త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Telangana charge sheet | హైదరాబాద్‌ను ఆగం చేశారు: బీఆర్ఎస్, కాంగ్రెస్ 12 ఏళ్ల పాలనపై బీజేపీ ‘చార్జ్ షీట్’

గత 12 ఏళ్లలో హైదరాబాద్ నగర పాలన (Urban Governance) పూర్తిగా దిగజారిపోయిందని బీజేపీ తెలంగాణ శాఖ ఆరోపించింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నగర అభివృద్ధి ఎలా కుంటుపడిందో వివరిస్తూ ఒక సమగ్ర ప్రజెంటేషన్‌ను విడుదల చేసింది.

J

Telangana | Published On Feb 5, 2026, 8.04 pm IST

BJP Telangana charge sheet | హైదరాబాద్‌ను ఆగం చేశారు: బీఆర్ఎస్, కాంగ్రెస్ 12 ఏళ్ల పాలనపై బీజేపీ ‘చార్జ్ షీట్’
Advertisement
  • గ్రేటర్ అభివృద్ధి శూన్యం
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై బీజేపీ 'చార్జ్ షీట్'
  • 12 ఏళ్ల వైఫల్యాలపై ప్రజెంటేషన్

BJP Telangana charge sheet | తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణలో పట్టణ పాలన, ముఖ్యంగా హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. గత 12 ఏళ్ల కాలంలో (10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన + ప్రస్తుత కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన) అర్బన్ గవర్నెన్స్ ఎలా నాశనమైందో వివరిస్తూ ప్రత్యేక నివేదికను ప్రజల ముందు ఉంచింది. గత 12 ఏళ్లలో హైదరాబాద్ నగర పాలన పూర్తిగా దిగజారిపోయిందని బీజేపీ తెలంగాణ శాఖ ఆరోపించింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నగర అభివృద్ధి ఎలా కుంటుపడిందో వివరిస్తూ ఒక సమగ్ర ప్రజెంటేషన్‌ను విడుదల చేసింది.

మున్సిపాలిటీలు దివాళా తీశాయి: ఎన్.రామచందర్ రావు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మాట్లాడుతూ.. మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో రూ.3,600 కోట్లు అప్పులు ఉన్నాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే రూ.5,000 కోట్ల అప్పు ఉంది. "మళ్లీ ఈ పార్టీలే గెలిస్తే, ఆ అప్పుల భారాన్ని పన్నుల రూపంలో ప్రజలపైనే వేస్తాయి," అని హెచ్చరించారు.

bjp Presentation on 12 years of erosion of Urban Governance

బీజేపీ 'చార్జ్ షీట్'లోని ప్రధాన అంశాలు:

మౌలిక సదుపాయాల వైఫల్యం: హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని చెప్పి, చిన్నపాటి వర్షానికే మునిగిపోయేలా చేశారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వాన్నంగా మారింది.

మూసీ ప్రక్షాళన పేరుతో దగా: మూసీ సుందరీకరణ, పునరుజ్జీవం పేరుతో వేల కోట్లు ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. ఇది కేవలం అవినీతికి అడ్డాగా మారింది.

నిధుల లేమి: స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసి, నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు.

సేవ్ తెలంగాణ (Save Telangana): బీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని, తెలంగాణను కాపాడుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 12 ఏళ్ల వైఫల్యాలకు చరమగీతం పాడాలని ప్రజలను కోరారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు : కిషన్ రెడ్డి

bjp Presentation on 12 years of erosion of Urban Governance

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. "2014లో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ప్రజల డబ్బును ఈ రెండు ప్రభుత్వాలు తమ సొంత జేబులుగా వాడుకున్నాయి," అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలన అక్రమ ఫోన్ ట్యాపింగ్‌లు, అధికార దుర్వినియోగంతో భయానక వాతావరణాన్ని సృష్టించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ తప్పులను సరిదిద్దాల్సింది పోయి, తెలంగాణను ‘బంగారు బాతు’లా చూస్తోందని, ఇక్కడి నిధులను ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చులకు మళ్లిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అభివృద్ధి పేరుతో ఎంఐఎం (MIM) సోదరులకు రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. "ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉంది. మరోవైపు నగరాల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా మారాయి," అని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలకు ఎంత నిధులు కేటాయించారో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement