త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anuroop Reddy | ముగ్గురు స్నేహితుల ప్రాణాలు కాపాడి వీరమరణం.. అనురూప్‌కు సీఎం రేవంత్ నివాళి

Anuroop Reddy | ముగ్గురు స్నేహితుల ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను త్యాగం చేసిన తెలంగాణ యువకుడు కోడూరు అనురూప్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ విషాద ఘటన అత్యంత దురదృష్టకరమైందని పేర్కొంటూ, అనురూప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

P

Telangana | Published On Jun 9, 2026, 3.40 pm IST

Anuroop Reddy | ముగ్గురు స్నేహితుల ప్రాణాలు కాపాడి వీరమరణం.. అనురూప్‌కు సీఎం రేవంత్ నివాళి
Advertisement

Anuroop Reddy | ముగ్గురు స్నేహితుల ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను త్యాగం చేసిన తెలంగాణ యువకుడు కోడూరు అనురూప్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ విషాద ఘటన అత్యంత దురదృష్టకరమైందని పేర్కొంటూ, అనురూప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలోని టోరో బయూ పార్క్‌లో మే 29న చోటుచేసుకున్న ఈ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందంటూ సీఎం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

కేవలం 23 ఏళ్ల వయస్సులోనే ఉజ్వల భవిష్యత్తు ఉన్న అనురూప్ అసామాన్య ధైర్యసాహసాలు, నిస్వార్థ సేవాభావం, పరాక్రమాన్ని ప్రదర్శించి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రమాదంలో మునిగిపోతున్న తన ముగ్గురు స్నేహితులను కాపాడేందుకు ఏమాత్రం వెనుకాడకుండా అనురూప్ నీటిలోకి దూకి వారిని రక్షించాడని సీఎం గుర్తుచేశారు. తన స్నేహితుల ప్రాణాలను కాపాడినప్పటికీ అనురూప్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ఆ సమయంలో అనురూప్ ప్రదర్శించిన మానవతా విలువలు, కరుణ, ధైర్యసాహసాలు మహోన్నత త్యాగానికి నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున అనురూప్ తల్లిదండ్రులు, సోదరుడు ఆశ్రిత్ రెడ్డి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనురూప్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ తీవ్ర విషాద సమయంలో ప్రభుత్వం కుటుంబానికి అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి అనురూప్ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Advertisement
Advertisement