త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balka Suman | నాపై మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో : బాల్క సుమ‌న్

Balka Suman | నాపైన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డీజీపీకి ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిసింది.. మ‌ళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ పేర్కొన్నారు.

S

Telangana | Published On May 27, 2026, 1.18 pm IST

Balka Suman | నాపై మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో : బాల్క సుమ‌న్
Advertisement

Balka Suman | త్రినేత్ర‌.న్యూస్ : నాపైన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డీజీపీకి ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిసింది.. మ‌ళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బాల్క సుమన్ బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడినట్లు తెలిసింది. నేను సింగరేణి కార్మిక సంఘం మీటింగ్‌లో మాట్లాడిన మాటలను వక్రీకరించారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం అయిందని హరీష్ రావు చెప్పారు. సింగరేణిలో స్కామ్‌లు తప్ప స్కీమ్‌లు లేవు. హరీష్ రావు మాట్లాడిన వ్యాఖ్యలపై ప్రజల దృష్టి మరల్చడానికి నేను మాట్లాడిన మాటలను బయట పెట్టారు. నాపైన కేసు పెట్టాలని డీజీపీకి ఫిర్యాదు చేశారని బాల్క సుమ‌న్ తెలిపారు.

నాపైన తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు

నాపైన పెట్టే దృష్టి సింగరేణిపై పెట్టండి. సింగరేణిని సీఎం బామ్మర్దికి అప్పగించారు. నాపైన తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు ఉన్నాయి. సీసీఎస్ డార్క్ సెల్‌తో సహా హైదరాబాద్ నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్నాను. సింగరేణి కార్మికులు, ప్రజల ఓట్లతో నేను రెండు సార్లు గెలిచాను. ప్రజల దృష్టిని మరల్చడానికి నా వ్యాఖ్యలను చీప్ ట్రిక్ కింద వాడారు. నాపైన కేసు పెడితే పెట్టుకోండి. సీఎం కార్యాలయం డైరెక్షన్ మేరకు నన్ను ట్రోల్ చేస్తున్నారు. మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపుతారేమో. క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా నన్ను ఇబ్బందులు పెట్టి జైలుకు పంపారు అని బాల్క సుమ‌న్ పేర్కొన్నారు.

కాలుస్తా.. న‌రుకుతా.. అన్న ఎమ్మెల్యేల‌పై కేసులు పెట్ట‌రా..?

ఫార్మా కంపెనీని కాలుస్తా అన్న జడ్చర్ల ఎమ్మెల్యేపై కేసు పెట్టారా..? నరుకుతా అన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్‌పై కేసులు పెట్టారా..? నిజంగా కేసులు పెట్టాలంటే సీఎంతో సహా అందరిపై కేసులు పెట్టాలి. ప్రగతి భవన్‌ను బాంబులు పెట్టి పేల్చాలని పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎవరైనా మాట్లాడితే అడ్డంగా నరుకుతామని మక్కన్ సింగ్ ఠాకూర్ అన్నారు. సింగరేణి ఏరియాకు, రైతుల కొనుగోలు కేంద్రానికి వెళ్దామా పొన్నం ప్ర‌భాక‌ర్ అని సుమ‌న్ స‌వాల్ విసిరారు.

తెలంగాణలోనూ ప్రజల తిరుగుబాటు వస్తుంది..

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం పట్ల ఏ వర్గం సంతృప్తిగా లేదు. నేను మాట్లాడిన అంశాలపై కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు. నాపైన పెట్టే శ్రద్ధ రైతులపై పెట్టండి. నాడు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేస్తోంది. శ్రీలంకలో, బంగ్లాదేశ్‌లో ప్రజలు తిరగబడినట్లు తెలంగాణలోనూ ప్రజల తిరుగుబాటు వస్తుంది. సీఎం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించేలోగా రైతుల సమస్యలు తీర్చాలి. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పొన్నం ప్రభాకర్ అనడం హాస్యాస్పదం. నేను కార్మికులు, రైతుల ఆక్రోశం, ఆవేదన గురించి మాట్లాడానని బాల్క సుమ‌న్ తెలిపారు.

Advertisement
Advertisement