్‌పై మంత్రికి వ్యతిరేకంగా పోరాడిన ఆయనే.. నేడు 'నీట్' (NEET-UG 2026) పేపర్ లీక్ ఆరోపణల నడుమ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

1997 నాటి ఫ్లాష్‌బ్యాక్

జానకీ బల్లభ్ పట్నాయక్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో భగబత్ ప్రసాద్ మహంతి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. 1997లో జరిగిన బోర్డ్ ఎగ్జామ్స్ లో పేపర్ లీక్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. అప్పటికే ABVP జాతీయ కార్యదర్శిగా ఉంటూ విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్.. భువనేశ్వర్ లోని సెక్రటేరియట్ వద్ద 1500 మంది విద్యార్థులతో కలిసి శాంతియుత నిరసన చేపట్టారు.

నిరసనకారులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్‌ (lathi-charge) లో ప్రధాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి, ఎముకలు విరిగాయి. అయినా సరే ఆయన వెనక్కి తగ్గలేదని ఉత్కల్ యూనివర్సిటీలో ఆయన జూనియర్ ప్రశాంత్ రౌత్ గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం దిగివచ్చి విద్యాశాఖలో ప్రక్షాళన చేపట్టింది. ఈ పోరాటం ప్రధాన్ రాజకీయ ప్రస్థానంలో ఓ మైలురాయిగా నిలిచింది.

సీన్ కట్ చేస్తే 2026

దాదాపు 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ అయింది. రెండు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన ప్రధాన్.. ఇప్పుడు మే 5న జరిగిన NEET-UG పరీక్షల లీకేజీ వ్యవహారంలో ఆందోళనకారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో జూన్ 20న జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి తన రాజీనామా లేఖను సమర్పించారు.

రాజీనామా లేఖలో ఏముంది?

నీట్ పేపర్ లీక్ పై మొదటి నుంచి తానే నైతిక బాధ్యత తీసుకున్నానని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన హిందీ లేఖలో పేర్కొన్నారు. దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని వాడుకోకుండా ఉండాలనే తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. దేశ యువత కలలను సాకారం చేయడమే తన నైతిక బాధ్యత అని.. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

దిగివచ్చిన కేంద్రం.. CJP తదుపరి డిమాండ్లు

ఈ వివాదంపై కేంద్రం ఇప్పటికే సీబీఐ (CBI) విచారణకు ఆదేశించింది. పరీక్షను రద్దు చేసి రీ-ఎగ్జామ్ నిర్వహించింది. భవిష్యత్తులో ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ (CBT) విధానంలోనే జరుగుతాయని ప్రకటించింది. పేపర్ లీక్‌లకు పాల్పడితే కఠిన శిక్షలు పడేలా ఓ కొత్త ముసాయిదా బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే, ప్రధాన్ రాజీనామా 36 రోజుల తమ పోరాటానికి దక్కిన తొలి విజయమని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) అన్నారు. కానీ, ఈ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. ఒక కోటి పరిహారం, నిరసనకారులపై కేసులు ఎత్తివేయడం, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement