త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sevalal Temple in Nallamala Forest | నల్లమలలో బంజారాలకు మరో మేడారం.. 20 ఎకరాల్లో సేవాలాల్ పుణ్యక్షేత్రం: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

గిరిజనులకు శుభవార్త. నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఎకరాల్లో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మేడారం జాతర తరహాలో దీనిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే వేదికపై 'నేనే రాజు.. నేనే మంత్రి' వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.

J

Telangana | Published On Feb 15, 2026, 4.16 pm IST

Sevalal Temple in Nallamala Forest | నల్లమలలో బంజారాలకు మరో మేడారం.. 20 ఎకరాల్లో సేవాలాల్ పుణ్యక్షేత్రం: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
Advertisement
  • నల్లమలలో ఆధ్యాత్మిక క్షేత్రం
  • మేడారం తరహాలో అభివృద్ధి
  • ప్రతి తండాకు బీటీ రోడ్డు, స్కూల్, పంచాయతీ భవనం.
  • మున్సిపల్ ఎన్నికల ఫలితాల బాధ్యత నాదేనని చెప్పడానికే 'నేనే రాజు-నేనే మంత్రి' అన్నాను
  • గిరిజన బిడ్డలకు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నాం.
  • సీఎం రేవంత్ కీలక ప్రకటన

Sevalal Temple in Nallamala Forest |  త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని బంజారా సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. ఆదివాసీలకు నాగోబా, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలు ఉన్నట్లుగానే.. బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్‌కి కూడా ఒక బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో జరిగిన సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. గిరిజన సంక్షేమం, అభివృద్ధిపై పలు కీలక వరాలు కురిపించారు.

20 ఎకరాల భూమి కేటాయించాం

"బంజారాలకు ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం లేదన్న లోటును ఈ ప్రభుత్వం తీరుస్తుంది. నల్లమల అటవీ ప్రాంతంలో ఇప్పటికే 20 ఎకరాల భూమిని కేటాయించాం. అక్కడ బంజారాల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తాం. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను మనం అక్కడే ఘనంగా జరుపుకుందాం," అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిని గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తండాల రూపురేఖలు మారుస్తాం

రాష్ట్రంలోని ప్రతి తండా, గూడెం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. ప్రతి తండాకు తప్పనిసరిగా బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తాం. ప్రతి గ్రామ పంచాయతీలో సొంత భవనం, పాఠశాల భవనం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అటవీ ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలు వేయలేని చోట, సోలార్ పంప్ సెట్ల ద్వారా మంచినీరు, విద్యుత్ అందిస్తాం.. అని రేవంత్ భరోసా ఇచ్చారు.

'నేనే రాజు.. నేనే మంత్రి'.. అసలు అర్థం ఇదే!

ఇటీవల తాను చేసిన 'నేనే రాజు.. నేనే మంత్రి' వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలకు సీఎం ఈ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. "నేను పాలకుడిని కాదు.. సేవకుడిని. మున్సిపల్ శాఖ మంత్రిని నేనే.. ముఖ్యమంత్రిని నేనే.. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటముల బాధ్యత నాదే అని చెప్పే సందర్భంలో ఆ మాట అన్నాను. నా పనితనానికి ఈ ఎన్నికలే గీటురాయి అని చెప్పాను. కానీ కొందరు దీనిని వక్రీకరిస్తున్నారు. ప్రజా తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది, అది నా బాధ్యతను మరింత పెంచింది," అని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.

చదువే గిరిజనుల ఆయుధం

నిరుపేదలకు పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవని, కానీ నాణ్యమైన చదువును అందించే బాధ్యత తమదని సీఎం అన్నారు. రూ.20 వేల కోట్లతో 100 నియోజకవర్గాల్లో 'యంగ్ ఇండియా స్కూల్స్' నిర్మిస్తున్నామని, గిరిజన బిడ్డలు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు పదవుల్లో సముచిత స్థానం కల్పించామని, స్పీకర్, మంత్రులుగా అవకాశం ఇచ్చి సామాజిక న్యాయం పాటించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సేవాలాల్ విగ్రహానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement
Advertisement