త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indus Waters Treaty | సింధు జలాల ఒప్పందం: హేగ్ కోర్టు తీర్పును తోసిపుచ్చిన భారత్.. మా నిర్ణయాలను ప్రశ్నించే హక్కు లేదని ఫైర్

సింధు జలాల ఒప్పందంపై హేగ్ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. మా సార్వభౌమ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఆ కోర్టుకు లేదని తేల్చిచెప్పింది.

J

National | Published On Aug 31, 2026, 6.57 pm IST

Indus Waters Treaty | సింధు జలాల ఒప్పందం: హేగ్ కోర్టు తీర్పును తోసిపుచ్చిన భారత్.. మా నిర్ణయాలను ప్రశ్నించే హక్కు లేదని ఫైర్

సంక్షిప్త సారాంశం

సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) పై వరల్డ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ తీర్పును భారత్ తిరస్కరించింది. ఈ కోర్టు చట్టవిరుద్ధంగా ఏర్పాటైందని, భారత సార్వభౌమ నిర్ణయాలపై తీర్పు చెప్పే అధికార పరిధి (jurisdiction) దానికి లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. గత ఏడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆ నీటి ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పాకిస్థాన్ పూర్తిగా నిర్మూలించే వరకు ఒప్పందం నిలిపివేత అమల్లోనే ఉంటుందని భారత్ తేల్చిచెప్పింది.

Advertisement
  • సింధు జలాలపై హేగ్ కోర్టు తీర్పును చెత్తబుట్టలో వేసిన భారత్

Indus Waters Treaty | త్రినేత్ర.న్యూస్ : సింధు జలాల ఒప్పందం (Indus Waters Treaty) పై ది హేగ్‌ (The Hague) లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును భారతదేశం సోమవారం తీవ్రంగా తోసిపుచ్చింది. పాకిస్థాన్‌తో చేసుకున్న నీటి పంపకాల ఒప్పందాన్ని తాము నిలిపివేయడాన్ని తప్పుబట్టిన ఈ ట్రిబ్యునల్ (Tribunal) కు అసలు తమ దేశ సార్వభౌమ నిర్ణయాలను ప్రశ్నించే చట్టబద్ధమైన అధికార పరిధి (jurisdiction) లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కుండబద్దలు కొట్టింది.

India Rejects Hague Court's Ruling on Indus Waters Treaty

భారత్, పాకిస్థాన్ మధ్య సింధు నదీ వ్యవస్థ జలాల పంపకాలను నిర్దేశించేందుకు 'సింధు జలాల ఒప్పందం' రూపకల్పన

ఈ ఆర్బిట్రేషన్ కోర్టును వరల్డ్ బ్యాంక్ (World Bank) చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిందని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో మండిపడింది. ఈ కోర్టు ఉనికిని తాము ఎన్నడూ గుర్తించలేదని, దీనికి ముందు వారు ఇచ్చిన తీర్పులను కూడా తాము ఏనాడూ పట్టించుకోలేదని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) భారత్ చేపడుతున్న హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల (hydroelectric projects) పనులను పరిమితం చేయాలని కోర్టు సూచించగా.. ఆ ఆదేశాలు తమ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపబోవని న్యూఢిల్లీ తేల్చిచెప్పింది.

రక్తపాతం, నీరు ఒకేసారి ప్రవహించలేవు 

గత ఏడాది ఏప్రిల్ 22న 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) తర్వాత.. పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు ఉపక్రమించిన భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది (suspended). రక్తపాతం, నీరు ఒకేసారి ప్రవహించలేవని (blood and water cannot flow together) పునరుద్ఘాటించిన భారత్.. పాకిస్థాన్ తన గడ్డపై ఉన్న సరిహద్దు ఉగ్రవాద నెట్‌వర్క్‌లను శాశ్వతంగా నిర్మూలించే వరకు ఈ ఒప్పందం నిలిపివేత కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేసింది.

India Rejects Hague Court's Ruling on Indus Waters Treaty

గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు.. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.

సింధు నదీ వ్యవస్థలోని పశ్చిమ నదులపై భారతదేశం నిర్మిస్తున్న కిషన్‌గంగ (Kishenganga), రాట్లే (Ratle) ప్రాజెక్టుల డిజైన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ ఈ ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది. అయితే, ఒప్పందం ప్రకారం ఇలాంటి సాంకేతిక వివాదాలను 'న్యూట్రల్ ఎక్స్‌పర్ట్' (Neutral Expert) ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, ఒకేసారి ఆర్బిట్రేషన్ కోర్టు విచారణ చేపట్టడం ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని మొదటి నుంచీ భారత్ వాదిస్తోంది. ఈ చట్టవిరుద్ధమైన ట్రిబ్యునల్ తీర్పులు తమ నిర్ణయాలను ఎంతమాత్రం ప్రభావితం చేయలేవని భారత ప్రభుత్వం తేల్చిచెప్పింది.

1960లో కుదిరిన భారత్, పాక్ మధ్య ఒప్పందం

1960 సెప్టెంబర్ 19న కరాచీలో (Karachi) వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లేజ్ జలాలు ప్రాథమికంగా భారత్‌కు కేటాయించగా.. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదులను పాకిస్థాన్‌కు కేటాయించారు. అయితే, కొన్ని నిర్దిష్ట షరతులతో ఇరు దేశాలకు నదులపై పరిమిత వినియోగ హక్కులు కల్పించారు.

Advertisement
Advertisement