త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Power Employees Protest | విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నాకి రంగం సిద్ధం: పీఆర్సీ, 5000 ఉద్యోగాల భర్తీపై జేఏసీ సంచలన ప్రకటన!

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. పీఆర్సీ సాధన, ప్రైవేటీకరణ రద్దు, 5000 ఖాళీల భర్తీ లక్ష్యంగా జూలై 3 నుంచి నిరసనలకు పిలుపునిచ్చారు.

J

Telangana | Published On Jul 2, 2026, 11.00 pm IST

Telangana Power Employees Protest | విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నాకి రంగం సిద్ధం: పీఆర్సీ, 5000 ఉద్యోగాల భర్తీపై జేఏసీ సంచలన ప్రకటన!
Advertisement
  • పీఆర్సీ 2026 (PRC 2026) కమిటీని వెంటనే వేయాలని, ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ డిమాండ్
  • విద్యుత్ శాఖలో ఉన్న 5000 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాలు
  • YTPS లో ప్రైవేట్ టెండర్లను రద్దు చేసి, జెన్కో ఆధ్వర్యంలోనే ప్లాంట్లు నిర్మించాలని పట్టు
  • యాజమాన్యం తీరుకు నిరసనగా జూలై 3 నుంచి బ్లాక్ బ్యాడ్జీలతో నిరసన, జూలై 7న 'చలో YTPS' కార్యక్రమం

Telangana Power Employees Protest | త్రినేత్ర.న్యూస్ : విద్యుత్ సంస్థల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGPEJAC) ఆందోళన బాట పట్టింది. పీఆర్సీ, ఆర్టిజన్ల సమస్యలు, ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేదంటే జూలై 3 నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు చేపడతామని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్ వెంటనే జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

TG Power Employees Warn Govt Announce Chalo YTPS on July 7

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్ (SPDCL), ఎన్పీడీసీఎల్ (NPDCL) ఆఫీస్ బేరర్లతో జరిగిన భారీ సమావేశంలో జేఏసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జూన్ 18నే యాజమాన్యానికి తమ డిమాండ్లతో రిప్రజెంటేషన్ ఇచ్చామని, జూన్ 30 వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చిందని జేఏసీ చైర్మన్ సాయిబాబా స్పష్టం చేశారు.

జేఏసీ ప్రధాన డిమాండ్లు ఇవే..

పీఆర్సీ అండ్ పెన్షన్: పీఆర్సీ 2026 కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి. 1999 నుంచి 2004 మధ్య విధుల్లో చేరిన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ (Old Pension Scheme) విధానాన్ని వర్తింపజేయాలి.

ఉద్యోగాల భర్తీ: విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. వెంటనే 5000 ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే, ట్రాన్స్‌కో, జెన్కోలలో కొత్త సబ్‌స్టేషన్లకు తగిన మ్యాన్ పవర్‌ను కేటాయించాలి.

ఆర్టిజన్ల సమస్యలు: ఆర్టిజన్ల (Artisans) సమస్యలను యాజమాన్యం గాలికి వదిలేసింది, వాటిని వెంటనే పరిష్కరించాలి.

ప్రమోషన్లు, బదిలీలు: ఉద్యోగులందరికీ రెగ్యులర్ ప్రమోషన్లు కల్పించాలి. సాధారణ బదిలీల ప్రక్రియను మే-జూన్ మధ్యలోనే చేపట్టాలి.

ఈపీఎఫ్ (EPF) సడలింపు: ఈపీఎఫ్‌పై ఉన్న 15,000 రూపాయల సీలింగ్‌ను ఎత్తివేయాలి. రిటైర్ అయిన ఉద్యోగులకు మెడికల్ ఫెసిలిటీ కల్పించాలి.

ప్రైవేటీకరణపై తీవ్ర అభ్యంతరం

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) లోని ఏహెచ్‌పీ (AHP), సీహెచ్‌పీ (CHP) విభాగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు పిలిచిన టెండర్లను వెంటనే రద్దు చేయాలని జేఏసీ కన్వీనర్ పి. రత్నాకర్ రావు, జనరల్ సెక్రటరీ మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు మూడు సంవత్సరాలకు కలిపి 225 కోట్లతో టెండర్ ప్రతిపాదించారని, అదే పనిని జెన్కో ఉద్యోగులతో చేస్తే 200 కోట్ల లోపు ఖర్చుతోనే మెరుగ్గా చేయవచ్చని వారు వివరించారు. అనవసరంగా 55 కోట్లు అదనంగా ఎందుకు చెల్లిస్తున్నారని వారు ప్రశ్నించారు. అలాగే రామగుండం, కొత్తగూడెం (KTPS) లలో నూతన థర్మల్ ప్లాంట్లను జెన్కో ఆధ్వర్యంలోనే నిర్మించాలని వారు తీర్మానించారు.

TG Power Employees Warn Govt Announce Chalo YTPS on July 7

ఉద్యమ కార్యాచరణ (Action Plan)

డిమాండ్ల సాధన కోసం జేఏసీ కింది విధంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

బ్లాక్ బ్యాడ్జీలతో నిరసన: జూలై 03, 2026 నుంచి జూలై 07 వరకు (ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలన్నింటిలో).

గేట్ మీటింగ్స్: జూలై 03, 2026 నుంచి జూలై 06 వరకు (జెన్కో ప్లాంట్లలో).

'చలో వైటీపీఎస్' (Chalo YTPS): జూలై 07, 2026.

జూలై 7న జరిగే 'చలో వైటీపీఎస్' కార్యక్రమంలోనే తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement