త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | హైద‌రాబాద్‌లో కాలుష్య ర‌హిత అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | దేశంలోని మెట్రో న‌గ‌రాల్లో కాలుష్యం కార‌ణంగా నివ‌సించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ న‌గ‌రం కూడా అలా త‌యారుకావొద్ద‌ని, కాలుష్య ర‌హిత అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీఎం తెలిపారు.

S

Telangana | Published On Jul 9, 2026, 2.38 pm IST

CM Revanth Reddy | హైద‌రాబాద్‌లో కాలుష్య ర‌హిత అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : దేశంలోని మెట్రో న‌గ‌రాల్లో కాలుష్యం కార‌ణంగా నివ‌సించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ న‌గ‌రం కూడా అలా త‌యారుకావొద్ద‌ని, కాలుష్య ర‌హిత అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీఎం తెలిపారు. సీతారాంపూర్‌లో సోలార్ మాడ్యూల్ త‌యారీ యూనిట్‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు.

రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాం. కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ లాంటి నగరాల్లో నివసించలేని పరిస్థితి. బెంగుళూరు, చెన్నై వంటి నగరాలలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. మెట్రో పాలిటన్ నగరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందుకే హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత అభివృద్ధి జరగాలని నిర్ణయించాం. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2100 చ.కి.మీ విస్తీర్ణంలోని CURE ఏరియాను పూర్తిగా సర్వీస్ సెక్టార్‌గా నిర్ణయించాం. తెలంగాణను CURE, PURE, RARE ఏరియాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన‌ట్లు సీఎం తెలిపారు.

ప్రపంచంతో పోటీ పడాలంటే ఇప్పుడున్న పెట్టుబడులు సరిపోవు..

2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణను తీర్చిదిద్దాలని సంకల్పించాం. దేశ అధిక వ్యవస్థలో తెలంగాణ 10 శాతం భాగస్వామ్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రపంచంతో పోటీ పడాలంటే ఇప్పుడున్న పెట్టుబడులు సరిపోవు. పెట్టుబడులు రావాలంటే అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. యువతకు నైపుణ్యం అందించేందుకు ఏటీసీలతో పాటు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామ‌ని సీఎం పేర్కొన్నారు.

మమ్మల్ని కొన్నాళ్లు పని చేయనివ్వండి..

సీతారాంపూర్‌లో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. గ్రామంలో భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇంటి పట్టాలు, ఉపాధి కోసం వ్యాపార సముదాయాలను నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాను. రంగారెడ్డి జిల్లా రైతులు త్యాగం చేయడం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైంది. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు 100 మీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రాజకీయాలకు ఇది సమయం కాదు.. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయండి. అధికారం కోల్పోయిన బాధ మీకు ఉన్నా.. అభివృద్ధి జరగనివ్వండి. మమ్మల్ని కొన్నాళ్లు పని చేయనివ్వండి. ప్ర‌జలందరి సహకారంతో 2030 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. త్వరలోనే ఇక్కడ ఆలయ ప్రారంభోత్సవానికి వస్తా.. మళ్లీ మీ అందరినీ కలుస్తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీధర్ బాబు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, సలహాదారు రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మనోహర్ రెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement