త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | ఆకునూరి ముర‌ళి ఒళ్లంతా విష‌మే.. విద్యా క‌మిష‌న్ రిపోర్టుపై ఆర్ఎస్పీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

RS Praveen Kumar | తెలంగాణ విద్యాశాఖ క‌మిష‌న్ చైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి ఒళ్లంతా విషం నింపుకుని విద్యా క‌మిష‌న్ రిపోర్టును త‌యారు చేసిన‌ట్లు బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Mar 1, 2026, 3.42 pm IST

RS Praveen Kumar | ఆకునూరి ముర‌ళి ఒళ్లంతా విష‌మే.. విద్యా క‌మిష‌న్ రిపోర్టుపై ఆర్ఎస్పీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

రేవంత్ పాల‌న‌లో విద్యా వ్య‌వ‌స్థ మీద కుట్ర‌లు
మేం అధికారంలోకి రాగానే ఆ రిపోర్టును చెత్త‌బుట్ట‌లో వేస్తాం..
ఉపాధ్యాయుల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీశారు..
విద్యా కమిషన్ రిపోర్ట్‌తో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీసే కుట్ర
మరి ఐఏఎస్, ఐపీఎస్‌ల ప్రమోషన్లకు టెస్టులు వద్దా..?
కోపం ఉంటే మ‌మ్మ‌ల్ని కాల్చండి..
పేద పిల్ల‌ల మీద ఎందుకంత కోపం
ఇంకా ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎందుకు.?
అంగ‌న్వాడీ సెంట‌ర్ల‌ను మూసివేసే కుట్ర‌
ఆకునూరి ముర‌ళిపై మండిప‌డ్డ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ విద్యాశాఖ క‌మిష‌న్ చైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి ఒళ్లంతా విషం నింపుకుని విద్యా క‌మిష‌న్ రిపోర్టును త‌యారు చేసిన‌ట్లు బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో రేవంత్ పాల‌న‌లో విద్యా వ్య‌వ‌స్థ మీద కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

మూడు రోజుల క్రితం విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సీఎం రేవంత్ రెడ్డికి విద్యా విధానం మీద నివేదిక ఇచ్చారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే విద్యాకమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేస్తాం. ఉపాధాయ్యుల ఆత్మగౌరవం దెబ్బ తీసే ప్రయత్నం ఈ రిపోర్టులో జరిగింది. లక్షా 70 వేల మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు. ఉపాధ్యాయుల జీతాలను విద్యాకమిషన్ కాదు నిర్ధారించాల్సింది. పీఆర్సీ నిర్ణయించాలి. ఒళ్ళంతా విషం నింపుకుని ఆకునూరి మురళి ఈ రిపోర్ట్ తయారు చేశారు. ఏ మాత్రం సమీక్షించకుండా పదేళ్ల కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని మురళి ఎలా అంటారు..? లక్షా 70 వేల మంది ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయ, ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచిన ఘనత కేసీఆర్‌ది

విద్యుత్ కమిషన్, కాళేశ్వరం కమిషన్‌ల‌తో కేసీఆర్ కృషిని తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు విద్యా కమిషన్ రిపోర్ట్‌తో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీసే కుట్ర చేశారు. రూ. 7900 కోట్లతో మన ఊరు మనబడి కార్యక్రమంతో 25 వేల స్కూళ్లను కేసీఆర్ బాగు చేశారు. గురుకులాల గురించి కేసీఆర్ హయంలో జరిగిన కృషిని వేరే చెప్పనక్కర్లేదు. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, స్పోర్ట్స్ అకాడమీలు ఇలా ఎన్నో కేసీఆర్ హయంలో ప్రారంభించిన విషయం ఆకునూరి మురళికి కనిపించలేదా..? విద్యావ్యవస్థకు రాజకీయాలు జత చేయొద్దని మురళి అంటూనే కేసీఆర్‌ను ఎందుకు విమర్శిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పీఆర్సీ ద్వారా ఉపాధ్యాయ, ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచిన ఘనత కేసీఆర్‌ది అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ గుర్తు చేశారు.

నష్టపోయేది గ్రామీణ ప్రాంత విద్యార్థులు కాదా..?

ఉపాధ్యాయుల జీతాలు పెంచకుండా రేవంత్ రెడ్డి విద్యా కమిషన్‌తో రిపోర్టు ఇప్పించుకున్నారు. ఉపాధ్యాయులకు టెస్టులు పెట్టి ప్రమోషన్లు ఇవ్వాలని మురళి రిపోర్టు ఇచ్చారు. మరి ఐఏఎస్, ఐపీఎస్‌ల ప్రమోషన్లకు టెస్టులు వద్దా..? విద్యావ్యవస్థలో ఉన్నత ప్రమాణాలు రావాలంటే ఉపాధ్యాయుల జీతాలు గౌరవ ప్రదంగా ఉండాలి. ఈ మాటే మేధావులు ఏంతో మంది చెప్పారు. ఇది నిచ్చెన మెట్ల సమాజమని మురళికి తెలియదా? ఇంజినీరింగ్ ఎంట్రన్స్ రద్దు చేసి ఇంటర్ మార్కుల ద్వారా అడ్మిషన్లు ఇవ్వాలని కమిషన్ ఎలా చెబుతుంది? ఇంటర్ మార్కుల ద్వారా ఇంజినీరింగ్ సీట్లు అంటే నష్టపోయేది గ్రామీణ ప్రాంత విద్యార్థులు కాదా..? కార్పొరేట్ కళాశాలలకు ఈ సిఫార్సు మేలు కలిగించదా..? ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ర‌ద్దు చేయాల‌ని క‌మిష‌న్ రిపోర్టు ఇచ్చింది. ఇది పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే చర్య. రేవంత్ రెడ్డికి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇష్టం లేకనే విద్యా కమిషన్ చేత‌ ఆ మాట చెప్పించారు అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఛిద్రమైన విద్యావ్యవస్థను కేసీఆర్ బాగు చేశారు

గురుకులాలు క్రమంగా రద్దు చేయాలని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకే గురుకులాలు రద్దు చేయాలంటున్నారు. డిగ్రీ గురుకులాలు రద్దు చేయమంటున్నారు. ఇంత కన్నా దారుణమైన చర్య ఉంటుందా..? పేద విద్యార్థినుల కోసం డిగ్రీ గురుకులాలు పెట్టారనే విషయం మరచిపోతున్నారు. దేశంలోనే మొదటి సారి పెట్టిన మహిళా డిగ్రీ గురుకులాలు మంచి ఫలితాలు వచ్చాయి. మురళికి కోపం ఉంటే మమ్మల్ని కాల్చండి.పేద కుటుంబాల మీద ఎందుకంత కోపం..? కేసీఆర్ టీచర్లను మనుషులుగా చూశారు. నేనే 8 వేల మంది గురుకులాల టీచర్లను నియామకం చేశాను. తర్వాత ఘంటా చక్రపాణి గురుకులాల టీచర్ల నియామకం చేశారు. కేసీఆర్ హయాంలో టీచర్ల రిక్రూట్మెంట్ జరగలేదు అని మురళి ఎలా అంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ఛిద్రమైన విద్యావ్యవస్థను కేసీఆర్ బాగు చేశారు అని ఆర్ఎస్పీ స్ప‌ష్టం చేశారు.

మురళికి అప్పగించిన బాధ్య‌త‌ ఏమిటీ.?

పౌష్టికాహారం లోపం ఉన్న శిశువును ఇంక్యుబేటర్‌లో పెట్టి కాపాడుకున్నట్టే.. కేసీఆర్ విద్యావ్యవస్థను చంటి బిడ్డను కాపాడుకున్నట్టు కాపాడారు. విద్యాకమిషన్ రిపోర్టులో సిరిసిల్ల గురుకులాల ఫోటోలు పెట్టారు. కేసీఆర్ హయంలో ఏమీ చేయకుంటే ఆ ఫోటో\లు ఎలా పెట్టారు..? పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు అనేది లోప భూయిష్ఠమైన విధానం. అన్నీ బంద్ చేస్తామనే విద్యాకమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఇట్లా అయితే విద్యా ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి.? ప్రభుత్వ డబ్బును కేసీఆర్‌ను తిట్టడానికి ఎలా దుర్వినియోగం చేస్తారు? విద్యా వ్యవస్థలో ఖర్చు ఎట్లా తగ్గించాలని రిపోర్ట్ ఇచ్చినట్టుంది. మురళికి అప్పగించిన భాద్యత ఏమిటీ.? ఆయన చేసిందేమిటీ.? గౌలిదొడ్డి ఎక్స‌లెన్స్ స్కూల్‌ను విద్యా క‌మిష‌న్ సంద‌ర్శిస్తే వాస్త‌వాలు తెలిసేవి. ఏ సంక్షేమ గురుకులం అయినా అన్ని వర్గాల విద్యార్థులు ఉంటారు. ఇంకా ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎందుకు.? బీసీ సంక్షేమ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖలు ఎందుకు? ఒక్కటే ఇంటిగ్రేటెడ్ సంక్షేమ శాఖ పెట్టకపోయారా..? మంత్రులు ఎందుకు ఒక ముఖ్యమంత్రి దగ్గరే అన్ని శాఖలు పెట్టండి అని ఆర్ఎస్పీ ధ్వ‌జ‌మెత్తారు.

అంగన్‌వాడీ సెంటర్లను బంద్ పెట్టే కుట్ర

ప్రీ ప్రైమరీ స్కూళ్ల పేరుతో అంగన్‌వాడీ సెంటర్లను బంద్ పెట్టే కుట్ర జరుగుతోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాల‌సీని విద్యా కమిషన్ కాపీ పేస్ట్ చేసింది. విద్యా కమిషన్ సిలబస్ గురించి ఎందుకు మాట్లాడలేదు. అర్థం పర్థం లేని సిఫార్సులతో ఉన్న ఈ విద్యాకమిషన్ రిపోర్టును చెత్త బుట్టలో వేయాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి నెలకోసారి విద్యా శాఖపై రివ్యూ చేస్తే సాధించిందేమిటి? గురుకులాల్లో దారుణమైన పరిస్థితులు ఎందుకుంటాయి? విద్యావ్యవస్థను కమిషన్ భుజాల మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డి కాల్చాలనుకుంటున్నారు. ఈ కమిషన్ రిపోర్టు అమలయితే తెలంగాణ విద్యావ్యవస్థ వెనక్కి పోవడం ఖాయం అని ఆర్ఎస్పీ ప్ర‌వీణ్ కుమార్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement