త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth | అంబ‌ర్‌పేట‌లో ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఏర్పాటు చేస్తం : ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

CM Revanth | నగరం వేగంగా విస్తరిస్తున్నా.. అందుకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచంతో పోటీపడే నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. మూసారాంబాగ్‌-అంబర్‌పేట వంతెనను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

P

Telangana | Published On Aug 31, 2026, 7.05 pm IST

CM Revanth | అంబ‌ర్‌పేట‌లో ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఏర్పాటు చేస్తం : ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth | నగరం వేగంగా విస్తరిస్తున్నా.. అందుకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచంతో పోటీపడే నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. మూసారాంబాగ్‌-అంబర్‌పేట వంతెనను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణను మూడు ఆర్థిక ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని సీఎం తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు లోపల పెరి అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ, ఆపై తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్‌ అగ్రికల్చరల్‌ ఎకానమీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఓఆర్‌ఆర్‌ లోపల సర్వీస్‌ సెక్టార్‌, పెరి అర్బన్‌ ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌గా, గ్రామీణ ప్రాంతాన్ని వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేస్తామన్నారు. ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌తో రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఏళ్లుగా సమస్యలే..

అంబర్‌పేట నియోజకవర్గం ఎన్నో ఏళ్లుగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని రేవంత్‌రెడ్డి అన్నారు. పేరుకే నియోజకవర్గమని.. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు కూడా లేవని విమర్శించారు. ఆర్టీఏ, సబ్‌ రిజిస్ట్రార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని చెప్పారు. మురికి, దోమలతో పాటు వరదల సమయంలో వారి ఇళ్లు, ఆస్తులు నీట మునుగుతున్నాయని తెలిపారు. కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిన బట్టలు, మంచాలు, టీవీలు, ఫ్రిజ్‌లు, పిల్లల సర్టిఫికెట్లు సైతం వరదల్లో కొట్టుకుపోతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆరోపించారు. అంబర్‌పేట వంతెనపై నుంచి మూసారాంబాగ్‌ వెళ్లే సమయంలో వరద నీరు ప్రవహించి ప్రజలు ఇబ్బందులు పడేవారని, అవతలి వైపునకు వెళ్లే క్రమంలో పలువురు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని సీఎం గుర్తుచేశారు. ‘‘చాలామంది చాలా ఉపన్యాసాలు ఇచ్చారు. ఇంత చిన్న పనిని పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు చేయలేదు?’’ అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రెండేళ్లలోనే వంతెన పనులు ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందన్నారు.

పదేళ్లలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఎక్కడ?

గత ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఏటా రెండు లక్షల చొప్పున ఇళ్లు నిర్మిస్తామని చెప్పినా.. పదేళ్లలో అంబర్‌పేటలో ఎన్ని డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు. నిర్మించిన ఇళ్లను సైతం పేదలకు కాకుండా దళారులకు కేటాయించారని ఆరోపించారు. పేదలకు వారి పని ప్రదేశానికి దగ్గరగా ఇళ్లు నిర్మిస్తే నెలకు రూ.10 వేల వరకు అద్దె భారం తగ్గుతుందని సీఎం అన్నారు. ఆ డబ్బును పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ గత పాలకులు ఈ అంశాన్ని పట్టించుకోలేదని విమర్శించారు.

అంబర్‌పేటలో 10 ఎకరాల్లో ఇందిరమ్మ ఇళ్లు

అంబర్‌పేటలోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పది ఎకరాల్లో కూతవేటు దూరంలోనే ఇళ్లు నిర్మించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పేదల కష్టాలను తెలుసుకుని అక్కడికక్కడే డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. మూసారాంబాగ్‌ వంతెన నిర్మాణంతోనే తమ బాధ్యత పూర్తికాదని సీఎం అన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించడం, అంబర్‌పేటలోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ‘‘ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్లు కట్టివ్వాలి.. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి’’ అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement