త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alleti Maheshwar Reddy | పొంగులేటి రాజీనామా చేయాల్సిందే

Alleti Maheshwar Reddy | రాష్ట్రంలో 22ఏ జాబితా పేరుతో లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరుగుతోందని, దీని వెనుకాల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత్ర ఉంద‌ని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

S

Telangana | Published On Aug 20, 2026, 2.36 pm IST

Alleti Maheshwar Reddy | పొంగులేటి రాజీనామా చేయాల్సిందే
Advertisement

తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డ‌ను అంటున్న‌వ్
మ‌రి మా ద‌గ్గ‌ర ఆధారాలున్న‌య్
ఆధారాలు త‌ప్ప‌యితే మేం ఏ శిక్ష‌కైనా సిద్ధం
లేదంటే భూ దందాల‌ను ఒప్పుకోవాల్సిందే
ల‌క్ష‌ల కోట్ల అవినీతి జ‌రిగిన త‌ర్వాత‌
త‌ప్ప‌యిందని క్ష‌మాప‌ణ చెబితే స‌రిపోత‌దా..?
కోమ‌టిరెడ్డి అన్న‌ట్టు కుట్ర‌దారు ఎవ‌రు..?
ముఖ్య‌మంత్రా..? పొంగులేటినా..?
నిల‌దీసిన బీజేపీఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

Alleti Maheshwar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో 22ఏ జాబితా పేరుతో లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం జరుగుతోందని, దీని వెనుకాల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత్ర ఉంద‌ని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అయితే నిన్న ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రెవెన్యూ మంత్రి పొంగులేటికి ద‌మ్ము, ధైర్యం ఉంటే గురువారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు అసెంబ్లీ మీడియా పాయింట్‌కు రావాల‌ని స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ఆధారాల‌తో ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి గురువారం మ‌ధ్యాహ్నం అసెంబ్లీ మీడియా పాయింట్‌కు వ‌చ్చారు. కానీ పొంగులేటి మాత్రం రాక‌పోవ‌డంతో.. మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏలేటి.

ఈ సంద‌ర్భంగా ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ‌త కొన్ని రోజుల నుంచి నిషేధిత జాబితా అంశం కానీ, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల గురించి బీజేపీ త‌మ గ‌ళాన్ని వినిపిస్తున్న సంగ‌తి తెలుసు. అనేక ప‌ర్యాయాలు ఈ రాష్ట్రంలో ఏ ర‌కంగా భూ దోపిడీ జ‌రుగుతుందో బీజేపీ ప్ర‌జానీకానికి చెప్పింది. గ‌త కొంత‌కాలంగా 22ఏ నిషేధిత జాబితాలో కోటి ఎక‌రాల భూమిని తీసుకొచ్చి, భూ బేర‌సారాలు చేస్తున్నారో మీ దృష్టికి తెచ్చాను. గ‌తంలో ధ‌ర‌ణిలో అవ‌త‌క‌వ‌లు జ‌రిగిన‌ప్పుడు ఎత్తేస్తాం.. ల‌క్ష‌ల కోట్ల అవినీతిని బ‌య‌ట‌పెడుతాం.. వాటితో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని నాడు పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ధ‌ర‌ణి అవ‌క‌త‌వ‌క‌ల‌పై విచార‌ణ చేయ‌కుండా.. గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం అవ‌క‌త‌వ‌ల‌కు పాల్ప‌డుతున్న‌ది. అంతేకాదు ఈ రోజు భూ భార‌తి పేరు మీద భూ హార‌తి చేస్తూ.. అమాయ‌క ప్ర‌జ‌లు 60, 100 గ‌జాల్లో ఇల్లు కట్టుకుంటే దాన్ని నిషేధిత జాబితాలో ఉంచ‌డం దుర్మార్గం అని ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు.

ల‌క్ష‌ల కోట్లు సంపాదించుకుని క్ష‌మాప‌ణ చెబితే స‌రిపోత‌దా..

నిషేధిత జాబితా భూముల అంశంపై పొంగులేటి స్పందిస్తూ త‌ప్ప‌యింది క్ష‌మించ‌మ‌ని అంటున్న‌రు. ఇది క్ష‌మించే నేర‌మా.. కావాల్సినంత వ‌ర‌కు ల‌క్ష‌లాది ఎక‌రాల భూమిని నిసేధిత జాబితాలో పెట్టి భూ దందాలు చేసి ల‌క్ష‌ల కోట్లు సంపాదించుకుని క్ష‌మాప‌ణ చెబితే స‌రిపోత‌దా.. అధికారం, ప‌ద‌విని అడ్డం పెట్టుకుని సంపాదించావు.. మా ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయంటే తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డ‌ను అని పొంగులేటి అంటుండు. మ‌రి అన్ని ఆధారాల‌తో వ‌చ్చాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ర‌మ్మ‌ని కోరాను. అసెంబ్లీ సాక్షిగా, మీడియా సాక్షిగా వ‌చ్చాను. ఆధారాలు త‌ప్ప‌యితే ఏ శిక్ష విధించినా మేం దానికి సిద్ధం. లేని ప‌క్షంలో క‌చ్చితంగా త‌ప్పిదాన్ని ఒప్పుకోని పొంగులేటి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సిందే. నీ ఆస్తుల చిట్టా, అవినీతి చిట్టా, భూ బ‌ద‌లాయింపుల‌ చిట్టా మా వ‌ద్ద ఉంది. బీజేపీ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పేద ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తూ ఊరుకోదు అని ఏలేటి స్ప‌ష్టం చేశారు.

నీ అయ్య జాగీరా..? నీకు ఏ అధికారం ఉంది..?

త‌ప్పిదం జ‌రిగింది.. అన్ని రిజిస్ట్రేష‌న్లు జ‌రుగుతున్నాయ‌ని అంటున్న‌రు. మ‌రి నిన్న జ‌ర‌గ‌ని రిజిస్ట్రేష‌న్లు ఇవాళ ఎట్ల జ‌రిగిన‌య్..? 22ఏ నిషేధిత జాబితాను ఏ విధంగా ఎత్తేస్తున్న‌రు. మీ ఇష్టానుసారంగా 22ఏలో పెడుతారు.. నిషేధిత జాబితాలో పెడుత‌రు.. మీకు న‌చ్చ‌కుంటే రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో నుంచి తీసేస్తారా..? నీ అయ్య జాగీరా..? నీకు ఏ అధికారం ఉంది..? చ‌ట్టాన్ని చేతుల్లోకి ఎట్ల తీసుకుంట‌వ్ అని అడుగుతున్న‌. ల‌క్ష‌ల కోట్లఅవినీతి జ‌రిగిన త‌ర్వాత త‌ప్పిదం జ‌రిగింద‌ని ఒప్పుకుంటే స‌రిపోదు. అవినీతికి పాల్ప‌డింది మీరు.. కానీ అధికారుల‌ను బ‌లి ప‌శువుల‌ను చేస్తున్నారని మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిప్పులు చెరిగారు.

సీబీఐ, ఈడీ ఎంక్వైరీ జ‌రిగి తీరాలి..

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అడుగుతున్నా.. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి నిన్న మాట్లాడుతూ.. దీని వెనుకాల కుట్ర ఉంద‌న్న‌రు. మ‌రి ఆ కుట్ర‌దారు ఎవ‌రు..? మీ ముఖ్య‌మంత్రా..? రెవెన్యూ మంత్రా..? ఇంకేవ‌రైనా ఉన్నారా... కోమ‌టిరెడ్డి స‌మాధానం చెప్పాలి. సీబీఐ, ఈడీ ఎంక్వైరీ జ‌రిగి తీరాలి. హౌజ్ క‌మిటీ వేయాల్సిందే.. అప్ప‌టి వ‌ర‌కు బీజేపీ పోరాటం కొన‌సాగిస్త‌ది అని ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement