త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదు.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, తాతా మధును బర్తరఫ్ చేయాలి

అసెంబ్లీ స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పి, మధును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

J

Telangana | Published On Sep 7, 2026, 3.17 pm IST

CM Revanth Reddy | స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదు.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, తాతా మధును బర్తరఫ్ చేయాలి
Advertisement
  • శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
  • ఇది కేవలం దళితులకు మాత్రమే కాకుండా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని సభలో వెల్లడి
  • బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, తాతా మధుతో రాజీనామా చేయించాలని అల్టిమేటం
  • ప్రభుత్వం సంయమనం పాటిస్తుంటే చేతకానితనంగా తీసుకోవద్దని బీఆర్ఎస్ నేతలకు గట్టి వార్నింగ్

CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (Telangana Assembly) సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కించపరుస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్పీకర్‌ను అవమానించడం అంటే వ్యవస్థలను, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, తాతా మధును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

దళితులపై బీఆర్ఎస్‌ది కక్షపూరిత వైఖరి

సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితుడిని సీఎం చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని నమ్మించి కేసీఆర్ దళితులను మోసం చేశారని గుర్తుచేశారు. దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయడం, నేరెళ్లలో ఇసుక లారీలను అడ్డుకున్న దళితులను లారీలతో తొక్కించి చంపడం లాంటివి బీఆర్ఎస్ దళిత వ్యతిరేక ఆలోచనలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఒక దళితుడిని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడిని చేస్తే, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఆయనను ప్రతిపక్ష హోదా నుంచి తొలగించారని మండిపడ్డారు.

చర్చ జరిగేదే.. బీజేపీకి కౌంటర్

బీజేపీ లేవనెత్తిన అంశాలపై సీఎం స్పందిస్తూ.. సభలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా కూలంకషంగా చర్చ (Discussion) జరగాల్సిందేనని స్పష్టం చేశారు. చర్చ జరగకుండానే నిర్ణయాలు తీసుకోమనడం తమ 'చీకటి మిత్రులను' కాపాడే ప్రయత్నమేనని ఎద్దేవా చేశారు. ఇదే సభలో గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించి విచారణకు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అయినా, శాసనసభ్యుడైనా స్పీకర్ స్థానానికి సమానమేనని, ఆ అత్యున్నత స్థానాన్ని గౌరవించడం సభా సంప్రదాయమని సీఎం పేర్కొన్నారు.

సంయమనాన్ని చేతకానితనంగా భావించొద్దు

స్పీకర్ మనసు గాయపడేలా, సభ్యసమాజం తలదించుకునేలా తల్లిని సైతం అవమానించడం క్షమించరాని నేరమని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం సంయమనం పాటిస్తుంటే దాన్ని చేతకానితనంగా భావించవద్దని వార్నింగ్ (Warning) ఇచ్చారు. అదిరించి, బెదిరించి వ్యవస్థలను లొంగదీసుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. సభా నాయకుడిగా కేసీఆర్ (KCR) తక్షణమే క్షమాపణ చెప్పాలని, తాతా మధుతో రాజీనామా చేయించాలని, లేదంటే ఆ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement