త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | భారీ ప‌త‌నం అనంత‌రం.. కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు, త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో ఇరాన్‌-అమెరికా మ‌ధ్య యుద్ధం మ‌ళ్లీ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు క్రితం సెష‌న్‌లో భారీగా పత‌నాన్ని చ‌వి చూశాయి. అయితే గురువారం మార్కెట్లు కాస్త రిక‌వ‌ర్ అయ్యాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ప్రారంభం నుంచే గ్యాప్ అప్‌తో మొద‌లై లాభాల్లో ముగిశాయి.

S

Business | Published On Jul 9, 2026, 3.58 pm IST

Stock Markets | భారీ ప‌త‌నం అనంత‌రం.. కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు, త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..
Advertisement

Stock Markets | ప‌శ్చిమ ఆసియాలో ఇరాన్‌-అమెరికా మ‌ధ్య యుద్ధం మ‌ళ్లీ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు క్రితం సెష‌న్‌లో భారీగా పత‌నాన్ని చ‌వి చూశాయి. అయితే గురువారం మార్కెట్లు కాస్త రిక‌వ‌ర్ అయ్యాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీ50 ప్రారంభం నుంచే గ్యాప్ అప్‌తో మొద‌లై లాభాల్లో ముగిశాయి. సెష‌న్ మొత్తం తీవ్ర అస్థిర‌త నెల‌కొన్న‌ప్ప‌టికీ సూచీలు లాభాల్లో నిల‌దొక్కుకున్నాయి. సెన్సెక్స్ 238 పాయింట్లు (0.31 శాతం) పెరిగి 76,741.82 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ50 సూచీ 81 పాయింట్లు (0.34 శాతం) లాభ‌ప‌డి 23,962.80 వ‌ద్ద స్థిర‌ప‌డింది. బుధ‌వారం మార్కెట్ల‌లో వ‌చ్చిన ప‌త‌నం త‌రువాత సూచీలు కాస్త కోలుకున్నాయి. ముఖ్యంగా కంపెనీల క్యూ1 ఫ‌లితాలు, దేశీయ స్థూల ఆర్థిక ధోర‌ణుల‌పై పెట్టుబ‌డిదారులు ఆశావ‌హ దృక్ప‌థంతో నిలిచారు. దీంతో విలువ ఆధారిత షేర్ల కొనుగోళ్లు పెరిగాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, బ‌ల‌ప‌డ్డ రూపాయి..

విస్తృత మార్కెట్ సూచీలు సైతం బ‌ల‌మైన బుల్ ర్యాలీని కొన‌సాగించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వ‌రుస‌గా 1.38, 1.80 శాతం చొప్పున ఎగ‌బాకాయి. పెట్టుబ‌డిదారులు గురువారం ఒక్క సెష‌న్‌లోనే రూ.5 ల‌క్ష‌ల కోట్ల మేర లాభాల‌ను ఆర్జించారు. దీంతో బీఎస్ఈలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.471.2 ల‌క్ష‌ల కోట్ల నుంచి రూ.476.4 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డం కూడా మార్కెట్ల ర్యాలీకి కార‌ణ‌మైంది. బుధ‌వారం సెష‌న్‌లో చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరిగిన‌ప్ప‌టికీ గురువారం మాత్రం ధ‌ర‌లు దిగి వ‌చ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.04 శాతం మేర త‌గ్గి బ్యారెల్‌కు 77 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.97 శాతం పెరిగి బ్యారెల్‌కు 73 డాల‌ర్ల‌కు వ‌చ్చింది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి ఆశాజ‌న‌క ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే భార‌త రూపాయి 17 పైస‌లు లాభ‌ప‌డి 95.37 వ‌ద్ద నిలిచింది.

ఈ స్థాయిలు కీల‌కం..

నిఫ్టీ50లో భార‌తి ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, స‌న్ ఫార్మా షేర్లు ర్యాలీకి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ సైతం 510 పాయింట్లు పెరిగి 57,252 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఎన్ఎస్ఈలో 3:1 నిష్ప‌త్తిలో షేర్లు ర్యాలీని కొన‌సాగించాయి. సెన్సెక్స్‌లో స‌న్ ఫార్మా, భార‌తి ఎయిర్ టెల్‌, ఎట‌ర్న‌ల్‌, ఇంటర్ గ్లోబ్ ఏవియేష‌న్ లిమిటెడ్‌, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్ లిమిటెడ్‌, గ్రాసిం ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ షేర్లు టాప్ గెయిన‌ర్లుగా నిలిచాయి. ఇక డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబొరేట‌రీస్ లిమిటెడ్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, హిందాల్కో ఇండ‌స్ట్రీస్‌, ఐష‌ర్ మోటార్స్ కంపెనీలు టాప్ లూజ‌ర్లుగా స్థిర‌ప‌డ్డాయి. అయితే వ‌చ్చే రెండు మూడు సెష‌న్‌లు సూచీల‌కు చాలా కీల‌క‌మ‌ని, మార్కెట్లు ఈ స్థాయిలోనే నిల‌దొక్కుకుని ముందుకు సాగాల్సిన అవ‌ప‌రం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement