త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singireddy Niranjan Reddy | పంటలు వేయొద్దు.. కొనొద్దు.. బోనస్ ఇవ్వొద్దు

ఎల్ నినో సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, ఏపీ నీళ్లు దోచుకుపోతున్నా చోద్యం చూస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.

J

Telangana | Published On Aug 24, 2026, 5.51 pm IST

Singireddy Niranjan Reddy | పంటలు వేయొద్దు.. కొనొద్దు.. బోనస్ ఇవ్వొద్దు
Advertisement
  • శ్రీశైలంలో 170 టీఎంసీల నీళ్లున్నా, 'ఎల్ నినో' సాకుతో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లివ్వడం లేదని బీఆర్ఎస్ (BRS) ఆరోపణ
  • పాలమూరు, కేఎల్ఐ, జూరాల పంపులను వెంటనే నిరంతరాయంగా నడపాలని డిమాండ్
  • పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ రోజూ 12 టీఎంసీల నీటిని దోచుకెళ్తున్నా రాష్ట్ర మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శ
  • అందాల పోటీలు, ఫుట్‌బాల్ మ్యాచులపై పెడుతున్న ఖర్చు, ప్రాజెక్టుల నిర్వహణపై పెట్టాలని హితవు

Singireddy Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్ : శ్రీశైలంలో సరిపడా నీళ్లున్నా ఎల్ నినో (El Nino) పేరుతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టికొడుతోందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గాదరి కిషోర్‌తో కలిసి కేసీఆర్ హయాంలో జరిగిన సాగునీటి అభివృద్ధిని, ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Govt) అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.

రైతులను భయపెడుతున్నారు.. పంపులు ఆన్ చేయాలి

రాష్ట్రంలో నీళ్లు లేవని చెప్పి రైతులు పంటలు వేయకుండా ప్రభుత్వం భయపెడుతోందని, సర్కారు భయానికి సగం మంది సాగు కూడా చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరద లేకపోయినా ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి రోజూ 5 వేల క్యూసెక్కుల రీజనరేటెడ్ వాటర్ జూరాలకు చేరుతోందని గుర్తుచేశారు. తక్షణమే పాలమూరు, కేఎల్ఐ (KLI), జూరాల పంపులను నిరంతరాయంగా నడపాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలు వేయొద్దు, కొనొద్దు, బోనస్ ఇవ్వొద్దు అన్న కోణంలోనే ఎల్ నినో పేరుతో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఏపీ దోపిడీని ఆపండి.. మెస్సీపై ఉన్న శ్రద్ధ రైతులపై ఏదీ?

వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా సామర్థ్యం పెంచారని, ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్‌లో (Srisailam Reservoir) నీటిమట్టం 854 అడుగులకు చేరగానే ఏపీ నీటిని ఎత్తుకుపోతోందని నిరంజన్ రెడ్డి వివరించారు. రోజూ సగటున 12 టీఎంసీల నీళ్లు ఏపీకి వెళ్తుంటే.. ఇక్కడి మంత్రులు సిగ్గులేకుండా శ్రీశైలం డ్యామ్ వద్ద ధర్నా చేస్తామనడం వారి అసమర్థతకు నిదర్శనమన్నారు. చేతనైతే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) వద్ద కొట్లాడి ఆంధ్రా దోపిడీని అడ్డుకోవాలని సవాల్ చేశారు.

కేవలం రూ.600 లేదా రూ.700 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పరిధిలోని రిజర్వాయర్లు నిండేవని, ఎల్ నినో వచ్చినా రైతులకు సాగునీరు అందేదన్నారు. అందాల పోటీలు, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచుల కోసం పెడుతున్న ఖర్చు ఇరిగేషన్ ప్రాజెక్టులపై పెడితే రైతులకు మేలు జరిగేదని ఆయన ఎద్దేవా చేశారు.

ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారుగా ఎలా పెడతారు?

తెలంగాణ ప్రాజెక్టులకు ఎలా అడ్డుకట్ట వేయాలో బాగా తెలిసిన ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌ను.. తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకోవడం ప్రభుత్వ ఉద్దేశపూర్వక కుట్ర అని ఆయన విమర్శించారు. అటవీ, కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు లేకపోయినా వెలుగోడు ద్వారా నీటిని తరలించేందుకు ఏపీ సొరంగాలు నిర్మిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు.

ఒకరిపై ఒకరికి నియంత్రణ లేని మంత్రులతో తెలంగాణలో సర్కార్ నడుస్తోందా లేక సర్కస్ నడుస్తోందా అని ప్రశ్నించారు. ఏపీ సాగునీటి దోపిడీని అడ్డుకోకపోతే చరిత్రలో అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వంగా ఈ సర్కార్ నిలిచిపోతుందని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement
Advertisement