త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipalities Chairman Election Schedule | బాల్క సుమన్ వార్నింగ్ ఎఫెక్ట్? మూడు మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

క్యాథన్‌పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు షెడ్యూల్ విడుదల చేసింది. బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని హెచ్చరించిన వెంటనే ఈ ప్రకటన వెలువడటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

J

Telangana | Published On Mar 30, 2026, 10.00 pm IST

Municipalities Chairman Election Schedule | బాల్క సుమన్ వార్నింగ్ ఎఫెక్ట్? మూడు మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు
Advertisement
  • ఏప్రిల్ 4న క్యాథన్‌పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు
  • హైకోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)
  • ఈ మూడు మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికల కోసం తీవ్ర స్థాయిలో న్యాయపోరాటం చేసిన బీఆర్‌ఎస్
  • ప్రభుత్వ తీరుపై నిరసనలు, ఎస్‌ఈసీపై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరిక
  • సుమన్ ప్రెస్‌మీట్ పెట్టిన కొద్దిసేపటికే షెడ్యూల్ విడుదల కావడం సర్వత్రా చర్చనీయాంశం

Municipalities Chairman Election Schedule | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మూడు మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికల పంచాయతీ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. మంచిర్యాల జిల్లా క్యాథన్‌పల్లి మున్సిపాలిటీతో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) ముహూర్తం ఖరారు చేసింది. హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం గడువు ముగుస్తున్న నేపథ్యంతో ఎన్నికల కమిషన్ హుటాహుటిన ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఏప్రిల్ 4న ఎన్నికలు

ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం.. క్యాథన్‌పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలకు ఏప్రిల్ 4వ తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించింది.

ఫలించిన బీఆర్‌ఎస్ న్యాయపోరాటం

ఈ మూడు మున్సిపాలిటీల పరిధిలో చైర్మన్ ఎన్నికలను ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నాయని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ (BRS) తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించి సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. బీఆర్‌ఎస్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.

సుమన్ హెచ్చరించిన వెంటనే

కోర్టు తీర్పు వచ్చినా ఎన్నికల కమిషన్ నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం బీఆర్‌ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని, మంగళవారం హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ (Contempt of Court) పిటిషన్ దాఖలు చేస్తామని సుమన్ ప్రకటించారు. అలాగే, ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని తేల్చిచెప్పారు.

ఆసక్తికర పరిణామం ఏంటంటే.. బాల్క సుమన్ ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వానికి, ఎస్‌ఈసీకి అల్టిమేటం జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఎన్నికల సంఘం ఈ మూడు మున్సిపాలిటీల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. దీంతో సుమన్ వార్నింగ్ ఎఫెక్ట్ వల్లే, కోర్టు ధిక్కరణ కేసుల భయంతోనే కమిషన్ హడావుడిగా షెడ్యూల్ ఇచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement