త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న‌ది: కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌

G

Telangana | Published On Mar 11, 2026, 1.40 pm IST

Bandi Sanjay | కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న‌ది: కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్‌: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై అనర్హత పిటిషన్‌ను డిస్మిస్ చేయడం దారుణమ‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) అన్నారు. కాంగ్రెస్ (Congress) పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు. కన్నతల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో.. శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పాపమ‌ని చెప్పారు. శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఇచ్చార‌ని మండిప‌డ్డారు.

బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎంపీగా పోటీ చేసినా అనర్హత వేటు వర్తించకపోవడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసినా పార్టీ ఫిరాయించలేదని చెప్పడం హాస్యాస్పదమ‌ని చెప్పారు. గాంధీభవన్‌లో సంసారం చేస్తూ.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నా ఫిరాయింపులు వర్తించకపోవడం ప్రజాస్వామ్యానికే చేట‌ని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించింది నిజం కాదా అని ప్ర‌శ్నించారు. దీనిపై సీఎం రేవంత్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

శాసన వ్యవస్థపై ప్రజలకు పూర్తిగా నమ్మకం కోల్పోయేలా స్పీకర్ తీర్పు ఇచ్చారని విమ‌ర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను కాంగ్రెస్ ఆఫీసులో బంధించాలని చూస్తున్నారని చెప్పారు. శాసనసభ స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించాలే తప్ప డూప్లికేట్ గాంధీ కుటుంబానికి తాబేదారులా వ్యవహరించ కూడదని మండిప‌డ్డారు. ప్రజాస్వామ్యవాదులు నోరు విప్పాల‌న్నారు. పూర్తిగా గాడి తప్పిన శాసన వ్యవస్థను దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రజలదేన‌ని చెప్పారు.

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేమ‌న్నారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామ‌ని స్ప‌ష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై త‌మ‌కు సంపూర్ణ నమ్మకం ఉంద‌ని చెప్పారు. బెంగాల్‌లో అనర్హత పిటిషన్‌పై స్పీకర్ ఇదే తరహా తీర్పు ఇస్తే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో కొట్టేసింద‌న్నారు. తెలంగాణలోనూ ఫిరాయింపులపై చెంప చెళ్లుమనేలా న్యాయ వ్యవస్థ తీర్పు ఇస్తుందనే నమ్మకం ఉందని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement