త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్య‌నందిస్తామంటే న‌మ్ముడెట్ల‌?

Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా రాష్ట్రంలోని విద్యాసంస్థలు సంక్షోభంలో కూరుకుపోతుంటే.. విదేశీ విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు.

P

Telangana | Published On Aug 25, 2026, 3.22 pm IST

Bandi Sanjay | ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కే దిక్కులేదు.. విదేశీ విద్య‌నందిస్తామంటే న‌మ్ముడెట్ల‌?
Advertisement
  • ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి నిచ్చెనేస్తా అన్నట్లుంది సీఎం వ్య‌వ‌హారం
  • విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు
  • కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌
  • సీఎం రేవంత్‌రెడ్డిపై ధ్వ‌జ‌మెత్తిన బీజేపీ నేత‌

Bandi Sanjay | ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా రాష్ట్రంలోని విద్యాసంస్థలు సంక్షోభంలో కూరుకుపోతుంటే.. విదేశీ విద్యాసంస్థలను తెలంగాణకు తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. రాష్ట్రంలో విద్యాసంస్థలకు కనీస సౌకర్యాలు కల్పించడం చేతకాని ప్రభుత్వం ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను తీసుకొస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి నిచ్చెనలేస్తా అన్నట్లుంది ముఖ్యమంత్రి వ్యవహార శైలి’’ అని వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలతో లక్షలాది మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నా పట్టించుకోని సీఎం.. ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో విద్య అందిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు.

బ‌కాయిల‌తో సంక్షోభంలో క‌ళాశాల‌లు..

ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, నర్సింగ్‌ తదితర కోర్సులు నిర్వహించే వేలాది కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని బండి సంజయ్‌ తెలిపారు. గత ఐదేళ్లుగా బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో దాదాపు రూ.15 వేల కోట్లు పేరుకుపోయాయని పేర్కొన్నారు. అధ్యాపకులు, సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు చెల్లించలేక యాజమాన్యాలు అప్పుల పాలయ్యాయని, ఇప్పటికే పలు కళాశాలలు మూతపడ్డాయని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి ఉన్నత విద్య అభ్యసిస్తున్న దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల్లో అధికశాతం దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలకు చెందినవారేనని తెలిపారు. బకాయిలు చెల్లించకపోవడంతో వారు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సర్టిఫికెట్లు ఇవ్వకుండా అవమానిస్తున్నరు

ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వబోమని ప్రైవేట్‌ కళాశాలలు చెబుతుండటంతో విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక, పైచదువులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ తెలిపారు. కొందరు కుటుంబ ఆస్తులు అమ్ముకుని ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫీజులు చెల్లించే, చెల్లించని విద్యార్థుల పట్ల కళాశాల యాజమాన్యాలు వివక్ష చూపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రెండేళ్ల క్రితం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద చెల్లిస్తామని, ఇకపై నిర్ణీత సమయంలోనే బకాయిలు చెల్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హామీలివ్వడం, మోసం చేయడంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మించిపోయిందని విమర్శించారు.

రామచంద్రరావు దీక్షకు సంపూర్ణ మద్దతు..

ఫీజు బకాయిల సమస్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేపట్టిన ‘ఫీజు బకాయి–బీజేపీ లడాయి’ దీక్షకు బండి సంజయ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారని తెలిపారు. ‘‘ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తు, కళాశాలల మనుగడను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి. బకాయిలు చెల్లించే వరకు రామచంద్రరావు ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుంది. అతి త్వరలో ఉద్ధృత పోరాటం చేపడతాం. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని బండి సంజయ్‌ హెచ్చరించారు.

Advertisement
Advertisement