త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KP Vivekananda | అసెంబ్లీలో హరీష్ రావు ప్రశ్నిస్తే.. కేరళ పారిపోయారు: కేపీ వివేకానంద

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

J

Telangana | Published On Apr 8, 2026, 9.00 pm IST

KP Vivekananda | అసెంబ్లీలో హరీష్ రావు ప్రశ్నిస్తే.. కేరళ పారిపోయారు: కేపీ వివేకానంద

సంక్షిప్త సారాంశం

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలు కేపీ వివేకానంద, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాల గురించి హరీష్ రావు అసెంబ్లీలో ప్రశ్నిస్తే, పొంగులేటి సమాధానం చెప్పకుండా కేరళ పారిపోయారని ఆరోపించారు. నాదర్‌గుల్, వట్టినాగులపల్లి భూముల విషయంలో మంత్రి వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
  • పొంగులేటి లక్ష్యంగా బీఆర్ఎస్ ఫైర్
  • అక్రమ మైనింగ్‌పై రాజీనామాకు డిమాండ్

KP Vivekananda | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్‌గా ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీ విమర్శల దాడిని తీవ్రం చేసింది. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ విప్ కె.పి. వివేకానంద, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌లు పొంగులేటిపై నిప్పులు చెరిగారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్, నాదర్‌గుల్ భూముల వ్యవహారంలో మంత్రి తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద మాట్లాడుతూ పొంగులేటి తీరును ఎండగట్టారు. బడ్జెట్ సమావేశాల్లో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు ఆధారాలతో సహా ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేక పొంగులేటి రాత్రికి రాత్రే కేరళకు పారిపోయారని విమర్శించారు. కేరళ ఎన్నికల ప్రచారమనే సాకుతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు.

"రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలను బీఆర్ఎస్ బయటపెట్టగానే, అలుగులోంచి ఎలుక బయటకు వచ్చినట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చారు. ఆయన మీడియా సమావేశం చూస్తే.. తన అనుచర మంత్రివర్గం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆయనే ఒప్పుకున్నట్లు ఉంది" అని వివేకానంద ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కాళ్లు పట్టుకున్న సంగతి మర్చిపోయారా?

"గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల అపాయింట్‌మెంట్ కోసం గంటల తరబడి వేచి చూసిన సంగతి పొంగులేటి మర్చిపోయారా? కేసీఆర్ కాళ్లు పట్టుకున్నప్పుడు నేను దగ్గరుండి చూశాను. ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టారు. కుడితిలో పడ్డ ఎలుకలా ఆయన పరిస్థితి తయారైంది. అక్రమ మైనింగ్‌కు పాల్పడినందుకు పొంగులేటి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి" అని వివేకానంద డిమాండ్ చేశారు.

ఇది మంత్రి ప్రెస్ మీట్ కాదు.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్ ప్రెస్ మీట్: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి వాడిన భాషను తీవ్రంగా ఆక్షేపించారు. నిస్సహాయులైన మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌లను పక్కన పెట్టుకుని ఆయన మాట్లాడిన తీరు ఒక రెవెన్యూ మంత్రిలా లేదని, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్‌లా ఉందని విమర్శించారు.

"తెలంగాణ ప్రజలను నడిపిస్తుంది రాఘవ కన్‌స్ట్రక్షన్సా? మేఘా ఇంజనీరింగ్ సంస్థనా? అనే అనుమానం కలుగుతోంది. ప్రజల ఆస్తులను ఈ రెండు సంస్థలే దోచుకుంటున్నాయి. గజ్జి కుక్కలు, అడవి పందులు అంటూ పొంగులేటి వాడిన భాష మాకు రాదు. మాకు కేసీఆర్ సంస్కారం నేర్పించారు" అని ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

నాదర్‌గుల్, వట్టినాగులపల్లి భూముల్లో దౌర్జన్యం

"రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన పొంగులేటి.. రెవెన్యూ శాఖను తీసుకోవడమే ఒక తప్పు. నాదర్‌గుల్ భూములను కాపాడింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు ఆ భూములకు బోర్డులు తగిలిస్తుంటే మంత్రి ఏం చేస్తున్నారు? కొత్వాల్ గూడలో బ్లూ షీట్స్ పై రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అని రాసి ఉంటే, రాత్రికి రాత్రే దానిపై కలర్ వేశారు" అని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

అలాగే వట్టినాగులపల్లి భూముల విషయంలో సతీష్ షా, పల్లవి షా ఇంటికి 70 మంది బౌన్సర్లు, జేసీబీలతో వెళ్లి బెదిరించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీస్ అధికారి హబీబుల్లా ఖాన్‌ను వెంటనే ఎందుకు బదిలీ చేశారని నిలదీశారు. తెలంగాణ ప్రజల ఆస్తులను దోచుకుంటూ పోతే.. హిమాయత్ సాగర్ వద్ద ఉన్న పొంగులేటి ఇంటి ముందు ధర్నా చేసే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వ భూములకు రక్షణగా ఉంటారా? బిల్డర్లకా?: దాసోజు శ్రవణ్

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ నాదర్‌గుల్ భూముల వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ భూములను రక్షించేందుకు హైకోర్టులో పోరాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.

"ప్రస్తుతం నాదర్‌గుల్ భూముల కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఈ కేసులో పొంగులేటి ఒక భాగస్వామిగా ఉన్నారు. ఆ భూముల్లో ప్రైవేట్ కంపెనీలు బోర్డులు పెడుతుంటే రెవెన్యూ మంత్రిగా ఆయన ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా? ఆయన ప్రభుత్వ భూములను రక్షిస్తారా.. లేక ప్రైవేట్ బిల్డర్లకు బాసటగా ఉంటారా అనేది తేల్చుకోవాలి" అని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement