త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

V Srinivas Goud | ఇండెంట్ పెట్ట‌కుండ ఉత్త‌మ్ ఏం చేస్తున్న‌డు?

V Srinivas Goud | తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు ఇప్పటివరకు ఇండెంట్‌ పెట్టలేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు తమ వాటా నీటిని వినియోగించుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

P

Telangana | Published On Aug 25, 2026, 2.55 pm IST

V Srinivas Goud | ఇండెంట్ పెట్ట‌కుండ ఉత్త‌మ్ ఏం చేస్తున్న‌డు?
Advertisement
  • క‌ర్నాట‌క‌, ఏపీ వాటాల‌ను వాడుకుంటున్న‌య్‌
  • ఆల్మ‌ట్టి డ్యామ్ ఎత్తు కోసం భూసేక‌ర‌ణ చేస్తున్నా స్పంద‌న లేదు
  • టీ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ప‌ట్టింపు లేదు
  • కొంద‌రి కుట్ర‌ల‌తో నీటియుద్ధాలు వ‌చ్చే ప‌రిస్థితి
  • మాజీ మంత్రి వీ శ్రీ‌నివాస్‌గౌడ్‌

V Srinivas Goud | తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు ఇప్పటివరకు ఇండెంట్‌ పెట్టలేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు తమ వాటా నీటిని వినియోగించుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. ‘‘తుంగభద్ర నుంచి నీటి కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి బోర్డుకు ఇండెంట్ పెట్ట‌లేదు. కర్ణాటక, ఏపీ నీటిని వాడుకుంటున్నా.. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నారు? కనీసం పట్టించుకోవడం లేదా?’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. రేపో, మాపో నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందిస్తామని తెలిపారు.

ఆర్డీఎస్‌ను తుంగభద్ర బోర్డులోకి తేవాలి..

ఆర్డీఎస్‌ను కూడా తుంగభద్ర బోర్డు పరిధిలోకి తీసుకురావాలని శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంపు కోసం కర్ణాటక భూసేకరణ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31న ప్రారంభిస్తున్నారని, వరదలు లేని సమయంలో ప్రాజెక్టును ప్రారంభించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ‘‘కొంత మంది చేసే కుట్రల వల్ల నీటి యుద్ధాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పాలమూరు ప్రాజెక్టులు ఎండబెట్టి వారు నీరు తీసుకునేలా వదిలిపెడుతున్నారు. ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదు, మంత్రి ఉత్తమ్‌కు సోయి లేదు. అంతర్గత కుమ్ములాటలు తప్ప.. రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ట్రైబ్యునల్‌ ముందు వాదనల కోసం వెలిగొండను కావాలనే ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిని అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా తరలిస్తున్న నీటికి లెక్కే లేకుండా పోయిందన్నారు.

రెండు కోట్ల మంది పరిస్థితి ఏంటీ?

‘‘బుల్లెట్‌ ట్రైన్‌ వస్తే హైదరాబాద్‌ నుంచి అమరావతికి రోజూ అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తారు. 74 లక్షల మందికి సగం నీళ్లు అడిగితే.. రెండు కోట్ల మంది పరిస్థితి ఏమిటి?’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. గత పదేళ్లుగా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. పాలమూరు పంపులు నడపవద్దని ఏపీ సీఎం చెబుతున్నారా? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో విపరీతంగా దుష్ప్రచారం చేశారని, మరమ్మతులు చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం ఎన్‌డీఎస్‌ఏ, సీడబ్ల్యూఫీఆర్‌ఎస్‌ స్పష్టంగా తేల్చిన తర్వాతైనా పాలమూరు, కన్నెపల్లి పంపులను ఆన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘ఎల్‌నినో పేరుతో నీరు ఇవ్వకపోతే రైతులు ఊళ్లలో తిరగనివ్వరు.. జాగ్రత్త. ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్రపోతే ఎలా? పంటలు ఎండబెడితే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్‌ఎస్‌ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో ఉన్న పంపులను ఆన్‌ చేయకపోతే మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకుంటున్నా, వెలిగొండ ప్రారంభిస్తున్నా నోరు మెదపడం లేదని విమర్శించారు.

ఆరోపణలు చూసి షాక్‌ అయ్యా..

తనపై వచ్చిన ఆరోపణలపై కూడా శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. ‘‘నాపై వచ్చిన ఆరోపణలు చూసి షాక్‌ అయ్యాను. అమ్మాయి బాబాయ్‌ నాతో మాట్లాడారు. ఎలాంటి సంబంధం లేదని చెప్పారు’’ అని తెలిపారు. గతంలో ఓ ఉద్యోగి తప్పు చేశాడని తెలియగానే అతన్ని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించానని చెప్పారు. తనను ఎంతో ఆదరించి ప్రోత్సహించారని ఆ ఉద్యోగి చెప్పారని వివరించారు. ‘‘బీజేపీ, కాంగ్రెస్‌లో కొందరు లోఫర్‌గాళ్లు ఎదుటి వ్యక్తిని డ్యామేజ్‌ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయి ఏదో మాట్లాడితే రెండు పార్టీలు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఆదరణ ఉందని, నేను సమస్యలపై మాట్లాడుతున్నానని నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చీప్‌ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారు’’ అని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, న్యాయవాదులతో మాట్లాడుతున్నానని శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

రైతాంగంపై సీఎంకు చిత్తశుద్ధి లేదు..

మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ‘‘పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్‌రెడ్డికి పాలమూరుపై అవగాహన లేదు. 300 కిలోమీటర్లు ప్రవహించే కృష్ణా నదిపై రేవంత్‌రెడ్డికి అసలే అవగాహన లేదు’’ అని విమర్శించారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 6.5 టీఎంసీలేనని, భీమా, నెట్టెంపాడు కింద పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. తుంగభద్రపై ఉన్న ఆర్డీఎస్‌ కింద 90 వేల ఎకరాల రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడక ముందు పాలమూరు అత్యంత పేద జిల్లాగా ఉండేదని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వలస వెళ్లిన వారు తిరిగి వచ్చారని జైపాల్‌యాదవ్‌ అన్నారు. కేసీఆర్‌ హయాంలో నార్లాపూర్‌ పంపులను ఆన్‌ చేశారని గుర్తుచేశారు.

మూడు బడ్జెట్లలో ఒక్క రూపాయి ఇవ్వలే..

పాలమూరు రైతాంగంపై రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే నిర్లక్ష్యం చేస్తున్నారని జైపాల్‌యాదవ్‌ ఆరోపించారు. ‘‘మూడు బడ్జెట్లలో పాలమూరుకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్‌ రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారు. పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి రైతులకు చేసింది ఏం లేదు’’ అని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి భూములు కబ్జా చేయడమే సరిపోతుందని విమర్శించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పేవన్నీ ఉత్తర ప్రగల్భాలేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం రైతులను ప్రభుత్వం మభ్యపెట్టిందని ఆరోపించారు. కాకమ్మ కబుర్లు మాని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement