త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bogatha Waterfalls | బొగ‌త ప‌ర‌వ‌ళ్లు.. చూస్తే క‌నువిందు..

G

Telangana | Published On Jul 3, 2026, 6.16 am IST

Bogatha Waterfalls | బొగ‌త ప‌ర‌వ‌ళ్లు.. చూస్తే క‌నువిందు..
Advertisement

Bogatha Waterfalls | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో వర్షాలు క్ర‌మంగా ఊపందుకుంటున్నాయి. దీంతో జ‌ల‌పాతాలు ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్నాయి. ములుగు (Mulugu) జిల్లా వాజేడు మండ‌లంలోని చీకుప‌ల్లి గ్రామ స‌మీపంలో ప‌చ్చ‌టి అడ‌వులు మ‌ధ్య‌నున్న తెలంగాణ న‌యాగ‌ర (Niagara of Telangana).. బొగ‌త జ‌ల‌పాతం (Bogatha Waterfalls) ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఆహ్వానం ప‌లుకుతున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా రాష్ట్రంతోపాటు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని అట‌వీ ప్రాంతంలో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో జ‌ల‌పాతానికి వ‌ర‌ద పెరిగింది. ప్ర‌కృతి అందాల‌తో క‌నువిందు చేస్తున్న ఈ దృశ్యాలు ప‌ర్యాట‌కుల‌ను, ప్ర‌కృతి ప్రేమికుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తున్నాయి.

రాష్ట్రంలో మ‌రికొన్ని జ‌ల‌పాతాలు

రాష్ట్రంలో దట్టమైన అడవులు, కొండకోనల మధ్య అనేక అందమైన జలపాతాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే జలపాతాలు ఎక్కువగా ఉన్నాయి.

కుంతల జలపాతం

తెలంగాణలోనే అత్యంత ఎత్త‌యిన జలపాతం కుంతల వాట‌ర్‌ఫాల్స్ (Kuntala Waterfalls). ఇది నిర్మల్ జిల్లాలోని నేరడిగొండ మండలంలో దట్టమైన అడవులలో, సహ్యాద్రి పర్వత శ్రేణిలో గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై ఉంది. కడెం నదిపై సుమారు 150 అడుగుల ఎత్తు నుంచి రెండు అంచెలుగా నీరు కిందికి జాలువారుతుంది. శ‌కుంత‌ల‌-దుష్యంతల క‌థ‌తో దీనికి ఈ పేరు వ‌చ్చింద‌ని న‌మ్ముతారు. ఇది హైదరాబాద్‌కు 260 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పొచ్చెర జ‌ల‌పాతం

కుంతాల జలపాతానికి సమీపంలోనే Pochera Waterfalls ఉంటుంది. ఇది చాలా వెడల్పుగా, రాతి బండల మీదుగా ప్రవహిస్తూ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది 40 అడుగుల ఎత్తు ఉండి, చాలా అందమైన గుండంలా ప్రవహిస్తుంది. కుటుంబంతో కలిసి పిక్నిక్‌ వెళ్లడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం.

మల్లెల తీర్థం

నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవుల్లో ఉన్న మల్లెల తీర్థం (Mallela Theertham) ఒక సుందర సహజ జలపాతం. ఎత్త‌యిన కొండ‌లు, దట్టమైన చెట్ల గుండా ప్రవహించే ఈ జలపాతం 150 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతుంది

సప్తగుండాల జలపాతం

కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ అడవుల్లో ఏడు గుండాల (కొలనుల) ద్వారా సప్త‌గుండాల (Saptha Gundala Waterfalls) జలపాతం ఏర్పడింది. లింగాపూర్ మండలంలోని పిట్టగూడ గ్రామానికి సమీపంలో దట్టమైన అడవుల్లో ఉన్న జలపాతానికి మిట్టె జలపాతం అని కూడా పేరు. ఇక్కడ ఏడు అందమైన జలపాతాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ప్రవహిస్తాయి. పిట్టగూడ వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అక్క‌డి నుంచి సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర దట్టమైన అడవిలో, కొండల మీదుగా ట్రెక్కింగ్ (నడక) చేసుకుంటూ ఈ జలపాతాన్ని చేరుకోవాల్సి ఉంటుంది

భీముని పాదం జలపాతం

ఇది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం, సీతానగరం దగ్గర ఉంది. ఇది 70 అడుగుల ఎత్తు నుంచి పాలధారలా కిందకు పడుతుంది.

ముత్యాల ధార జలపాతం 

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్త‌యిన జలపాతాలలో ఒకటిగా Mutyala Dhara Waterfalls గుర్తింపు పొందుతోంది. ఇది కొండపై నుంచి ముత్యాల జల్లుల మాదిరిగా కిందకు పడుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement