త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bank Strike | బ్యాంకులు బంద్‌.. నాలుగు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..

Bank Strike | బ్యాంకింగ్‌ సేవలకు సెప్టెంబర్‌లో అంతరాయం ఏర్పడ‌నుంది. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలు, ప్రభుత్వం తీసుకొచ్చిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) సహా పలు పెండింగ్‌ డిమాండ్లపై యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.

S

Business | Published On Aug 24, 2026, 5.40 pm IST

Bank Strike | బ్యాంకులు బంద్‌.. నాలుగు రోజుల సమ్మె.. ఎప్పుడంటే..
Advertisement

Bank Strike | బ్యాంకింగ్‌ సేవలకు సెప్టెంబర్‌లో అంతరాయం ఏర్పడ‌నుంది. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలు, ప్రభుత్వం తీసుకొచ్చిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) సహా పలు పెండింగ్‌ డిమాండ్లపై యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌లో సెప్టెంబర్‌ 11న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెతోపాటు సెప్టెంబర్‌ 28, 29, 30 తేదీల్లో వరుసగా మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డిమాండ్లు పరిష్కారం కాకపోతే అక్టోబర్‌ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని కూడా యూనియన్లు హెచ్చరించాయి. సెప్టెంబర్‌లో మొత్తం నాలుగు రోజుల సమ్మె జరగనుంది. సెప్టెంబర్‌ 11న తొలి దేశవ్యాప్త సమ్మె, సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మె ఉంటాయి. ప్రభుత్వంతో చర్చలు, సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, ప్రచార కార్యక్రమాలు, ప్రదర్శనలు వంటి పలు ఆందోళన కార్యక్రమాలను కూడా యూనియన్లు ప్రకటించాయి.

రెండు ప్ర‌ధాన కార‌ణాలు..

సమ్మె కార్యక్రమంపై ఉద్యోగులకు అవగాహన కల్పించనున్నారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 10 వరకు ఉద్యోగులు నిబంధనల ప్రకారం మాత్రమే పనిచేయాలని, నిర్ణీత పని వేళలను పాటించాలని, అధికారిక వాట్సాప్‌ గ్రూపుల నుంచి వైదొలగాలని యూనియన్లు సూచించాయి. అనంతరం సెప్టెంబర్‌లో సమ్మెలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగ సంఘాల ఆందోళనకు ప్రధానంగా రెండు అంశాలు కారణంగా ఉన్నాయి. మొదటిది ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలు కాగా, రెండోది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం ఇప్పటికే ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌, బ్యాంకు యూనియన్ల మధ్య అంగీకారానికి వచ్చిందని యూఎఫ్‌బీయూ చెబుతోంది.

5 రోజుల ప‌నిదినాల‌ను అమ‌లు చేయాలి..

2024 మార్చి 8న కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందం, 9వ జాయింట్‌ నోట్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజువారీ పని వేళలను 40 నిమిషాలు పెంచి ఐదు రోజుల బ్యాంకింగ్‌ను అమలు చేయడానికి అంగీకారం కుదిరిందని యూనియన్లు పేర్కొన్నాయి. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలనకు పంపినప్పటికీ రెండేళ్లకు పైగా పెండింగ్‌లో ఉందని ఆరోపిస్తున్నాయి. దీంతో ఐదు రోజుల బ్యాంకింగ్‌ను అమలు చేయడం తమ తొలి డిమాండ్‌గా యూనియన్లు ప్ర‌భుత్వం ముందు ఉంచాయి. ఇక రెండో ప్రధాన వివాదం పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం చుట్టూ ఉంది. బ్యాంకు మొత్తం పనితీరును ప్రాతిపదికగా తీసుకుని ఉద్యోగులు, అధికారులకు ఒకే విధమైన ప్రోత్సాహక దినాలను ఇవ్వాలనే అవగాహన తమకు, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌కు మధ్య ఉందని యూఎఫ్‌బీయూ చెబుతోంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం నాలుగో స్థాయి, అంతకంటే పై స్థాయి అధికారులకు వేర్వేరు నిబంధనలతో పీఎల్‌ఐ అమలు చేయాలని బ్యాంకులకు సూచించిందని యూనియన్‌ ఆరోపిస్తోంది.

పీఎల్ఐ విష‌యంలో..

యూఎఫ్‌బీయూ ప్రకారం నాలుగో స్థాయి, అంతకంటే పై స్థాయి అధికారులు వ్యక్తిగత పనితీరు ఆధారంగా గరిష్ఠంగా 365 రోజుల ప్రాథమిక వేతనానికి సమానమైన పీఎల్‌ఐ పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు వర్క్‌మెన్‌ ఉద్యోగులు, మూడో స్థాయి వరకు ఉన్న అధికారులు గరిష్ఠంగా 15 రోజుల ప్రాథమిక వేతనం, డీఏకు సమానమైన పీఎల్‌ఐ మాత్రమే పొందుతారని యూనియన్‌ చెబుతోంది. ఈ విధానం వివక్షపూరితంగా ఉందని యూఎఫ్‌బీయూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

నాలుగు డిమాండ్లు..

దేశంలోని బ్యాంకుల్లో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు ఉన్నారని, వారిలో నాలుగో స్థాయి లేదా అంతకంటే పై స్థాయిలో ఉన్న అధికారులు సుమారు 40 వేల మంది మాత్రమే ఉన్నారని యూనియన్‌ అంచనా వేసింది. అంటే మొత్తం సిబ్బందిలో ఈ వర్గం దాదాపు 5 శాతమే. అయినప్పటికీ వారికి గరిష్ఠంగా 365 రోజుల ప్రాథమిక వేతనం వరకు పీఎల్‌ఐ లభించే అవకాశం ఉండగా, మిగిలిన ఉద్యోగులు గరిష్ఠంగా 15 రోజుల పీఎల్‌ఐకే పరిమితం అవుతారని యూఎఫ్‌బీయూ పేర్కొంది. దీనివల్ల పీఎల్‌ఐలో భారీ వ్యత్యాసం ఏర్పడుతుందని యూనియన్‌ వాదిస్తోంది. యూఎఫ్‌బీయూ ప్రధానంగా నాలుగు డిమాండ్లను ముందుకు తెచ్చింది. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయాల‌ని, ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన, వివక్షపూరితమైన పీఎల్‌ఐ పథకాన్ని ఉపసంహరించుకుని దాని అమలును నిలిపివేయాల‌ని, యూనియన్లతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పథకంలో మార్పులు చేయాల‌ని, మిగిలిన పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాల‌ని కోరింది.

Advertisement
Advertisement