త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Census 2027 | మే 11 నుంచి తెలంగాణ‌లో ఇండ్ల గ‌ణ‌న‌..!

Census 2027 | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జ‌నాభా లెక్కింపుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈసారి జ‌న‌గ‌ణ‌నను రెండు ద‌శ‌ల్లో చేప‌ట్టనున్నారు. తొలి ద‌శ‌లో ఇండ్ల గ‌ణ‌న‌, రెండో ద‌శ‌లో జ‌నాభా లెక్క‌లు తీయ‌నున్నారు.

S

Telangana | Published On Feb 23, 2026, 6.32 pm IST

Census 2027 | మే 11 నుంచి తెలంగాణ‌లో ఇండ్ల గ‌ణ‌న‌..!
Advertisement

Census 2027 | త్రినేత్ర‌.న్యూస్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జ‌నాభా లెక్కింపుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈసారి జ‌న‌గ‌ణ‌నను రెండు ద‌శ‌ల్లో చేప‌ట్టనున్నారు. తొలి ద‌శ‌లో ఇండ్ల గ‌ణ‌న‌, రెండో ద‌శ‌లో జ‌నాభా లెక్క‌లు తీయ‌నున్నారు. దేశంలో ప్ర‌తి ప‌దేళ్ల‌కో సారి జ‌నాభా లెక్క‌లు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రిసారిగా 2011లో జ‌నాభా లెక్క‌లు జ‌రిగాయి. 2021లో జ‌ర‌గాల్సిన జ‌న‌గ‌ణ‌న‌.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత జన‌గ‌ణ‌న‌కు అడుగులు ప‌డుతున్నాయి. జ‌న‌గ‌ణ‌న 2027కు సంబంధించి ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కూడా జ‌న‌గ‌ణ‌న‌కు వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటుంది. జ‌న‌గ‌ణ‌న 2027ను రెండు ద‌శ‌ల్లో చేప‌ట్ట‌నున్నారు. తొలి ద‌శ‌లో ఇండ్ల గ‌ణ‌నను, రెండో ద‌శ‌లో జ‌నాభాను లెక్కించ‌నున్నారు.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కొన‌సాగుతున్న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశంలో జ‌న‌గ‌ణ‌న 2027పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన (Census) 2027ను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది.

నిర్ణీత‌ షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్)ను రాష్ట్రంలో మే 11న ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామకృష్ణరావు మంత్రివర్గానికి వివరించారు. హౌజ్ లిస్టింగ్‌కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను సైతం విశదీకరించారు.

రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు కలిపి మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జనగణన ప్రక్రియలో పాలుపంచుకోనున్న‌ట్లు తెలిపారు. రెండో విడ‌త‌లో భాగంగా అస‌లైన‌ జనగణన ప్రక్రియను 2027 ఫిబ్రవరిలో చేప‌ట్ట‌నున్నారు.

భారత జనగణన చట్టం 1948 సెక్షన్‌ 3 కింద 2027 మార్చి 1 అర్ధరాత్రి 12:00 గంటలకు దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

తొలిసారి డిజిట‌ల్ విధానంలో..

జనగణన – 2027లో తొలిసారిగా డిజిటల్‌ విధానాన్ని తీసుకువచ్చారు. ఇది పేపర్‌, పెన్ను లేకుండా కొనసాగనుంది. ఈ గణనలో పాల్గొనే అధికారులు ట్యాబ్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా పూర్తి సమాచారం సేకరించి సాంకేతిక పద్ధతిలో నిక్షిప్తం చేయనున్నారు. జనాభా లెక్కల్లో ఈసారి ప్రజలే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఆన్‌లైన్‌లో తమ గృహ, కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. తరువాత అధికారులు వీటిని పరిశీలించి నిర్ధారిస్తారు.

రెండో దశలో వ్యక్తి సమాచారం

రెండో దశ జనాభా లెక్కల్లో వ్యక్తి పూర్తి సమాచారం సేకరించనున్నారు. ఆ వ్యక్తి పేరు, ఇంటి యజమానితో అతని సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయసు, జన్మ స్థలం, వివాహ స్థితి, ఏ వయసులో వివాహం చేసుకున్నారు, ఎంతమంది పిల్లలున్నారు, మతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వైకల్యం, మాతృభాష, ఇతర భాషల పట్ల అవగాహన, అక్షరాస్యత, విద్యార్హతలు, ఆర్థిక కార్యకలాపాలు, ఏ పరిశ్రమలో పని చేస్తున్నారు, వ్యాపారం, ఉద్యోగం వంటి వివరాలను సేకరించనున్నారు.

Advertisement
Advertisement