త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్ ముక్కు నేల‌కు రాసి.. క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే : హ‌రీశ్‌రావు

Harish Rao | అధికారంలోకి వ‌చ్చాక వంద రోజుల్లో చేస్తానన్న ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదని బీర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు సీఎం ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 20, 2026, 5.45 pm IST

Harish Rao | రేవంత్ ముక్కు నేల‌కు రాసి.. క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే : హ‌రీశ్‌రావు
Advertisement

ఆరు గ్యారెంటీల‌కు నిధులు కుదించారు
మీ మూర్ఖ‌త్వం వ‌ల్లే ఆగిన అభివృద్ధి
మాట‌ల్లో గ‌ట్టి ప‌లుకులు.. చేత‌ల్లో వ‌ట్టి ప‌లుకులు
ఇండస్ట్రియల్ హబ్ కాదు.. అది కరప్షన్ హబ్‌
ఆర్టీసీ రూ. 3 వేల కోట్ల అప్పు ఎందుకు చేసింది..?
రైతుబంధు ఎగ్గొట్టింది నిజం కాదా..?
భ‌ట్టి బ‌డ్జెట్ ద‌గాకోరు బ‌డ్జెట్

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : అధికారంలోకి వ‌చ్చాక వంద రోజుల్లో చేస్తానన్న ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదని బీర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు సీఎం ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల విషయంలో గతేడాది రూ. 56 వేల కోట్లు పెడితే, ఈ బడ్జెట్‌లో రూ. 50 వేల కోట్లకు కుదించార‌ని హ‌రీశ్‌రావు తెలిపారు. శాస‌న‌స‌భ‌లో భ‌ట్టి విక్ర‌మార్క బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన అనంత‌రం బీఆర్ఎస్ఎల్పీలో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9 శాతం ఎక్కువ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో 14 శాతం అయితే, కాంగ్రెస్ పాలనలో 10 శాతం న‌మోదై నాలుగు శాతం త‌గ్గింది. మా పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటు 12.5 శాతం ఉంటే, కాంగ్రెస్ పాలనలో 10.7 శాతానికి తగ్గింది. పాలనలో మీరు ఫెయిల్ అయ్యారు. హైడ్రా కూల్చి వేతల వల్ల, మీ మూర్ఖత్వం వల్ల అభివృద్ది ఆగిపోయింది. మాటల్లో గట్టి పలుకులు చేతల్లో వ‌ట్టి పలుకులు. జీఎస్డీపీలో డౌన్, తలసరి ఆదాయం వృద్దిలో డౌన్. క్యూర్, ప్యూర్, రేర్ కాదు.. చోర్ మోడల్, గోల్ మాల్ మోడల్ అని హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణం మీద లేదు..

మూడు ముక్కల ఆట గురించే ప్రసంగంలో చెప్పారు కానీ, ఆరు గ్యారెంటీల గురించి లేదు. భూముల మీద ఉన్న ప్రేమ, ప్రజల మీద లేదు. తెలంగాణను మూడు ముక్కలు చేశారు, జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారు. కూల్చడం మీద ఉన్న ప్రేమ నిర్మాణం మీద లేదు. చేతగాని తనాన్ని ఒప్పుకున్నరు. పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లు చేస్తే పెట్టుబడుదారులు వస్తరా? పాలసీల పేరిట అక్రమాలు చేస్తే అభివృద్ది జరుగుతుందా..? ఇండస్ట్రియల్ హబ్ కాదు, కరప్షన్ హబ్‌గా మార్చారు. 30వేల ఎకరాల్లో ప్యూచర్ సిటీ కడుతం అంటరు. ఉన్నదా అంత భూమి? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

ముఖ్యమంత్రి ఎన్నడైనా ప్రజావాణి నిర్వహించిండా?

బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామకపత్రాలు ఇచ్చి 60వేల ఉద్యోగాలు ఇచ్చినం అంటున్నరు. ప్రజావాణి గురించి గొప్పలు చెబుతున్నరు. ముఖ్యమంత్రి ఎన్నడైనా ప్రజావాణి నిర్వహించిండా? ప్రజలకు అందుబాటులో ఉన్నడా? మహాలక్ష్మి పేరిట రూ. 2800 కోట్ల బకాయి పడింది. ఆర్టీసికి రూ. 9222 కోట్లు ఇచ్చి ఉంటే ఆర్టీసీ రూ. 3వేల కోట్ల అప్పులు ఎందుకు చేసింది. ఆర్టీసీ లాభాల్లో ఉంటే పింఛన్ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

ఇచ్చినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా..?

కొత్త పింఛన్లు కాదు ఉన్న పింఛన్లు ఊడగొడుతున్నరు. 3లక్షల పింఛన్లు తొలగించి, కొత్త పింఛన్లు ఇస్తం అంటున్నరు. పింఛన్ల పెంపు ఎప్పుడు అని ప్రజలు ఎదురు చూస్తున్నరు. కేసీఆర్ పదింతలు పింఛన్లు పెంచితే, మీరు మోసం చేశారు. మేం ప్రశ్నిస్తున్నాం అని వడ్డీ లేని రుణాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. రాష్ట్ర మహిళలందరిని మోసం చేశారు. రైతు బంధు మూడు పంటలు ఎగ్గొట్టారు. రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు. బోనస్ దోఖా చేశారు. గతేడాది యాసంగి సన్నరకం వడ్లకు వెయ్యి కోట్లు ఎగ్గొట్టింది. నిస్సిగ్గుగా రెండు పంటలకు సన్న వడ్లకు బోనస్ ఇచ్చినం అంటున్నరు. మీరు రెండు పంటలకు ఇచ్చారా? రాజీనామా చేస్తరా? ఇచ్చినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా..?వానాకాలం ఇచ్చి, యాసంగి ఎగ్గొట్టింది నిజం కాదా? అని హ‌రీశ్‌రావు అడిగారు.

అన్ని వర్గాల ప్రజలను నిరాశ పర్చిన బడ్జెట్ ఇది..

ఉత్తం కుమార్ రెడ్డినేమో 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినం అంటే భట్టినేమో ఇవ్వలేదు అంటున్నరు. తెలంగాణ చీకట్ల మగ్గింది కాంగ్రెస్ పాలనలోనే. మీ పాలనలో క‌రెంట్ కోత‌ల‌తో పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేశారు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చారు. యాదాద్రి ప్లాంట్ ఎవరు ప్రారంభించారు. ఈ రోజు యాదాద్రి తెలంగాణ జాతికి గర్వకారణం అంటున్నారు. మా ఖ్యాతిని కూడా తమదిగా చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆ రోజు యాదాద్రి తీసేస్తాం మూసేస్తాం అన్నరు. నేడు మా గొప్పతనం అంటున్నరు. సింగరేణిను స్కాంల ఖనిగా మార్చారు. కుంభకోణాల కేంద్రంగా మార్చారు. బోగస్ ప్రొడక్షన్, బోగస్ ఇన్ కం టాక్స్. బోగస్ లెక్కలు. ఇరిగేష‌న్‌లో కూడా బోగ‌స్. బడ్జెట్ ప్రసంగానికి వీసమెత్తైనా నిజాయితీ ఉందా. బ్రేక్ ఫాస్ట్ పథకం గురించి డబ్బా కొట్టారు. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించింది కేసీఆర్ కాదా..? టిమ్స్ సనత్ నగర్ ప్రారంభిస్తాం అని నాలుగు డేట్లు మారాయి. డేట్లు, డెడ్ లైన్లు మారాయి తప్ప ఆసుపత్రి అందుబాటులోకి రాలేదు. దగాకోరు బడ్జెట్ ఇది. అన్ని వర్గాల ప్రజలను నిరాశ పర్చిన బడ్జెట్ ఇది అని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

Advertisement

తాజావార్తలు

Advertisement