త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Vaddiraju | బీఆర్ఎస్‌ను దెబ్బ‌తీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మ‌క్కు : ఎంపీ వ‌ద్దిరాజు

MP Vaddiraju | బీఆర్ఎస్‌ను ఏకాకిని చేసే ఏకైక ఎజెండాతో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా, కుయుక్తులు పన్నినా ప్రజాబలం దండిగా ఉన్న బీఆర్ఎస్‌ను ఆ రెండు పార్టీలు ఏమి చేయలేవన్నారు.

S

Telangana | Published On May 20, 2026, 2.56 pm IST

MP Vaddiraju | బీఆర్ఎస్‌ను దెబ్బ‌తీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మ‌క్కు : ఎంపీ వ‌ద్దిరాజు
Advertisement

MP Vaddiraju | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్‌ను ఏకాకిని చేసే ఏకైక ఎజెండాతో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా, కుయుక్తులు పన్నినా ప్రజాబలం దండిగా ఉన్న బీఆర్ఎస్‌ను ఆ రెండు పార్టీలు ఏమి చేయలేవన్నారు.

ఖమ్మం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు అధ్యక్షతన బుధవారం సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.

ముగ్గురు మంత్రుల దృష్టి కేవలం సంపాదనపైనే

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లా అన్ని విధాలా అభివృద్ధి జరిగిందని, ఇక్కడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల దృష్టి కేవలం సంపాదనపైనే తప్ప ప్రజలకు మంచి చేయాలని ఏమాత్రం కూడా లేదన్నారు. బీఆర్ఎస్ పాలనా కాలంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి చెప్పుకునేందుకు చాలా అంశాలు ఉన్నాయని, కాంగ్రెస్ సర్కారులో అంతా శూన్యమేనని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని

చట్టసభల్లో మహిళలు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ తొట్టతొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కేసీఆర్ తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేశారని వివరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ. 20వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీనిచ్చి అమలు చేయకుండా ఘోరంగా మోసం చేసిందని ఎంపీ వద్దిరాజు దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజులు చెల్లించడం లేదని, యువతకు ఉద్యోగాలు లేవని, రైతులు పండించిన పంట కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

యువతకు, మహిళలకు మంచి అవకాశాలు

వచ్చే ఎన్నికల నాటికి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయని, యువతకు, మహిళలకు మంచి అవకాశాలు లభిస్తాయని ఎంపీ రవిచంద్ర తెలిపారు. తమిళనాడులో యువత సంపూర్ణ మద్దతునివ్వడంతో విజయ్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. బీఆర్ఎస్ కూడా యువతను, మహిళలను మరింత ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇంకా రెండున్నరేళ్ల కాంగ్రెస్ దరిద్రాన్ని అనుభవించక తప్పదని, "రేవంత్ పోవాలి-కేసీఆర్ రావాలి" అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఎన్నికల్లో కేసీఆర్ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మనమందరం మరింత క్రమశిక్షణతో, ఐకమత్యంతో ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రుల గూబ గుయ్య్ మనేలా 10కి 10 సీట్లను బీఆర్ఎస్ గెల్చుకునేలా కష్టపడుదామని ఎంపీ వద్దిరాజు గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు దిండిగల రాజేందర్, కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ, ఖమర్, పగడాల నాగరాజు, మంజుల, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement