త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JBM E-Buses Suspended | ఎలక్ట్రిక్ బస్సులకు బ్రేక్ వేసిన టీజీఎస్ఆర్టీసీ: సేఫ్టీ సర్టిఫికెట్ ఇస్తేనే రోడ్డెక్కుతాయి!

కరీంనగర్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంతో టీజీఎస్ఆర్టీసీ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది.

J

Telangana | Published On Jul 2, 2026, 8.55 pm IST

JBM E-Buses Suspended | ఎలక్ట్రిక్ బస్సులకు బ్రేక్ వేసిన టీజీఎస్ఆర్టీసీ: సేఫ్టీ సర్టిఫికెట్ ఇస్తేనే రోడ్డెక్కుతాయి!
Advertisement
  • వరుస బ్యాటరీ పేలుళ్ల నేపథ్యంలో JBM ఎలక్ట్రిక్ బస్సులను టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేసింది
  • జూన్ 21న కరీంనగర్ వద్ద బస్సు దగ్ధమైన ఘటన తర్వాత ప్రయాణికుల సేఫ్టీ కోసం ఈ కీలక నిర్ణయం
  • అగ్ని ప్రమాదాలపై విశ్లేషణ కోసం చైనా నుంచి బ్యాటరీ నిపుణుల బృందం రంగంలోకి
  • 100% సేఫ్టీ సర్టిఫికెట్ వచ్చి, హైదరాబాద్ బస్ భవన్‌లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటయ్యాకే సర్వీసుల పునరుద్ధరణ

JBM E-Buses Suspended | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద నడుస్తున్న 'జె.బి.ఎమ్' (JBM) ఎలక్ట్రిక్ బస్సులలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో.. ఆ బస్సు సర్వీసులను రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ప్రమాదాలకు కారణం ఏంటి?

గత నెల జూన్ 21న ఉదయం కరీంనగర్ సమీపంలోని అలుగునూర్ వద్ద ఒక JBM ఎలక్ట్రిక్ బస్సులో హై వోల్టేజ్ బ్యాటరీ వల్ల మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై ఇంకా పూర్తి రిపోర్ట్ రాకముందే, మరో ప్రమాదం జరగడంతో ఆర్టీసీ యాజమాన్యం అప్రమత్తమైంది. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో వెంటనే ఈ బస్సుల కార్యకలాపాలను అన్ని డిపోల పరిధిలో నిలిపివేసింది.

మళ్లీ నడవాలంటే కండిషన్స్ అప్లై..

ఈ బస్సులను మళ్లీ రోడ్డెక్కించాలంటే JBM సంస్థ ముందు ఆర్టీసీ కొన్ని కఠిన షరతులు పెట్టింది. ప్రమాదాలకు గల కారణాలపై అనాలసిస్ రిపోర్ట్ (Analysis Report) ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలా జరగకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ప్రతి బస్సుకు బ్యాటరీ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (Battery Fitness Certificate) ఇవ్వడంతో పాటు హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ (Command Control) సెంటర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

రంగంలోకి చైనా నిపుణులు

ఆర్టీసీ ఆదేశాలతో JBM సంస్థ అలర్ట్ అయింది. ఈ వరుస ప్రమాదాలపై అధ్యయనం చేసేందుకు తమ టెక్నికల్ టీమ్‌తో పాటు చైనా (China) నుంచి ప్రత్యేక బ్యాటరీ నిపుణుల బృందాన్ని రంగంలోకి దించింది. ఈ బృందం ప్రమాద పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి నివారణ చర్యలపై ఒక రిపోర్ట్ తయారు చేస్తోంది.

సర్వీసులు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయి?

నిపుణుల బృందం ఇచ్చే భద్రతా ప్రమాణాల రిపోర్ట్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులు ముందుగా పరిశీలిస్తారు. JBM యాజమాన్యం ఆర్టీసీ పెట్టిన షరతులన్నీ పక్కాగా పాటిస్తోందని నిర్ధారించుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుంది. ఫైనల్‌గా టెక్నికల్ బృందం "వెహికల్ ఫిట్ ఫర్ ఆపరేషన్" (Vehicle Fit for Operation) అని ధృవీకరిస్తేనే బస్సులు మళ్లీ రోడ్డెక్కుతాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణికుల సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని ఆర్టీసీ యాజమాన్యం తేల్చి చెప్పింది.

Advertisement

తాజావార్తలు

Advertisement