త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లు.. బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు.. ఇక‌పై ఎలా ఇస్తారంటే?

Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం వీబీ జీరామ్‌జీ పథకానికి అనుసంధానం చేసింది. దీంతో బిల్లుల చెల్లింపు ప్ర‌క్రియ‌లో మార్పులు చేసింది. మొదటి, రెండు, నాలుగు విడతల చెల్లింపులు య‌ధావిథిగా కొన‌సాగించ‌గా, మిగిలిన మూడో విడత బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చింది.

G

Telangana | Published On Feb 6, 2026, 5.58 am IST

Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లు.. బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు.. ఇక‌పై ఎలా ఇస్తారంటే?
Advertisement

Indiramma Indlu | త్రినేత్ర‌.న్యూస్‌: ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం మ‌ళ్లీ మార్పులు చేసింది. మొదటి, రెండు, నాలుగు విడతల చెల్లింపులు య‌ధావిథిగా కొన‌సాగించ‌గా, మిగిలిన మూడో విడత బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చింది. ఇందిర‌మ్మ ఇండ్ల పథకాన్ని వీబీ జీరామ్‌జీ (VB G RAM G Scheme) ప‌థ‌కానికి (గ్రామీణ ఉపాధి హామీ) అనుసంధానించ‌డంతో త‌ప్ప‌నిస‌రిగా మార్పులు చేయాల్సి వ‌చ్చింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ముఖ్యంగా ఉపాధి హామీ జాబ్‌కార్డు ఉన్న ఇందిరమ్మ ఇండ్ల‌ లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించి, ఆ వేతనం డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.

గ‌త రెండేండ్లుగా ఉపాధిహామీలో కొత్తగా చేరిన‌వారికి జాబ్‌కార్డులు ఇవ్వ‌డం లేదు. దీంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారిలో జాబ్‌కార్డులు లేనివారే ఎక్కువ‌గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారికి ప్రత్యేకంగా జాబ్‌కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించ‌డంతో అధికారులు చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం జాబితాలను తయారు చేసి పంపించారు. వారిలో కొందరికి ఇప్ప‌టికే కొత్త జాబ్‌కార్డులు అందించగా, మిగిలిన వారికి కూడా త్వరలోనే ఇవ్వ‌నున్న‌ట్లు సంబంధిత అధికారులు వెల్ల‌డించారు.

చెల్లింపులు ఇలా..
ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. పునాది వరకు పూర్తి చేస్తే రూ.లక్ష, గోడలు నిర్మించిన తర్వాత రూ.లక్ష, పైకప్పు వేసిన తర్వాత రూ.1.40 లక్షలు, పని పూర్తయిన తర్వాత రూ.లక్ష చొప్పున మొత్తం రూ.4.40 లక్షలు చెల్లింపులు చేయనున్నారు. తర్వాత ఉపాధిహామీ కింద రోజుకు రూ.307 చొప్పున 90 రోజులకు రూ.27,630, స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.12 వేలు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన కింద రూ.21 వేల చొప్పున మొత్తం రూ.60 వేలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

కాగా, ఇందిరమ్మ ఇండ్ల‌ నిర్మాణ ప్రక్రియ సగానికిపైగా నత్తనడకన సాగుతున్న‌ది. 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో మంజూరైన ఇండ్ల‌లో కేవలం 53.77 శాతం మాత్రమే ప‌నులు జ‌రుగుతున్నాయి. జీహెచ్ఎంసీ మిన‌హా రాష్ట్ర‌వ్యాప్తంగా 3,69,014 ఇండ్ల‌ను ప్ర‌భుత్వం కేటాయించింది. వాటిలో 3,49,295 మంజూరు చేసింది. 2,49,554 ఇండ్ల‌ గ్రౌండింగ్‌ పనులు పూర్తవ‌గా, 76,284 ఇండ్లు పునాది దశలో, 41,232 గోడల దశలో, 78,081 పైకప్పు దశలో, 2,809 ఇండ్లు చివరి దశలో ఉన్నాయి. మ‌రో 1,98,406 ఇండ్ల‌ పనులు కొంత వరకు కొనసాగుండ‌గా, 1,50,889 ఇండ్ల‌ నిర్మాణంలో ఎలాంటి పురోగతి కనిపించక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజావార్తలు

Advertisement