త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet decisions 2026 | తెలంగాణ క్యాబినేట్ నిర్ణయాలు : 6 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఇకపై టీచర్లకూ మధ్యాహ్న భోజనం!

సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు. 6 వేల మెడికల్ ఉద్యోగాలు, టీచర్లకు ఉచిత భోజనం, మూసీ ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు మంజూరు. పూర్తి వివరాలివే!

J

Telangana | Published On Jul 2, 2026, 9.15 pm IST

Telangana Cabinet decisions 2026 | తెలంగాణ క్యాబినేట్ నిర్ణయాలు : 6 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఇకపై టీచర్లకూ మధ్యాహ్న భోజనం!
Advertisement
  • కొత్తగా నిర్మిస్తున్న టిమ్స్, వరంగల్ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
  • పాఠశాలల్లో పిల్లలతో పాటు ఉపాధ్యాయులకు కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం
  • మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ఫేజ్-1 పనులకు రూ. 7,345 కోట్ల నిధులు మంజూరు
  • కేంద్రం కొత్తగా తెచ్చిన 'వీబీ జీ రామ్ జీ' చట్టంపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయం

Telangana Cabinet decisions 2026 | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలకు వేదికైంది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ మెడికల్ రంగంలో భారీగా ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలపడంతో పాటు, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం పెంచేలా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మూసీ సుందరీకరణ, కేంద్ర ప్రభుత్వ కొత్త చట్టంపై న్యాయ పోరాటం వంటి ముఖ్యమైన అంశాలపై కేబినెట్ తీసుకున్న సంచలన నిర్ణయాల పూర్తి వివరాలు ఇవే.

6 వేలకు పైగా మెడికల్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్తగా నిర్మిస్తున్న 'టిమ్స్' (TIMS) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. సనత్‌నగర్, ఎల్.బి.నగర్, అల్వాల్‌లోని టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మొత్తం 6,278 పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 1,494 రెగ్యులర్ (Regular) పోస్టులు. 549 కాంట్రాక్ట్ (Contract) బేసిక్ పోస్టులు. 4,235 ఔట్ సోర్సింగ్ (Outsourcing) పోస్టులు ఉన్నాయి.

ఈ ఆసుపత్రులను 'నిమ్స్' (NIMS) తరహాలో డెవలప్ చేయాలని, ఇక్కడ పేదలకు అందించే వైద్య సేవలకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) నుంచి LOC లు కూడా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

పిల్లలతో పాటే టీచర్లకూ మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ బడుల్లో పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలన్న సంకల్పంతో కేబినెట్ మరో అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఇకపై విద్యార్థులతో పాటే.. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారం (Breakfast), పాలు, మధ్యాహ్న భోజనం (Mid-day meal) అందించనున్నారు. దీనివల్ల వంటల నాణ్యతలో జవాబుదారీతనం పెరగడంతో పాటు రాష్ట్రంలోని దాదాపు లక్షన్నర మంది సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది.

మూసీ ఫేజ్-1 పనులకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ రూపురేఖలు మార్చే 'మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్' (Musi Riverfront Development) ఫేజ్-1 పనులకు కేబినెట్ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ ప్రవాహాలు మొదలయ్యే చోటు నుంచి బాపూఘాట్ వరకు 21 కిలోమీటర్ల మేర ఈ పనులు చేపడతారు. ఇందుకోసం రూ. 7,345.12 కోట్లను కేటాయించారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం కొత్తగా 147 పోస్టులను కూడా క్రియేట్ చేశారు.

కేంద్రం చట్టంపై సుప్రీంకోర్టుకు

ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమల్లోకి తెచ్చిన 'వీబీ జీ రామ్ జీ' (VB G Ram G) చట్టంపై రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతున్న ఈ చట్టంపై సుప్రీంకోర్టులో (Supreme Court) న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించింది. అయితే, పేద కూలీలకు పనులు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో జులై 1 నుంచి ఈ చట్టాన్ని తాత్కాలికంగా అమలు చేసేందుకు కేబినెట్ అంగీకరించింది. పార్లమెంట్‌లోనూ కేంద్రం తీరును గట్టిగా నిలదీయాలని తీర్మానించింది.

భూ కేటాయింపులు ఇలా..

తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (TGSWC) గోదాముల నిర్మాణం కోసం వరంగల్ జిల్లా బొల్లికుంటలో 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కర్కాలపహాడ్‌లో 10 ఎకరాలను మార్కెట్ రేటుకు కేటాయించారు.

జవహర్ నవోదయ విద్యాలయాల కోసం మహబూబ్‌నగర్ జిల్లా పెద్దాయిపల్లిలో 20.18 ఎకరాలు, సూర్యాపేట జిల్లా కోదాడలో 19.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు.

జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Advertisement
Advertisement