త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRSV | ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిల‌పై బీఆర్ఎస్‌వీ పోరుబాట..

BRSV | రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై బీఆర్‌ఎస్‌వీ ఆందోళనలకు సిద్ధమైంది. సుమారు రూ.8వేల కోట్ల మేర బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

P

Telangana | Published On Apr 25, 2026, 9.25 pm IST

BRSV | ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిల‌పై బీఆర్ఎస్‌వీ పోరుబాట..
Advertisement

BRSV | రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యపై బీఆర్‌ఎస్‌వీ ఆందోళనలకు సిద్ధమైంది. సుమారు రూ.8వేల కోట్ల మేర బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు అందకపోవడంతో విద్యార్థులు పై చదువులకు వెళ్లలేకపోతున్నారని, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా కళాశాలలు ఇవ్వడం లేదని తెలిపారు.

దీనివల్ల అనేక మంది ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని అన్నారు. బ‌డా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం ముందుంటోంద‌ని, కానీ 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైన రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చూపుతోంద‌ని గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఎన్నికల ముందు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి బకాయిలను వెంటనే చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదని ఆయన గుర్తుచేశారు. రెండున్నర సంవత్సరాలు గడిచినా నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.

రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల పై చదువులు, ఉద్యోగ అవకాశాలు రెండూ దెబ్బతింటున్నాయని అన్నారు. కొన్ని విద్యాసంస్థలు ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించాయని, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫీజులను విద్యార్థుల నుంచే వసూలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల ఏప్రిల్ 27న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తామ‌ని, 28న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లక్ష పోస్టుకార్డులు రాసే కార్య‌క్ర‌మం, 29న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల బంద్ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఆయా కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని విద్యార్థుల‌ను గెల్లు శ్రీ‌నివాస్ కోరారు.

Advertisement
Advertisement